రుద్రూర్/ చందూర్, డిసెంబర్ 31 ;రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమకావడంతో అన్నదాత ఆనందంలో మునిగితేలుతున్నాడు. పెట్టుబడి సాయం వచ్చినట్లు ఫోన్లకు సమాచారం రావడంతో సంబురాలు చేసుకుంటున్నారు. దీంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. రైతుబంధు సాయం కోసం వచ్చిన రైతులతో బ్యాంకులు సందడిగా మారాయి. పొలంబాట పడుతున్న సమయంలో రైతుబంధు డబ్బులు అందడంపై రైతుకుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నాయి.
రుద్రూర్: చిన్న చిన్న రైతులను సీఎం కేసీఆర్ దేవుడు లెక్క ఆదుకుంటుండు. పెట్టుబడి సాయం కింద డబ్బులు అందడంతో అప్పులు లేకుండా ఎవుసం చేస్తున్నం.
– జెల్ల సాయిలు, రైతు, చిక్కడ్పల్లి, రుద్రూర్
సమయానికి డబ్బులు అచ్చినయ్..
పొలంలో పెట్టుబడి పెట్టే సమయంలో రైతుబంధు రావడం చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ పుణ్యాన పెట్టుబడి కోసం అప్పులు చేసే తిప్పలు తప్పింది. పెట్టుబడి సాయం అనేది రైతులకు వ్యవసాయంపై ఆసక్తి పెంచుతుంది.
– సాయిలు సావిత్రి,రైతు, రుద్రూర్
కేసీఆర్కు కృతజ్ఞతలు
గ్రామంలో నాకు రెండెకరాల పొలం ఉంది. గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తూ నా పొలాన్ని గతంలో కౌలుకు ఇచ్చి.. వచ్చిరాని డబ్బులతో బతికేవాడిని. తెలంగాణ వచ్చినంక రైతుబంధు పథకంతో వ్యవసాయంపై ఆశలు పెరిగాయి. ఇప్పుడు పొలం నేనే చేసుకుంటున్న. పెట్టు బడి సాయం అందడం ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– తోకల లాలాబోయి, రైతు, ఘన్పూర్
మళ్లీ గ్రామానికి వచ్చిన..
వ్యవసాయం చేసి విసుగొచ్చి అప్పులతో తమ్ముడికి పొలం అప్పజెప్పి బతుకు దెరువు కోసం పట్టణం పోయి అప్పు తీర్చిన. కేసీఆర్ రైతుబంధు తీసుకురావడంతో మళ్లీ గ్రామానికి వచ్చిన. వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందడంతో అన్ని ఇబ్బందులూ తొలగిపోయినయ్. పెట్టుబడి డబ్బులు పోనూ మిగులుతున్నాయి.
–మల్లారం నానాక్, రైతు, తిమ్మాపూర్
ధైర్యం ఇచ్చిన దేవుడు కేసీఆర్
వ్యవసాయం చేయడానికి సీఎం కేసీఆర్ మాకు ధైర్యం ఇచ్చారు. మాలాంటి రైతులకు పెట్టుబడి కోసం అప్పులు కూడా ఇవ్వడానికి ఎవరూ ముందుకురారు. అలాంటి సమయంలో సీఎం కేసీఆర్ అందజేస్తున్న రైతుబంధు డబ్బులతో పంటలను సాగుచేస్తున్న. రైతుబంధు డబ్బులు నాకు రూ. ఏడు వేలు వచ్చాయి.
–నక్క అనుసూజ, మహిళా రైతు, చిక్కడ్పల్లి