జిల్లాలో ఆర్ఎంపీ, పీఎంపీల ధనదాహం తారాస్థాయికి చేరుతున్నది. తెలిసీ తెలియని పరిజ్ఞానంతో ఆర్ఎంపీ, పీఎంపీలు హద్దుదాటి వైద్యం చేస్తుండడంతో అమాయకులు బలవుతున్నారు. నిబంధనల మేరకు ఆర్ఎంపీ, పీఎంపీ క్లినిక్లలో ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. సూది మందు, స్లైన్లు ఎక్కించకూడదు. కానీ అడిగేవారు లేకపోవడంతో ఏకంగా అత్యవసర కేసులను ఎల్లవేళలా చూస్తామని బోర్డులే పెట్టేస్తున్నారు. క్లినిక్లలోనే మందుల దుకాణాలు నిర్వహిస్తూ నిబంధనలు అతిక్రమిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఏకంగా పడకలను సైతం ఏర్పాటు చేసుకొని స్లైన్లు ఎక్కిస్తున్నారు. ప్రథమ చికిత్సను మరిచి సొంతంగా మందులు రాసివ్వడం, వారే విక్రయించడం చేస్తున్నారు. నగరాలతోపాటు మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లోనూ ఆర్ఎంపీ, పీఎంపీలు ఆడిందే ఆటగా సాగుతున్నది.
ప్రైవేటు దవాఖానలు, డయాగ్నోస్టిక్ సెంటర్లతో చేసుకున్న ముందస్తు ఒప్పందాలతో తమ వద్దకు వచ్చే వారిని ఆర్ఎంపీలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పరీక్షల పేరుతో ల్యాబ్లకు, మెరుగైన వైద్యం పేరుతో ప్రైవేటు దవాఖానలకు పంపుతూ కాసుల పంట పండించి, అందినకాడికి వెనకేసుకుంటున్నారు. తాము చెప్పిన దవాఖానకు వెళ్లకుంటే మరోసారి సంప్రదించే జనాలకు ప్రథమ చికిత్స చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. జిల్లాలో పట్టణాలు, పల్లెల్లో కలిపి సుమారు 3 వేల వరకు ఆర్ఎంపీ, పీఎంపీలు ఉన్నారు. ప్రైవేట్ దవాఖానల నిర్వాహకులు ఆర్ఎంపీ, పీఎంపీల వివరాలను సేకరించి వారిని సంప్రదిస్తున్నారు. దవాఖానలో చేరిన రోగి బిల్లులో 40 నుంచి 50శాతానికి పైగా కమీషన్ ఇచ్చేలా ముందస్తుగానే ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఒప్పందం ప్రకారం వారం, నెలకోసారి కమిషన్ ముట్టజెబుతున్నారు. ఎక్కువ మంది రోగులను పంపిన వారికి గోవా, బ్యాంకాక్ ట్రిప్పులను సైతం ఆఫర్ చేస్తుండడం విశేషం. ఇదే అదనుగా కొంతమంది ఆర్ఎంపీ, పీఎంపీలు తాము పంపించే దవాఖానలో తక్కువ ఫీజు తీసుకుంటారంటూ రోగులను ప్రైవేటు దవాఖానలకు పంపి కమీషన్లు దండుకుంటున్నారు.
ఆర్ఎంపీ, పీఎంపీల ఆగడాలపై కొందరు ఫిర్యాదు చేయగా కొంతమంది జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలోకి వచ్చి సిబ్బందికి ముడుపులు చెల్లించుకుంటున్నట్లు సమాచారం. ఇటీవలె ఆర్మూర్లో రెండు క్లినిక్లు, అర్సపల్లిలో ఒక క్లినిక్ సీజ్ చేసినప్పటికీ యూనియన్ల పేరిట కమిషన్లు ఇచ్చి మళ్లీ తెరిపిస్తున్నట్లు తెలిసింది.
జిల్లాలో ప్రైవేటు దవాఖానలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. నగరంలోనే 400వరకు ప్రైవేట్ దవాఖానలు ఉండగా, ఇందులో 50వరకు మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానలు ఉన్నాయి. పేరుకు మాత్రమే మల్టీ స్పెషాలిటీ దవాఖానలు కాగా అందులో ఒకరు లేదా ఇద్దరు డాక్టర్లు మాత్రమే సేవలందిస్తారు. సిబ్బంది ఉండరు. బిల్లులు మాత్రం లక్షల్లో ఉంటాయి. పీఎంపీ, ఆర్ఎంపీలు రిఫరల్ చేయడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తున్నది. ఒకప్పుడు ఎంబీబీఎస్, ఎండీ ఆపైన చదివిన వారు మాత్రమే క్లినిక్లు పెట్టుకొని రోగులకు వైద్యం చేసేవారు. ఇప్పుడు వైద్యం వ్యాపారంగా మారింది. ముగ్గురు, నలుగురు కలిసి ఈ దందాలోకి దిగుతున్నారు. భవనాలను అద్దెకు తీసుకొని వైద్యులను నియమించుకొని దవాఖానలు ఏర్పాటుచేస్తున్నారు. పెట్టిన పెట్టుబడి కేవలం ఏడాదిలోపే సంపాదించేలా ప్రణాళిక వేసుకొని కమీషన్ల దందాకు తెరతీస్తున్నారు. ఇందుకోసం గ్రామాల్లోని ఆర్ఎంపీ, పీఎంపీలతో కమీషన్లు మాట్లాడుకుంటుండడం విశేషం.
జిల్లా వ్యాప్తంగా 44 పీహెచ్సీ సెంటర్లు ఉన్నాయి. ఎంబీబీఎస్, ఎండీ, నర్సింగ్ చేసిన వారు సేవలందిస్తున్నారు. కానీ ప్రజలు పీఎంపీ, ఆర్ఎంపీలను సంప్రదించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రజల్లో అవగాహన లేకనే రోగులను ఆర్ఎంపీ, పీఎంపీలు మోసం చేస్తూ కమీషన్ల కోసం ప్రైవేట్ దవాఖానలకు రిఫర్ చేస్తున్నారు. వాళ్లు చెప్పే మాటలను నమ్మి మోసపోతున్నారు. జిల్లాలో ప్రస్తుతం మూడు ఆర్ఎంపీ, పీఎంపీ యూనియన్లు ఉన్నాయి. గతంలో చాలాసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోవడం లేదు.