భీమ్గల్, ఏప్రిల్ 15 : అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. దేశంలో అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రి ఒక్క రేవంత్రెడ్డి మాత్రమే అని విమర్శించారు. భీమ్గల్ పట్టణంలోని ఓ ఫంక్షన్హాలులో సోమవారం బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించగా.. వేములతోపాటు రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి, ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వేముల మాట్లాడుతూ.. రేవంత్ ప్రభుత్వం లోక్సభ ఎన్నికల తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం బంద్ చేసే అవకాశం ఉందన్నారు. నష్టాలను భరించడం తమవల్ల కాదని ఆర్టీసీ చేతులెత్తేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. పార్లమెంట్ ఎన్నికలప్పుడే ఇచ్చిన హామీలను సరిగ్గా అమలుచేయని కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికలైన తర్వాత అమలుచేస్తారా అని విషయమై ప్రజలు ఆలోచించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి మోసం చేసిన తీరును ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హామీలు అమలుకావాలంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే కేసీఆర్ సైనికుడు బాజిరెడ్డి గోవర్ధన్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డికి ఇక్కడి ప్రజల కష్టాలు తెలియవన్నారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ జిల్లా ప్రజల కష్టసుఖాలను ఎప్పుడైనా పంచుకున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలకు తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులకు వేముల పిలుపునిచ్చారు.
పార్టీ కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని మంచిరోజులు వస్తాయని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నుంచి చెత్తపోతున్నదని, దానితో పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. బాజిరెడ్డిని ఆశీర్వదించాలని కోరారు.
కేసీఆర్ను వదులుకున్నామని ప్రజలు, రైతులు బాధపడుతున్నారని ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం అబద్ధాలతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చి 120 రోజులవుతున్నా ఆరు గ్యారెంటీలను ఇప్పటి వరకు అమలుచేయడంలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై గ్రామాల్లో చర్చ నిర్వహించి, ఆ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎంపీ అర్వింద్ ఐదేండ్లలో జిల్లాకు చేసింది శూన్యమన్నారు. ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టంచేశారు.