కనుచూపు మేర పచ్చదనం.. ఆహ్లాదం పంచే అభయారణ్యం సిద్ధమవుతున్నది. నిజామాబాద్ నగర శివారులోని చిన్నాపూర్ వద్ద రూపుదిద్దుకుంటున్నది. సరైన విడిది కేంద్రాలు లేక ఇబ్బందులు పడుతున్న నగర వాసులు ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అరణ్య పేరిట అర్బన్ పార్క్ను ఏర్పాటు చేస్తున్నది. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని మాక్లూర్ మండలం చిన్నాపూర్ రిజర్వ్ ఫారెస్ట్లో సువిశాల ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నది. త్వరలోనే దీన్ని ప్రారంభించేందుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చెప్పుకోదగ్గ పార్కు అంటూ ఏదీ లేదు. ఒకప్పుడు నిజామాబాద్ నగరంలో నెలకొన్న తిలక్గార్డెన్ ఇప్పుడు కుచించుకు పోయింది. నగరవాసులకు ఎటూ విడిది కేంద్రాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రఘునాథ చెరువు కట్టను ట్యాంక్బండ్గా రూపాంతరం చేస్తున్నది. ఇంతలోనే ఓ భారీ పార్కును సైతం నిజామాబాద్ జిల్లా ప్రజలకు అందివ్వాలని ప్రభుత్వం యోచించింది. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో మాక్లూర్ మండలం చిన్నాపూర్ రిజర్వ్ ఫారెస్ట్లో సువిశాల ప్రాంతాన్ని సేకరించి అరణ్య అర్బన్ పార్కుగా తీర్చిదిద్దుతున్నారు.
ఇందుకోసం ఏకంగా రూ.20 కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రత్యేక చొరవతో సహజ సిద్ధమైన అటవీ ప్రాంతమే భవిష్యత్తులో వివిధ సాహస క్రీడలకు, పల్లె, పట్టణ వాసులకు విడిది కేంద్రంగానూ మారబోతున్నది. జాతీయ రహదారి 63కు ఆనుకొని ఏర్పాటవుతున్న అర్బన్ పార్కు నిజామాబాద్ జిల్లాకు కలికితురాయిగా మారబోతున్నది. ఉమ్మడి జిల్లాలో జనావాసాలకు వచ్చి అటవీ అధికారులకు చిక్కే వన్యప్రాణులను సైతం ఈ పార్కులోనే ప్రజల సందర్శనార్థం ఉంచేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.
రాష్ట్రంలోనే అతిపెద్ద అర్బన్ పార్కు..
రాష్ట్రంలోనే అతిపెద్ద అర్బన్ పార్కు నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం చిన్నాపూర్ అటవీ ప్రాంతంలో ఏర్పాటవుతున్నది. జిల్లా కేంద్రానికి 15కిలో మీటర్ల దూరంలో జాతీయ రహదారి 63కు ఆనుకొని ఉన్న అడవిలో అద్భుత ఏర్పాట్లు జరుగుతున్నాయి. అతి త్వరలోనే ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకు రాబోతున్నారు. ఓ వైపు అటవీ సంపదను సంరక్షించుకోవడం, మరోవైపు అడవి అందాలను ప్రజానీకానికి చేరువ చేయడమే లక్ష్యంగా అర్బన్ పార్కును తీర్చిదిద్దుతున్నారు. కరీంనగర్ వెళ్లే మార్గంలో నెలకొల్పిన అటవీ పార్కు ద్వారా నిజామాబాద్ నగరం, ఆర్మూర్ పట్టణ వాసులతోపాటు అనేక గ్రామాల వారీగా ప్రయోజనం చేకూరబోతున్నది. మాక్లూర్ మండలం చిన్నాపూర్ అటవీ ప్రాంతంలో అరణ్య అర్బన్ పార్కు పేరుతో నిర్మాణం జరుగుతున్నది.
నిజామాబాద్ – ఆర్మూర్ మార్గంలో 166.40 హెక్టార్ల విస్తీర్ణంలో పార్కును తీర్చిదిద్దుతున్నారు. మొత్తం 470 ఎకరాల విస్తీర్ణంలో వందలాది మందికి ఆహ్లాదాన్నిపంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విజిటర్ జోన్, వాచ్ టవర్, చెక్డ్యాం, సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులోనే నర్సరీని ఏర్పాటు చేశారు. ట్రెక్కింగ్ కోసం ప్రత్యేక లైన్లను వేస్తున్నారు. అరణ్య అర్బన్ పార్కు అభివృద్ధి కోసం వివిధ శాఖల ద్వారా నిధులను వెచ్చిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నిర్మితమైన అర్బన్ పార్కుల్లోకెల్లా ఇది భారీ విస్తీర్ణంలో నెలకొల్పుతున్నారు. సహజ సిద్ధమైన గుట్టల మధ్య దట్టమైన అటవీ ప్రాంతంలో నిర్మాణం జరుగుతున్నది.
సకల వసతులు..
రూ.1.70కోట్లతో అరణ్య అర్బన్ పార్కుకు రక్షణ చర్యలు చేపట్టారు. రూ.1.37కోట్లతో 3కిలో మీటర్ల మేర ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. రూ.3.24లక్షలతో ఆహ్లాదకర రీతిలో స్వాగత తోరణం. రూ.13లక్షలతో అధునాతన డిజైన్లతో కాంపౌండ్ వాల్తోపాటు ఇతరత్రా నిర్మాణాలు చేపట్టారు. సందర్శకుల కోసం రూ.19లక్షలతో ఓపెన్ జిమ్, రూ.18లక్షలతో 6.5కిలోమీటర్ల మేర పైప్లైన్ ద్వారా అడవిలోనూ విలువైన వృక్షజాతుల సంరక్షణకు ఏర్పాట్లు. గ్రామాల్లో కనిపించే రచ్చబండ మాదిరిగా ప్రజలు ఆసీనులయ్యే విధంగా రూ.10లక్షలతో 50 నిర్మిస్తున్నారు. రూ.18లక్షలతో అరణ్య పార్కులో ఒకటిన్నర కిలోమీటర్ అవతల వాచ్టవర్ను నిర్మిస్తున్నారు.
రూ.20లక్షలతో నుడా ఆధ్వర్యంలో మరో వాచ్టవర్ నిర్మిస్తున్నారు. రూ.18లక్షలతో ఫైర్ వాచ్ టవర్ను అంతర్గత నిర్వహణకు నిర్మిస్తున్నారు. పర్యావరణ ప్రేమికులు, వృక్షశాస్త్రం చదివే వారికి ఓపెన్ క్లాస్ రూమ్లను నిర్మిస్తున్నారు. ఇందుకోసం రూ.5.20లక్షలు వెచ్చిస్తున్నారు. రూ.12లక్షలతో సోలార్ లైట్లు, రూ.48లక్షలతో నడకదారులు, రూ.12లక్షలతో ఎలిఫెంట్ రాక్ పేరుతో ట్రెక్కింగ్కు అనువుగా నిర్మాణాలు చేస్తున్నారు. సహజ సిద్ధమైన బండరాళ్లను సాహస క్రీడలకు అనువుగా మార్చుతున్నారు. రూ.14.40 లక్షలతో 20 సైకిళ్లు కొనుగోలు చేయబోతున్నారు. రూ.31లక్షలతో బీట్ ఆఫీసర్లు, రేంజ్ ఆఫీసర్లకు ఇందులోనే క్వార్టర్స్ నిర్మిస్తున్నారు. రూ.1.40కోట్లతో ట్యాంక్ బండ్ నిర్మాణం, 2.60కిలోమీటర్లు చైన్ లింక్ ఫెన్సింగ్ వేస్తున్నారు.
నిజామాబాద్కు తలమానికం..
అడవి అంటే ఆయుష్షు, ఆయుధం. ఒక్క మాటలో చెప్పాలంటే జీవన విధానం. అటవీ భూముల స్థిరీకరణ, పరిరక్షణ, వన్యమృగాల సంరక్షణకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. అడవిని దట్టంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నది. ఇదే స్ఫూర్తితో మా నియోజకవర్గంలో 470 ఎకరాల్లో అరణ్య అర్బన్ పార్కును ఏర్పాటు చేస్తున్నాం. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం లాంటి పనులు చేపడుతూనే అటవీ సంపదను కాపాడుకునే చర్యల్లో భాగంగానే ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాకే ఈ అర్బన్ పార్కు తలమానికంగా మారబోతున్నది.
– ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే