Telangana University | ఇన్నాళ్లు వివాదాలతో ‘వీసీ’గిపోయిన తెలంగాణ యూనివర్సిటీలో పాలన గాడిన పడుతున్నది. అటు ప్రభుత్వం, ఇటు పాలక మండలి (ఈసీ) కృషితో పరిస్థితి చక్కబడుతున్నది. అంతా తామే అనుకుని వ్యవహరించిన వారికి, ఒంటెద్దు పోకడలతో విర్రవీగిన వారికి సర్కారు కళ్లెం వేసింది. వీసీ రవీందర్ గుప్తా ఒంటరిగా మిగలగా, ఆయనను చూసుకుని రెచ్చిపోయిన కొందరు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఏడాది పాటు తానే రిజిస్ట్రార్ అని ప్రకటించుకున్న ప్రొఫెసర్ నిర్మలాదేవి తిరిగి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లిపోయారు. వీసీ వెంట నడిస్తే తమ మనుగడకే ప్రమాదమని గ్రహించిన మరికొందరు ఆయనకు దూరం జరుగుతున్నారు. మరోవైపు, ప్రొఫెసర్ యాదగిరి ఈసీ సూచనలతో టీయూ రిజిస్ట్రార్గా సోమవారం బాధ్యతలు నిర్వర్తించారు. ఇక, వేతనాల కోసం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేశారు. వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వేతనాలు వస్తాయని రిజిస్ట్రార్, ఈసీ సభ్యులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించి విధుల్లో చేరారు. మొత్తానికి వర్సిటీలో వివాదాలు సద్దుమణుగుతుండడం ముదావహమని విద్యార్థి, ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి.
నిజామాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ యూనివర్సిటీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మొన్నటి వరకు ఒంటెద్దు పోకడలతో విర్రవీగిన వ్యక్తులంతా ఇప్పుడు తలోదారి అన్నట్లుగా మిగిలిపోవడం చర్చనీయాంశమైంది. శనివారం వరకు వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ గుప్తా, ఆయన రిజిస్ట్రార్గా నియమించిన ప్రొఫెసర్ నిర్మలా దేవి మీడియా తో నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఒక దశలో మీడియా సంస్థలపై బెదిరింపులకు పాల్పడ్డారు. టీయూ పాలకవర్గంతో పాటు ప్రభుత్వ నిర్ణయాలపైనా నోరు పారేసుకున్నారు. వీరి వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకొని చేయాల్సిన పనిని పూర్తి చేసింది. టీయూ వీసీ నిర్ణయమే తనకు అంగీకారయోగ్యమైనదంటూ నిర్మలా దేవి ప్రకటనలు చేసిన 24గంటల్లోనే స్వరంలో పూర్తిగా వైరుధ్యం కనిపించింది. సోమవారం ఉదయం 11గంటలకే నేరుగా ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి అక్కడి రిజిస్ట్రార్కు లేఖను అందించారు. అందులో తాను బేషరతుగా తన పాత విధుల్లో చేరుతున్నట్లుగా పేర్కొన్నారు.
ఈ పరిణామాలు ఉస్మానియా, తెలంగాణ యూనివర్సిటీల్లో అలజడిని సృష్టించాయి. వీసీ రవీందర్ గుప్తా వెంట నడవాలనుకుంటున్న వారంతా వెనకడుగు వేయడం ద్వారా ఇప్పుడు టీయూ వీసీ ఒంటరిగా మారారు. పాలకవర్గం నిక్కచ్చిగా వ్యవహరిస్తూ సమస్యకు తగిన రీతిలో ముగింపు పలికేందుకు శతవిధాలుగా యత్నిస్తున్నది.
మే 5న జరిగిన టీయూ పాలకవర్గ సమావేశంలో యాదగిరినే టీయూ రిజిస్ట్రార్గా తిరిగి నియమించారు. ఈ నిర్ణయాన్ని వీసీ వ్యతిరేకించి రెండు, మూడు రోజుల పాటు ఇష్టానుసారంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. సీన్ కట్ చేస్తే సోమవారం తిరిగి రిజిస్ట్రార్ కుర్చీలో యాదగిరి ఆసీనులు కావడంతో పరిస్థితుల్లో కాసింత మార్పు కనిపించినట్లు అయ్యింది. మొత్తానికి వీసీ వర్సెస్ ఈసీ అన్నట్లుగా సాగిన ప్రచ్ఛన్న పోరులో వైస్ చాన్స్లర్ తోక ముడిచినట్లేనని టీయూ వర్గాలు చెబుతున్నాయి. వైస్ చాన్స్లర్గా నియమితులైన రవీందర్ గుప్తా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇదే తీరులో దూకుడు ప్రదర్శించి అందరి చేత విమర్శలను ఎదుర్కొన్నారు. వీసీ వ్యవహార శైలిని టీయూలో కొంత మంది స్వార్ధపరులు సైతం అడుగడుగునా సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. తద్వారా వీసీ తప్పుడు ఆలోచనలకు మడుగులు ఒత్తిన వారంతా పాత్రదారులై గందరగోళాన్ని సృష్టించారు. చట్టాల్లో ఉన్న మార్గదర్శకాలకు విరుద్ధంగా కేవలం వైస్ చాన్స్లర్ విచక్షణ అధికారమే సర్వం అన్నట్లుగా ప్రవర్తించి వీసీతో పాటు చా లా మంది ఇప్పుడు బొక్క బోర్లా పడ్డట్టుగా మారింది.
వైస్చాన్స్లర్ తీరుతో యూనివర్సిటీపై పడిన అపవాదును చెరిపేసేందుకు కీలకమైన చర్యలకు సర్కారు ఉపక్రమిస్తోంది. ఇందులో భాగంగా పాలకవర్గంలో తీసుకున్న నిర్ణయాలను కచ్చితంగా అమలు చేసేందుకు ముందుకు వెళ్తున్నట్లుగా సమాచారం. విద్యా శాఖ కమిషనర్ వాకాటి కరుణ, ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఈ వ్యవహారాలపై సీరియస్గా దృష్టి సారించారు. ఏప్రిల్ 19, మే 5న జరిగిన పాలకవర్గ సమావేశాల్లో అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్తో పాటుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్లకు వీసీ అక్రమాలపై విచారణ చేయాల్సిందిగా ఈసీ ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని సేకరించే పనిలో ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు బిజీగా ఉన్నాయి.
వైస్చాన్స్లర్ తీరుతో రోడ్డున పడిన యూనివర్సిటీ పరువును నిలుపుకొనేందుకు పరిపాలన విభాగం సిబ్బంది అంతా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ప్రభు త్వ ఆదేశాలకు విరుద్ధంగా వీసీ వ్యవహరిస్తే సహాయ నిరాకరణ చేసేందుకు సిద్ధం కావాలని యోచిస్తున్నట్లుగా సమాచారం. కొంత మంది వ్యక్తుల స్వార్థంతోనే మొత్తం యూనివర్సిటీకి చెడ్డపేరు వస్తోందని అలాంటి వ్యక్తులను గుర్తించి విచారణ సంస్థలకు వారు చేసిన తప్పులు, అక్రమాల వివరాలను ఆధారాలతో సమర్పించేందుకు వెనుకాడవద్దని భావిస్తున్నారు.
టీయూలో పాలనను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్న దరిమిలా వైస్ చాన్స్లర్ రవీందర్ గుప్తా తీరులో ఎలాంటి మార్పు కనిపించకపోవడం గమ నార్హం. సోమవారం విధులకు హాజరు కాకపోగా తన మాట చెల్లుబాటు కావడం లేదన్న ఆక్రోశంతో మరిన్ని నిర్ణయాలను తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. రిజిస్ట్రార్గా మరో వ్యక్తిని నియమించుకునేందుకు టీయూలోనే గతంలో ఈయన ద్వారా రిజిస్ట్రార్గా నియామకమై ఈసీ ద్వారా గెంటివేయబడిన వ్యక్తులను సంప్రదించినట్లు సమాచారం. ప్రస్తుతం యూనివర్సిటీలో నెలకొన్న పరిస్థితులను అంచనా వేసి వీసీ వెంట నడిచేందుకు ధైర్యం చేయకపోవడం విశేషం.