నిజామాబాద్ కల్చరల్, డిసెంబర్ 15 : తెలంగాణకే తలమానికంగా నిలుస్తున్న ఎన్నో అపురూప శిల్పాలు, శిలా శాసనాలు, తాళపత్ర గ్రంథాలు, అరుదైన వస్తువులు నిజామాబాద్ జిల్లా పురావస్తు ప్రదర్శనశాలలో ఉన్నాయి. ఆరున్నరేండ్లుగా సిబ్బంది అల్మారాలు లేవంటూ మూసి ఉంచారు. ఇందూరు చరిత్రలో ఎన్నో జ్ఞాపకాలు ఉన్న తిలక్గార్డెన్ మ్యూజియానికి పూర్వ వైభవం తీసుకరావాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.
ఇందూరు ఉత్సవాల సందర్భంగా 2001లో అప్పటి కలెక్టర్ అశోక్ కుమార్ తిలక్గార్డెన్లోని టౌన్హాల్లో మ్యూజియాన్ని ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లోని శిల్పాలు, శిలాశాసనాలు, విశేష ప్రాచూర్యం పొందిన తాళపత్ర గ్రంథాలు, నాణేలు సేకరించి ఒకచోట చేర్చారు. వారంలో ఒకరోజు ఆయా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా తిలకించే అవకాశం కల్పించారు. పర్యాటక కేంద్రంగా ప్రాచూర్యం కల్పించారు.
పురాతన భవనంలో వానకాలంలో పైకప్పు ఉరవడంతో అపురూప గ్రంథాలు, ఆభరణాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడడంతో 2012 నుంచి రాష్ట్ర పురావస్తుశాఖ అధికారులు మరమ్మతుల పేరుతో మూసి ఉంచారు. సుమారు 40 లక్షలతో డంగు సున్నం, రంగులతో సుందరంగా తీర్చిదిద్దారు. వస్తువుల ప్రదర్శన కోసం కొత్త అల్మారాలు తెప్పిస్తామని ఇందుకు టెండర్లు స్వాగతించామని చెబుతూవచ్చారు. అనాటి నుంచి ఈనాటి వరకు మ్యూజియానికి తాళం వేసి ఉంచుతున్నారు. విద్యుత్ బిల్లులు చెల్లించక పోవడంతో జనవరి మాసం నుంచి కరెంటు కనెక్షన్ తొలిగించారు. నాటి నుంచి అంధకారంలో మ్యూజియం వెలవెలబోతున్నది. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మ్యూజియాన్ని తెరవాలని, అవసరమైన మౌలికవసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
చరిత్ర ఘనతను చాటే మ్యూజియాన్ని తెరిచి పర్యాటక కేంద్రంగా ప్రాచూర్యం కల్పించాలి. అపురూప శిల్పాలు, తాళపత్ర గ్రంథాలు, అరుదైన వస్తువులు భావితరాలకు ఉపయుక్తంగా ఉంటాయి. మ్యూజియానికి పూర్వ వైభవం తీసుకరావడానికి అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. త్వరలోనే పురావస్తు అభివృద్ధి కమిటీని ఏర్పాటుచేసి రాష్ట్రమంత్రిని కలిసే యోచనలో ఉన్నాం.