నిజామాబాద్, ఫిబ్రవరి 10, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నగరపాలక, పురపాలక సంఘాలకు నేడే పోలింగ్ జరుగనుంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్భందీ ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 7 మున్సిపాలిటీలు, నిజామాబాద్ నగరపాలక సంస్థలకు ఎన్నిక జరుగుతోంది. నిజామాబాద్ నగరపాలక సంస్థ, ఆర్మూర్, బోధన్, భీంగల్ పురపాలక సంఘాల్లో మొత్తం 146 డివిజన్లు/వార్డులున్నాయి. పోలింగ్కు 722 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 714 మంది అభ్యర్థులు తలబడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీల్లో మొత్తం 92 వార్డులు ఉన్నాయి. 447 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
239 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 7 మున్సిపాలిటీలు, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 238 వార్డులు, డివిజన్లలో 1161 మంది పోటీదారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పురపాలక పోరులో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. అన్ని చోట్ల పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. డివిజన్/వార్డుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మహిళామణులు చేతుల్లోనే అభ్యర్థుల భవితవ్యం ఆధారపడి ఉంది.
పురపాలక ఎన్నికల ప్రచారంలో భారత రాష్ట్ర సమితి ఉధృతంగా ప్రజల్లోకి దూసుకు పోయింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటిస్తూ ప్రజల చెంతకెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ప్రధానంగా కేసీఆర్ పదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. కార్నర్ మీటింగ్లు నిర్వహించి జనాలకు అవగాహన కల్పించారు. రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో కుంటుపడిన అభివృద్ధి తీరును అభ్యర్థులు ఎండగట్టారు. కేసీఆర్ సహకారంతో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన గణనీయమైన అభివృద్ధిని తమ గొప్పగా ప్రచారం చేసుకుంటోన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తీరును అడుగడుగునా ఎండగట్టారు.
కాంగ్రెస్, బీజేపీ ద్వంద నీతికి చరమగీతం పాడేందుకు గులాబీ పార్టీకే మద్ధతు ఇవ్వాలంటూ ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెప్పుకునేందుకు చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులంతా కలిసి బీఆర్ఎస్ పార్టీపై విష ప్రచారానికే సమయం కేటాయించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఒక్క మాట అనకుండా జాగ్రత్త పడుతూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడం వెనుక కుమ్మక్కు రాజకీయాలే కారణమన్న చర్చ నడుస్తోంది.
