బాన్సువాడ ఎడ్యుకేషన్ హబ్గా మారుతున్నది. ఇప్పటికే ఇక్కడ అనేక విద్యాసంస్థలు కొలువు దీరాయి. బాన్సువాడలో ఏర్పాటుచేసిన బీఎస్సీ నర్సింగ్ కళాశాల ఎంతో మంది విద్యార్థినులకు వరంగా మారింది.
బాన్సువాడ, ఫిబ్రవరి 2 : కరోనా దెబ్బకు ప్రపంచమే వణికిపోయింది. మహమ్మారి కాటుతో ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. గత రెండేండ్లు బతికుంటే చాలంటూ కాలుకూడా బయటపెట్టలేదు. వైరస్ సోకినవారి దరిదాపులకు వెళ్లేందుకు ఆప్తులు సైతం వెనుకాడారు. అలాంటి భయానక వాతావరణంలోనూ పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలందించారు. ఇందులో ప్రధానంగా రోగితోనే ఉంటూ తమ ప్రాణాలను అడ్డుపెట్టిన వైద్యసిబ్బంది గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రాత్రింబవళ్లూ సేవే లక్ష్యంతో పనిచేసే నర్సులు.. ఈ రంగాన్ని ఉపాధి మార్గంగానూ ఎంచుకొని కుటుంబానికి ఆర్థికబాసటగా నిలుస్తున్నారు.
సరైన సమయంలో వైద్యసేవలు అందక దయనీయ స్థితిలో ఉన్నవారిని చూసి చలించిపోయిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి.. తన నియోజకవర్గంలో అలాంటి పరిస్థితులు పునరావృతం కావొద్దని సంకల్పించారు. బాన్సువాడ పట్టణాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దిన ఆయన.. సీఎం కేసీఆర్ సహకారంతో 30 పడకల ఏరియా దవాఖానను వంద పడకలకు అప్గ్రేడ్ చేయించారు. తల్లీబిడ్డల సంరక్షణలో భాగంగా మరో వంద పడకల మాతాశిశు దవాఖాన ఏర్పాటు చేయించారు. బాలికలకు ఉపాధి కల్పించడంతోపాటు పేద ప్రజలకు సేవలందించే లక్ష్యంతో బీఎస్సీ నర్సింగ్ కళాశాలను మంజూరు చేయించారు. రాష్ట్రవ్యాప్తంగా కేవలం ఏడు బీఎస్సీ నర్సింగ్ ప్రభుత్వ కళాశాలలు ఉన్నా యి. ఇవన్నీ జిల్లా కేంద్రాల్లోనే ఏర్పాటుచేయగా, కామారెడ్డి జిల్లాకు మాత్రం సభాపతి పట్టుబట్టి బాన్సువాడ పట్టణానికి తీసుకువచ్చారు. 2022లో అడ్మిషన్లు తీసుకొని వందమంది విద్యార్థులతో మాతాశిశు దవాఖానలో తరగతులను ప్రారంభించారు. ఈ ఏడాది మరో వందమంది బాలికలు నర్సింగ్ విద్యను అభ్యసిస్తుండగా, తాత్కాలికంగా ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలలో బోధిస్తున్నారు.
గతేడాది ప్రారంభమైన నర్సింగ్ కళాశాలలో ప్రస్తుతం ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు కొనసాగుతున్నాయి. కళాశాల శాశ్వత భవనం లేనందున మొదటి ఏడాది వందమంది విద్యార్థినులకు మాతాశిశు దవాఖానలో తరగతులు నిర్వహిస్తూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హాస్టల్ వసతి కల్పించారు. ప్రస్తుతం ఫస్ట్, సెకండియర్ విద్యార్థినులు 200 మంది ఉన్నారు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలలో తరగతులు, ఎస్టీ హాస్టల్లో వసతి కల్పించారు. కళాశాలకు మొత్తం 48 సిబ్బందిని నియమించారు. ప్రిన్సిపాల్తోపాటు ఏడుగురు లెక్చరర్లు, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఏవో, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, మిగితా వారిని ఔట్సోర్సింగ్ విధానంలో విధుల్లోకి తీసుకున్నారు. విద్యార్థులకు తరగతులతోపాటు ఆయా ప్రభుత్వ దవాఖానల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. కొందరికి స్థానికంగా ఉన్న వంద పడకల మాతాశిశు దవాఖాన, మరికొందరిని కామారెడ్డిలోని జిల్లా దవాఖానకు తీసుకెళ్లి శిక్షణ ఇస్తున్నారు.
నాలుగేండ్ల బీఎస్సీ నర్సింగ్ కళాశాల ప్రస్తుతం తాత్కాలిక భవనంలో కొనసాగుతున్నది. శాశ్వత భవన నిర్మాణం కోసం స్పీకర్ పోచారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.40కోట్లు మంజూరు చేయించారు. బాన్సువాడ మండల పరిధిలోని ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో నర్సింగ్ కాలేజ్ నిర్మించేందుకు ఐదెకరాలను కేటాయించగా, ప్రస్తుతం భవన నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
బాలురు ఎక్కడికైనా వెళ్లి చదువుకుంటారు. దూర ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లేందుకు బాలికలు భయపడతారు. ఆడబిడ్డలకు స్థానికంగానే చదువుకునే అవకాశాలు కల్పించాలనే సంకల్పంతోనే బాన్సువాడను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతున్నాం. 1994లోనే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ను తెచ్చా. పేదింటి ఆడబిడ్డలు త్వరగా స్థిరపడేందుకు నర్సింగ్ కోర్సు మంచి అవకాశమని భావించి సీఎం కేసీఆర్ సహకారంతో బీఎస్సీ నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయించాం.
-పోచారం శ్రీనివాస రెడ్డి , స్పీకర్
రాష్ట్ర ప్రభుత్వ ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నది. సర్కారు దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. ఇందుకోసం సిబ్బంది అవసరం. బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసిన బాలికలకు త్వరగా ఉపాధి దొరుతుకుంది. ప్రైవేటు దవాఖాన ల్లోనూ మంచి వేతనాలు ఇస్తున్నారు. బాన్సువాడలో బీఎస్సీ నర్సింగ్ కళాశాల ఉండడం స్థానికుల అదృష్టం. పేదల కోసం కళాశాల ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం, మంత్రి ప్రశాంత్రెడ్డికి ధన్యవాదాలు.
– పోచారం భాస్కర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్
బాన్సువాడలో బీఎస్సీ నర్సింగ్ కళాశాల నిర్వహించడం కష్టమేమోనని భావించాం. కానీ స్పీకర్ పోచారం ప్రత్యేక చొరవ తీసుకొని పూర్తిగా సహకరిస్తున్నారు. అవకాశం ఉన్నప్పుడల్లా కళాశాలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. చిన్నచిన్న ఇబ్బందులు కూడా రానివ్వకుండా ఏర్పాట్లు చేయిస్తున్నారు. విద్యార్థినులు, సిబ్బందిని తన సొంతబిడ్డల్లా చూసుకుంటారు.
-హన్సిలీ, ప్రిన్సిపాల్, బీఎస్సీ నర్సింగ్ కళాశాల
బాన్సువాడ నర్సింగ్ కళాశాలలో నా కూతురుకు గతేడాది సీట్ వచ్చింది. బీఎస్సీ నర్సింగ్కు మంచి డిమాండ్ ఉండడంతో ప్రైవేటు కాలేజీలు రూ.లక్షల్లో ఫీజలు వసూలు చేస్తారు. చాలామంది పేదలు తమ బిడ్డలు సొంత కాళ్లపై నిలబడేందుకు నర్సింగ్ రంగాన్ని ఎంచుకుంటారు. అలాంటివారి కోసం బాన్సువాడలోని కళాశాల వరం లాంటిది. ఈ అవకాశం కల్పించిన స్పీకర్ పోచారం సార్కు రుణపడి ఉంటాం.
-బండారి తుకారం, నర్సింగ్ విద్యార్థిని తండ్రి, కొల్లూర్ సర్పంచ్