గిరిజనం మురిసింది. ప్రతీ తండా పరవశించింది. ‘పట్టా’భిషిక్తులైన అడవి బిడ్డల ఆనందానికి అంతే లేకుండా పోయింది. అడవి భూములు సాగు చేసుకుంటున్న వారికి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పట్టాలు కట్టబెట్టింది. అలాగే, సంక్షేమ పథకాలు సైతం వర్తింపజేస్తున్నది. ఏండ్ల సంది ఎదురుచూసిన పట్టాలు చేతికి రావడంతో పోడు రైతుల్లో ఆనందం వెల్లివిరిస్తున్నది. రైతుబంధు, రైతుబీమా కూడా వర్తిస్తుండడంతో గిరిజనుల్లో కొత్త ఉత్సాహం నెలకొన్నది. ప్రతీ తండాలో పండుగ వాతావరణం కనిపిస్తున్నది. ఇన్నాళ్లు జమ్లాత్లకు భయపడిన గిరిపుత్రులు ఇక దర్జాగా పంటలు పండించనున్నారు. సీఎం కేసీఆర్ కృషితో సొంతమైన భూముల్లో సిరుల సాగుకు శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలో పట్టా అందుకున్న ఏ ఒక్కరిని కదిలించినా ఒకటే మాట చెబుతున్నారు. తమను పట్టాదారులుగా మార్చిన ముఖ్యమంత్రికి జీవితాంతం
రుణపడి ఉంటామంటున్నారు.
– నమస్తే తెలంగాణ యంత్రాంగం
పోడుభూములకు శాశ్వత పరిష్కారం చూపుతాం.. పోడు భూములను సాగు చేసుకునే రైతులకు పట్టాలిస్తాం. గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. పోడు భూములకు పట్టాలే కాదు రైతుబంధూ అందిస్తాం.. అని సీఎం కేసీఆర్ గిరిజనులకు ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నారు. మాటిచ్చినట్లే పోడు భూముల పట్టాలు చేతికి అందించారని రైతులు, గిరిజనులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అడవిబిడ్డల కల నెరవేరడంతో సంబురాలు చేసుకుంటున్నారు. ఇక నుంచి దర్జాగా వ్యవసాయం చేసుకుంటామని పేర్కొంటున్నారు. పోడు పట్టాలు ఇవ్వడంతోపాటు రైతుబంధును కూడా అమలు చేయడంతో పెట్టుబడికీ రంది లేకుండా పోయిందని సంతోషపడుతున్నారు. ఏండ్లనాటి కలను సాకారం చేసిన సీఎం కేసీఆర్ సల్లంగుండాలె.. అని జేజేలు పలుకుతున్నారు.
ఇందల్వాయి, జూలై 1: పోడు రైతులకు పట్టాలిస్తానని సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన మాట నెరవేర్చిండు. 75 ఏండ్లలో సాధ్యం కాని పని తొమ్మిదేండ్లలోనే చేసి చూపించిండు. సీఎం కేసీఆర్ దయతో మాకు పట్టా పాసు పుస్తకం దక్కింది.
– చిత్తూరి సాయవ్వ, అన్సాన్పల్లి
బీర్కూర్, జూలై 1: మా తాతల కాలం నుంచి మల్లాపూర్ శివారులో 1.10 ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ బతుకుతున్నాం. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం పోడు భూమి పట్టాలు ఇచ్చి మా కుటుంబాన్ని ఆదుకున్నారు. ప్రతి సంవత్సరం పంట వేసేటప్పుడు ఆఫీసర్లతో మాకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. పోచారం సారు చేతుల మీదుగా పట్టా తీసుకునేటప్పుడు చెప్పలేని ఆనందం అనిపించింది.
– నేనావత్ అంబర్సింగ్,రైతు, బీర్కూర్ తండా
బాన్సువాడటౌన్, జూలై 1: ఇప్పటివరకు ఎంతో మంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు వచ్చిండ్రు. ఓట్ల ముందు మా బాగోగులు చూసి బాధలు తీరుస్తామని చెప్పిండ్రు. ఓట్లు అయిపోయిన తర్వాత మా బాధలు పట్టించుకున్నోళ్లే లేరు. మా గిరిజనుల బతుకుదెరువు గురించి ఆలోచించిన సీఎం కేసీఆర్ సారు మా భూమి పట్టా కాయితం మాకు అప్పజెప్పిండు. సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం సార్లకు రుణపడి ఉంటాం.
– కేదావత్ లక్ష్మి, బాన్సువాడ
బాన్సువాడటౌన్ : మేము గిరిజనులం. అడవిలో బతికేటోళ్లం. మాకు ప్రత్యేకంగా బతుకుదెరువు ఏమీ ఉండదు. మా పొట్టకూటి కోసం కొద్దిపాటి భూమిని సాగు చేసి మా కడుపు నింపుకొంటాం. పంట వేద్దామంటే ఖానూన్లు చెప్పి బాగా ఇబ్బంది పెట్టేవారు. దీనికి పరిష్కారమార్గం ఎప్పుడు దొరుకుతుందా? అని దేవుడికి మొక్కని రోజే లేదు. సీఎం కేసీఆర్ దేవుడి రూపంలో వచ్చి ఇచ్చిన మాట తప్పకుండా పట్టాలు ఇచ్చిం డు. కేసీఆర్ సారు సల్లగుండాలె.
– కెదావత్ అన్షి, బాన్సువాడ
ఇందల్వాయి, జూలై 1: మేము మూడు ఎకరాల పది గుంటల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్లం. ఏండ్లుగా పంట వేసి పట్టాపాసు పుస్తకాల కోసం వేచి చూసేవాళ్లం. తండాలో చాలా మందికి రైతుబంధు డబ్బులు పడుతుంటే మాకు రాకపోవడంతో బాధగా ఉండేది. పాస్ పుస్తకం లేక చాలా తిప్పలైంది. వడ్లు అమ్మే పరిస్థితి కూడా లేకపోయింది. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత పోడు పట్టాలు ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాం. కేసీఆర్ సారు మేలు మరువలేం.
– బానావత్ లక్ష్మి, గోల్యానాయక్ తండా
బీర్కూర్, జూలై 1: నాకు మల్లాపూర్ శివారులో 3.05 ఎకరాల భూమి ఉన్నది. 40 ఏండ్లకు పైగా గీ భూమిలోనే ఎవుసం చేసుకొని బతుకుతున్నం. పెట్టుబడి కోసం అప్పులు చేసుడు మిత్తితో సహా కట్టుడు అయితుంది. కేసీఆర్ సారు మాకు పోడు పట్టాలు ఇచ్చుడే కాకుండా రైతుబంధు డబ్బులను సైతం అందించడంతో ఇక ఏ సేటు దగ్గరా అప్పు చేయకుండా మా జేబుల పైసలతోనే దర్జాగా ఎవుసం చేసుకుంటాం.
– ఇస్లావత్ శివరాం, రైతు, బీర్కూర్ తండా
పిట్లం, జూలై 1: పోడు రైతులకు పట్టా పాస్పుస్తకాలు అందించడమే మా గిరిజనులకు అసలైన పండుగ. నాకు పిట్లం మండలం కోమటిచెర్వు తండాలో ఎకరం భూమి ఉన్నది. ఆ భూమికి పోడు పట్టా పాస్పుస్తకం ఇచ్చిండ్రు. చాలా సంతోషంగా ఉన్నది. సీఎం కేసీఆర్ గిరిజనులకు ఇచ్చిన మాటపై పట్టా పాస్పుస్తకాలు ఇచ్చి అండగా నిలిచారు.
– సుమిత్రాబాయి,
కోమటిచెర్వు తండా, పిట్లం
పిట్లం : సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో గిరిజనుల కల ఫలించింది. మేము 2.5 ఎకరాల భూమిని సాగు చేస్తున్నాం. మా తాతల కాలం నుంచి భూమిని సాగు చేయగా పాస్పుస్తకాలు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. పోడు భూముల పట్టా పాస్పుస్తకాలల్లో నాకు కొత్త పట్టా పాస్పుస్తకం వచ్చింది. మాకు రైతుబంధు కూడా వస్తదంట. ఏండ్ల నాటి కల నెరవేరింది.
– రవినాయక్, గౌరారం తండా, పిట్లం
నాగిరెడ్డిపేట్, జూలై 1: సీఎం కేసీఆర్ సార్ ఎలక్షన్లప్పుడు పట్టాలిస్తానని మాటిచ్చిండు. చెప్పినట్లనే గిప్పుడు పట్టాలు మా చేతుల వెట్టిండు. గీ భూములను నమ్ముకొనే బతుకుతున్నం. పట్టాలిచ్చి రంది లేకుండా చేసిండు. రైతుబంధు కూడా ఇస్తున్నడు. గిప్పుడు ఏ బాధలేకుంటా ఎవుసం జేసుకుంటం.
– ధనావత్ పార్వతి, రాంతండా, పల్లెబొగుడ తండా పరిధి
నాగిరెడ్డిపేట్ : ఏండ్లుగా పోడు భూములను నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటున్నాం. పట్టా పుస్తకం వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఈ పట్టాతో మా కల నెరవేరింది. మా భూమి మాదేనన్న ధైర్యం కేసీఆర్ సార్ ఇచ్చిండు. ఎంతకాలం నుంచో ఎదురుచూస్తున్న మాకు చాలా సంతోషంగా ఉన్నది. పట్టాతోపాటు రైతుబంధు కూడా ఇస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– ధనావత్ గోపాల్, రాంతండా, పల్లెబొగుడ తండా పరిధి