కామారెడ్డి/ ఖలీల్వాడి, ఫిబ్రవరి 29: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. పాత నోటిఫికేషన్ను రద్దు చేస్తూ డీఎస్సీ కొత్త నోటిఫికేషన్ను గురువారం విడుదల చేసింది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు 601 పోస్టులు, కామారెడ్డి జిల్లాలో 506 పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది. నిజామాబాద్ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ 124, లాంగ్వేజ్ పండిట్ 23, పీఈటీ 9, ఎస్జీటీ 403, స్పెషల్ ఎడ్యుకేటర్ విభాగంలో స్కూల్ అసిస్టెంట్ 11, ఎస్జీటీ 31 పోస్టులు ఉన్నాయి.
కామారెడ్డి జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ 121, లాంగ్వేజ్ పండిట్ 15, పీఈటీ 5, ఎస్జీటీ 318, స్పెషల్ ఎడ్యుకేటర్ విభాగంలో స్కూల్ అసిస్టెంట్ 11, ఎస్జీటీ 36 పోస్టులు భర్తీ కానున్నాయి. తొలిసారిగా స్పెషల్ ఎడ్యుకేటర్ విభాగం కింద నిజామాబాద్లో 42, కామారెడ్డిలో 47 పోస్టులను మంజూరు చేసింది. ఈ పోస్టులకు ప్రత్యేక బీఈడీ పూర్తి చేసినవారు అర్హులవుతారు. పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, అవి చెల్లుబాటు అవుతాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.