భారతీయ జనతా పార్టీలో రోజుకో వివాదం తెరమీదికి వస్తున్నది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఫండ్ చిచ్చు రేపుతున్నది. అధిష్టానానికి అన్నీ తానే అంటూ ప్రగల్భాలు పలికే ఓ ప్రజాప్రతినిధి ఈ వ్యవహారంలో చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతున్నది.
BJP | బీజేపీలో దాదాపు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తనదే బాధ్యత అన్నట్లుగా పార్టీ ఫండ్ను గుప్పిట్లో పెట్టుకున్న కీలక నేత… ఎన్నికల ముంగిట అభ్యర్థుల ఖర్చులకు పార్టీ ఇచ్చిన మొత్తాన్ని పంపిణీ చేయలేదని తెలుస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు బీజేపీలో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నది. కాంగ్రెస్తో కుమ్మక్కులో భాగంగానే ఇదంతా జరిగిందా? లేదంటే పార్టీ ఫండ్ను నొక్కేద్దామనే దురాలోచనతో చేశారా? అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. సదరు కీలక నేతకు కాంగ్రెస్తోనూ లోతైన సంబంధాలు, మూలాలు వేళ్లానుకొని ఉండడంతో ఇదంతా నిజమే కావొచ్చని సొంత పార్టీ నేతలే అభిప్రాయ పడుతున్నారు. పార్టీ ఫండ్ బొక్కేసిన లీడర్లు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాషాయ పార్టీ మొన్నటి పోరులో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టింది. ఇందులో భాగంగా కీలక నేతలకు బాధ్యతలు అప్పగించింది. ఈసీ నిబంధనల మేరకు రూ.40లక్షలను అధికారికంగా ఇచ్చి అనధికారిక ఖర్చుల నిమిత్తం ఓ ప్రజాప్రతినిధికి భారీగా డబ్బులు అప్పగించినట్లు సమాచారం. కానీ సదరు నాయకుడు ఈ మొత్తాన్ని పంపిణీ చేయకుండా మింగేసినట్లు బీజేపీలోని కీలక నేతలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. మీకు పార్టీ టికెట్ ఇవ్వడమే గొప్పా… పార్టీ ఫండ్ ఇచ్చేది లేదన్నట్లుగా సదరు నాయకుడు వ్యవహరించినట్లుగా తెలుస్తున్నది. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో బీజేపీలో ఆత్మశోధన మొదలైంది.
బీజేపీలో 2019 నుంచి నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో కీలకంగా మారిన సదరు వ్యక్తి ద్వారా పార్టీకి లాభం కన్నా నష్టం జరిగిందనే వాదన పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతున్నది. తనను తాను షైన్ కావడం కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదాలకు కేంద్రంగా నిలవడం మినహా బీజేపీ కార్యకర్తలకు అండగా నిలిచిన దాఖలాలు లేవు. తప్పుడు హామీలతో దక్కించుకున్న పదవితో ప్రజల్లో వైషమ్యాలు పెంచి పోషించడమే కానీ ఎన్నడూ బీజేపీ సిద్ధాంతాలను, కేంద్ర సర్కారు పథకాల అమలు, ప్రజల అవసరాలను గుర్తించడంలోనూ వైఫల్యం చెందినట్లు బీజేపీ గుర్తించింది. దీనికి తోడు కాషాయ జెండాలు మోసిన వారికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం, వారిని హీనంగా చూడడం వంటి ఘటనలు నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో బీజేపీ నేతల్ని కలిచి వేస్తున్నాయి. అధిష్టానం పెద్దలంతా సదరు కీలక నేత మాటల్నే నమ్మి కింది స్థాయి పరిస్థితులను అంచనా వేయడంలో వైఫల్యం చెందినట్లుగానూ శ్రేణులంతా మథన పడుతున్నారు. తప్పుడు లెక్కలు చూపించి తిమ్మిని బమ్మిని చేసి అగ్ర నాయకత్వాన్ని వక్రమార్గంలో నడిపించారని గుసగుసలాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం వచ్చిన ఫలితాలతో కీలక నేతకు సంబంధించిన మాటలన్నీ నీటి మూటలు కావడంతో ఇన్ని రోజులపాటు జరిగిన తంతును ఢిల్లీ నేతలు కూడా గ్రహించినట్లు తెలుస్తున్నది.
బీజేపీలో పార్టీ ఫండ్ దుర్వినియోగం అంశం అంతటా చర్చనీయాంశం అవుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశాజనకమైన ఫలితాలు రాకపోవడంతో ఈ మధ్యే బీజేపీ రాష్ట్ర, కేంద్ర కమిటీ బాధ్యులు రివ్యూ మీటింగ్లు నిర్వహించారు. ఇందులో పార్టీ ఫండ్కు సంబంధించిన అంశమే పెద్ద ఎత్తున చర్చకు దారితీసినట్లు తెలుస్తోంది. కమలం పార్టీ గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థులకు పార్టీ నుంచి దక్కాల్సిన ‘మద్దతు’ అందలేదని పలువురు వాపోయినట్లు తెలిసింది. అధిష్టానం లోతుగా అధ్యయనం చేయగా నోట్ల కట్టల పంపిణీలో భేదాలు చూపడం, గెలిచే చోట ఆర్థికంగా ఆదుకోకపోవడం వంటివి పలువురు ప్రస్తావించారు. పార్టీ ఫండ్ను అందరికీ సమాన స్థాయిలో ఇచ్చినట్లుగా రాష్ట్ర, కేంద్ర నాయకత్వం గుర్తించగా అభ్యర్థుల చేతికి అంచనా వేసిన మొత్తంలో పంపిణీ జరగలేదని గుర్తించినట్లు సమాచారం. దీనికి కారకులు ఎవరు? ఏ కారణం చేత పార్టీ ఫండ్ను అభ్యర్థులకు ముట్టజెప్పలేదన్న అంశాలపై ముఖ్య నాయకులంతా ఆరా తీశారు. డబ్బులు ఇవ్వలేదని తేలడంతో కీలక నేత పేరు ప్రధానంగా చర్చకు వచ్చింది. సామాన్య కార్యకర్తలకు టికెట్లు ఇస్తే వారిని పార్టీ ఆర్థికంగా ఆదుకోవాల్సి వస్తుంది. అదే ఆర్థికంగా బలమైన వ్యక్తులనే బరిలో నిలిపితే పార్టీ ఫండ్ ఇచ్చినా ఇవ్వకున్నా ఏం కాదన్న అభిప్రాయంతోనే భారీ స్కెచ్ను ఓ కీలక నేత ముందస్తుగానే వ్యూహాలు రచించినట్లుగానూ ప్రచారం జోరుగా జరుగుతున్నది.