ఎడపల్లి, మే 11 : కూరగాయల సాగులో అద్భుతంగా రాణిస్తున్నాడీ యువ రైతు. 30 గుంటల్లో తీరొక్క కూరగాయలను పండిస్తూ లాభాలు సాధిస్తున్నాడు. సాగులో ఆధునిక పద్ధతులు పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. బీరకాయ, గోబి పువ్వు, మిరప తదితర పంటలను సాగు చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు ఎడపల్లి మండలం దుబ్బతండాకు చెందిన యువరైతు నేనావత్ దిలీప్.
స్నేహితుల ఆలోచనతో మొదలు..
తనకున్న ఎకరం భూమి లో కూరగాయలు సాగు చేస్తుండడంతోపాటు దళారులను ఆశ్రయించకుండా వారాంతపు సంతలో విక్రయిస్తున్నాడు. దీంతో వేలల్లో సంపాదిస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. గతంలో కూలీ పనులు చేస్తూ చాలీచాలని సంపాదనతో కాలం వెల్లదీశాడు. ఆ సమయంలో స్నేహితులు ఇచ్చిన సలహా మేరకు తనకున్న ఎకరం భూమిలోని 30 గుంటల్లో కూరగాయలు సాగు చేసేందుకు నిర్ణయించుకున్నాడు. బీరకాయ, గోబి పువ్వు, మిరప సాగు చేస్తూ మంచి లాభా లు సాధిస్తున్నాడు. నాలుగేండ్లుగా తీరొక్క కూరగాయలు పండిస్తున్నాడు.
నెలకు రూ.30వేల వరకు సంపాదన..
కూరగాయల సాగులో దిలీప్ కుటుంబసభ్యులు సైతం భాగస్వామ్యులవుతున్నారు. మార్కెట్లో మంచి గిరాకీ ఉన్న బీరకాయ, గోబి పువ్వును ప్రధానంగా పండిస్తూ 5 గుంటల్లో మిరపను సాగు చేస్తున్నాడు. తెగులు, చీడ పురుగులు ఆశించకుండా వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తూ సస్యరక్షణ చర్యలు చేపడుతున్నాడు. పంట చేతికి రాగానే తన కుటుంబీకులతో కలిసి వారాంతపు సంతలో విక్రయిస్తున్నాడు. నెలవారీ ఖర్చులు పోను రూ.20వేల నుంచి రూ.30వేల వరకు సంపాదిస్తున్నాడు.