కమ్మర్పల్లి, మార్చి 6 : మండలంలోని కోనాపూర్ శివారులో నిర్మించిన రాళ్లవాగు స్థానిక రైతుల ధీమాను పెంచుతున్నది. ప్రాజెక్టు నిర్మాణంతో వానకాలంతోపాటు యాసంగిలోనూ సాగునీటికి ఢోకా లేకుండా పోయింది. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల సరిహద్దుల్లో నిర్మించిన రాళ్లవాగు ప్రాజెక్టు.. వానకాలంలో రెండు జిల్లాలకూ సాగునీరు అందిస్తుండగా, యాసంగిలో కోనాపూర్లో ఉన్న 200 ఎకరాలకు నీటి చింత లేకుండా చేస్తున్నది. ప్రాజెక్టు కారణంగా ఎండాకాలంలో వరిపంటలకు నీరు అందుతుండడంతోపాటు భూగర్భ జలాలు సైతం వృద్ధి చెందుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో బోరుబావుల కింద పంటలు సాగుచేస్తున్న రైతులకు సైతం సాగునీటి ఇబ్బందులు దూరమయ్యాయి. రాళ్లవాగు చుట్టూ దట్టమైన అడవి, కొండలు, గుట్టలు ఉన్నాయి. ఇక్కడ నిత్యం వన్య ప్రాణులు సంచరిస్తాయి. ప్రాజెక్టు కారణంగా మండుటెండల్లోనూ వన్య ప్రాణుల దాహార్తి తీరుతున్నది.
నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు సాగునీరు..
వానకాలంలో రాళ్లవాగు ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తుంది. భారీ వర్షాలు కురిస్తే పొంగి పొర్లుతుంది. ఎగువన కిలోమీటర్ల దూరం నుంచి చిన్నచిన్న వాగులు, వంకలు, ఒర్రెలు కలిసి గట్టు పొడిచిన వాగును కలుపుకొని కోనాపూర్ శివారు గుండా ప్రవహించే రాళ్ల వాగుపై ప్రాజెక్టును నిర్మించారు. అప్పటి నుంచి వానాకాలంలో నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో సాగుచేసే 3500 ఎకరాలకు సాగు నీటిని అందించే కీలక ప్రాజెక్టుగా మారింది. వేసవిలో కోనాపూర్ గ్రామంలో పంటలు సాగుచేసే రైతులకు వరంగా మారింది. సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉండడంతో స్థానిక రైతులు అధికంగా వరి సాగుపై దృష్టిపెట్టారు. కోనాపూర్ పరిధిలో ప్రస్తుత యాసంగిలో 200 ఎకరాలకు పైగా వరి సాగవుతున్నది. బోరు బావుల కింద సాగవుతున్న పంటలకూ ప్రాజెక్టు కారణంగా సాగునీరు అందుబాటులోకి వచ్చింది.
వణ్య ప్రాణుల దాహార్తి తీరుస్తూ..
రాళ్లవాగు ప్రాజెక్టు సమీపంలోని నిజామాబాద్-జగిత్యాల సరిహద్దు ప్రాంతాల్లో దట్టమైన అడవులు ఉన్నాయి. ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు వన్యప్రాణులకు నెలవు. జింకలు, దుప్పులు, నెమళ్లు, అడవి పందులు తదితర వన్య ప్రాణుల సంచారం అధికంగా ఉంటుంది. చిరుతలు కనిపించిన సందర్భాలూ ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి ముందు ఎండకాలంలో తాగునీరులేక వన్యప్రాణులు దప్పిక తీర్చుకునేందుకు గ్రామ శివారు, రోడ్లపైకి వచ్చేవి. ఈ క్రమంలో వేటగాళ్ల ఉచ్చులకు చిక్కి మృత్యువాత పడేవి. ప్రాజెక్టు నిర్మాణం తర్వాత చాలా దూరం వరకు బ్యాక్ వాటర్ అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి వన్యప్రాణులు అడవులను విడిచి బయటికి రావడంలేదు. వన్య ప్రాణుల వేట కూడా తగ్గుముఖం పట్టింది.