నిజామాబాద్ క్రైం, జనవరి 7: విపత్తుల సమయంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) పాత్ర కీలకమని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. నిజామాబాద్లోని క్రీడా అథారిటీ మైదానంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది శనివారం మాక్ డ్రిల్ నిర్వహించారు. విపత్తుల సంభవించినప్పుడు ఎలా స్పందింస్తారు..? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటీ..? అనే అంశాలను కండ్లకు కట్టినట్లు ప్రదర్శించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన సమయంలో త్వరగా స్పందించి అగ్నిమాపక, పోలీసు సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. దీంతో ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. ఆపద సమయంలో ఎన్డీఆర్ఎఫ్ సభ్యుల సేవలను కొనియాడుతూ వారికి శాలువా కప్పి, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రవి, ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ బిటెన్ సింగ్, అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి మురళీ మనోహర్రెడ్డి, డీఎంహెచ్వో సుదర్శనం, డీఐఈవో రఘురాజ్, నగర పాలక సంస్థ అధికారులు అఫ్జల్, సాజిద్, తహసీల్దార్లు సుదర్శన్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.