నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 2: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. హైదరాబాద్ తరహాలో నిజామాబాద్ పోలీసు కమిషనరేట్లో పరిధిలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసి, జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లు, మున్సిపాలిటీ పరిధిలో సీసీ కెమెరాలను అనుసంధానం చేశారు. దీంతో ఏ ప్రాంతంలో నేరాలు జరిగినా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నియంత్రించడంతోపాటు త్వరగా పట్టుకునేందుకు, కేసులను ఛేదించేందుకు దోహదపడుతుంది.
నగరంలో ఏర్పాటు చేసిన 160 సీసీ కెమెరాలను ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేశారు. ఇందులో 132 కెమెరాలు నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయగా.. మిగతా 28 కెమెరాలు ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేశారు. 28 కెమెరాలు భద్రతా నియమాలను(ట్రాఫిక్ రూల్స్) ఉల్లంఘించిన వారికి జరినా విధించేందుకు ఉపకరిస్తున్నాయి. హైదరాబాద్ నగరం తర్వాత రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లాలో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు సత్ఫలితాలనిస్తున్నది.
ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని పోలీ సు అధికారులు చెబుతుంటారు. జిల్లా వ్యాప్తంగా పోలీ స్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కాకుండా పోలీసుల సలహాలు, సూచనల మేరకు వీడీసీలు, గ్రామ పంచాయతీ బాధ్యులు, పలు కమిటీలు, సంఘాల ఆధ్వర్యంలో సుమారు 10 వేల వరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఏ చిన్నపాటి సంఘటన, దోపిడి, హత్య, చైన్స్నాచింగ్ లాంటి ఘటనలు జరిగినా..ఈ కేసులను సులువుగా ఛేదించడానికి సీసీ కెమెరాలు పక్కా ఆధారాలుగా సహకరిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ సెంటర్ ద్వారా ఇప్పటివరకు జిల్లాలో జరిగిన మూడు హత్యలు, వాహనాలు చోరీ కేసులను సీసీ కెమెరాల సాయంతో పోలీసులు ఛేదించడం గమనార్హం.
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలు, వాటి పురోగతికి సంబంధించిన వివరాలను ఎస్హెచ్వోలు, ఎస్సైలతో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సైతం కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. దీంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందితో అత్యవసర సమావేశం నిర్వహించేందుకు అవసరమైన టెక్నాలజీని జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్లలో అందుబాటులో ఉంచారు. దీంతో సిబ్బంది మొత్తం ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో పని చేస్తున్నాయి.
నిజామాబాద్ను నేరరహిత జిల్లాగా మార్చేందుకు అందరి సహకారం అవసరం. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా తాము ఉండే ప్రాంతాలు, గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడానికి చొరవ తీసుకోవాలి. ఎక్కడ ఎలాంటి నేరం జరిగినా ఆ కేసును ఛేదించడంలో పోలీసులకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయి.
జిల్లా కేంద్రంలో పూసలగల్లీ లో 13 నెలల క్రితం ఓ నగల దుకాణం యజమాని షాపు మూసివేసి ఇంటికి వెళ్తుండగా బైక్పై వచ్చిన ఇద్దరు దుండ గులు ఆయన కళ్లలో కారం కొట్టి, యజమాని నుంచి బంగారునగలు, నగదును ఎత్తుకెళ్లారు. దుండగులకు సంబంధించిన ఎలాంటి సమాచారం పోలీసులకు లభ్యం కాకపోవడంతో ఘటన చోటుచేసుకున్న ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో దుండగుల ఆనవాళ్లను గుర్తించి, దర్యాప్తు చేసి వారిని పట్టుకున్నారు.
నాల్గోటౌన్ పరిధిలోని ఆర్యనగర్ నుంచి వినాయక్నగర్ ప్రధాన రోడ్డులో గతేడాది నవంబర్ 4వ తేదీన ముసుగు ధరించిన దుండగులు వరుసగా నాలుగు షాపుల షట్టర్స్ ధ్వంసం చేసి, నగదుతోపాటు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లిపోయారు. ఈ కేసులో అక్కడ షాపుల బయట ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా దుండగుల కదలికలను పోలీసులు గుర్తించగలిగారు.
ఇటీవల వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖలీల్వాడిలోని ఉన్న ఓ ప్రైవేట్ దవాఖానకు బురఖా ధరించిన ఇద్దరు మహిళలు వచ్చి.. ఓ పేషెంట్కు సంబంధించిన హ్యాండ్ బ్యాగ్తో పాటు అందులోని నగదు, మెడలోంచి బంగారు గొలుసును తెంచుకుపోయారు. ఈ దృశ్యాలు దవాఖానలో ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తం కావడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.
వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో 2022 అక్టోబర్లో ఓ వ్యక్తి బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకొని వెళ్తూ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో ఓ ఇంటి ముందు ద్విచక్రవాహనం (యాక్టివా) నిలిపి లోపలికెళ్లాడు. అతడిని బ్యాంకు నుంచి వెంబడిస్తున్న దుండగులు వాహనం ఢిక్కీ నుంచి రూ. 3 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు కాగా.. వాటి ఆధారంగా పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించారు.