బోధన్, డిసెంబర్ 11: పట్టణంలో అంబేద్కర్ భవన నిర్మాణం విషయంలో దళితులు ఐక్యంగా ఉండాలని దళిత ఐక్యవేదిక నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని తాలూకా రైస్మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ జిల్లా సభ్యుడు రామకృష్ణ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. దళిత సంఘాల నాయకులు హాజరయ్యారు.
పట్టణంలో అంబేద్కర్ భవన నిర్మాణం విషయంలో చిన్నపాటి వివాదాలు జరిగిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా దళిత సంఘాలకు చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొత్తపల్లి రాధాకృష్ణ, కౌన్సిలర్ కొత్తపల్లి రాధాకృష్ణ, మాల మహానాడు అధ్యక్షుడు మందుగుల విద్యాసాగర్, అద్దంకి లింగన్న తదితరులు మాట్లాడారు. బోధన్లో అంబేద్కర్ భవన నిర్మాణం విషయంలో ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ సానుకూలంగా మాట్లాడడంపై హర్షం వ్యక్తంచేశారు.
అందరికీ అనుకూలమైన స్థలంలో రూ.కోటికిపైగా నిధులు వెచ్చించి భవనం నిర్మిస్తామని హామీ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ భవనం విషయంలో దళితుల్లోనే కొందరు ఓ వర్గంగా ఏర్పడి, మరికొందరిని రెచ్చగొట్టి వివాదానికి తెరలేపుతున్నారని అన్నారు. ఇది మంచిది కాదని, అంబేద్కర్ భవనం విషయంలో అందరూ కలిసి ఉండాలని వారు స్పష్టం చేశారు.
ఈ సమావేశానికి బీఆర్ఎస్ నాయకులతో పాటు వివిధ కుల సంఘాల నాయకులు హాజరై తమవంతు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో గోసంగి సంఘం జిల్లా అధ్యక్షుడు గంధం రాజేశ్, బీసీ సంఘ నాయకులు నక్క లింగారెడ్డి, రుద్ర సత్యనారాయణ, ఎస్టీ సంఘం నాయకులు డేగావత్ దూప్సింగ్ నాయక్, ప్రవీణ్ జాదవ్ నాయక్, వివిధ సంఘాలకు చెందిన నాయకులు అడ్లూరీ నరేశ్, బాలరాజు, శంకర్ గౌడ్, జేఏసీ శంకర్, సతీశ్ వడ్ల, శ్యామ్యూల్, డిస్కో సాయిలు, విజయ్, భూమయ్య, నీరడి రవి, భూమయ్య, సుధాకర్, నాగయ్య, ఆర్. రాములు, బాలేరావ్, బస్వంత్ పాల్గొన్నారు.