కమ్మర్పలి/భిక్కనూరు, మార్చి 26: ఏసీబీ దాడుల్లో ప్రభుత్వ ఉద్యోగులు తరచూ పట్టుబడుతున్నా.. తీరు మారడం లేదు. తాజాగా ఉమ్మడి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు కలకలం సృష్టించాయి. పంచాయతీ రాజ్ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులు తోటి ఉద్యోగి వద్ద లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. బదిలీపై వెళ్లిన మండల పంచాయతీ అధికారికి సర్వీస్ బుక్ ఇచ్చేందుకు ఎంపీడీవో లంచం డిమాండ్ చేయగా.. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో పక్కా ప్లాన్ వేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కమ్మర్పల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏసీబీ డీఎస్పీ శేఖర్గౌడ్ మంగళవారం విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం… కమ్మర్పల్లి ఎంపీవోగా పనిచేసిన బాగయ్య ఇందల్వాయి మండలానికి బదిలీపై వెళ్లాడు. దీంతో తన ఎస్ఆర్ బుక్ ఇవ్వాలని అప్పటి ఎంపీడీవోగా ఉన్న సంతోష్రెడ్డిని కోరగా రూ.10వేలు డిమాండ్ చేశాడు. కొన్నిరోజులకే ఎంపీడీవో సంతోష్రెడ్డి సైతం కామారెడ్డి జిల్లా భిక్కనూర్కు బదిలీపై వెళ్లాడు. దీంతో తన సర్వీస్ బుక్ గురించి సీనియర్ అసిస్టెంట్ హరిబాబును అడగ్గా.. డబ్బులు ఇవ్వనిదే బుక్ ఇవ్వొద్దని ఎంపీడీవో సంతోష్రెడ్డి ఆదేశించాడని సమాధానం ఇచ్చాడు. దీంతో బాగయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పక్కా పథకం ప్రకారం.. బాగయ్య మంగళవారం ఎంపీడీవో సంతోష్రెడ్డికి ఫోన్చేసి తన ఎస్ఆర్ బుక్ను ఇప్పించాలని కోరాడు. బాగయ్య బతిమిలాడడంతో డబ్బులు కొన్ని తగ్గించి ఇవ్వాలని చెప్పాడు. సంతోష్రెడ్డి చెప్పినట్లుగానే సీనియర్ అసిస్టెంట్ హరిబాబుకు బాగయ్య రూ. 8వేలు ఇవ్వగానే ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. సంతోష్రెడ్డి ఆదేశాలతోనే తాను డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీ అధికారులకు చెప్పడంతో ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.