రుద్రూర్, డిసెంబర్ 19 : రానున్న ఐదు రోజులు జిల్లాలో చలి తీవ్రత పెరగనున్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కేవీకే వాతావరణ విభాగం శాస్త్రవేత్త శ్రీలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈశాన్య, తూర్పు దిశల నుంచి రాష్ట్రం వైపు వీస్తున్న గాలుల ప్రభావంతో రానున్న ఐదు రోజుల్లో ఉమ్మడి జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు 14.3 నుంచి 15.8 డిగ్రీల వరకు పడిపోవచ్చన్నారు.
నాలుగు నుంచి ఏడు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు నారుమడిలో చలితీవ్రతను తగ్గించడానికి సాయంత్రం నీరు పెట్టి ఉదయం తీసేయాలని లేదంటే ప్లాస్టిక్ షీట్లను నారుమడిపై కప్పి ఉంచాలని సూచించారు. 2 క్వింటాళ్ల మాగిన కోళ్ల లేదా గొర్రెల ఎరువు లేదా వర్మి కంపోస్టు ఎరువు వాడి వెచ్చదనం పెంచాలన్నారు. ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతల్లో మార్పు అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు.