నిజామాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నూతన కేబినెట్లో 12 మందికి చోటు లభించింది. అయితే, మంత్రిమండలిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రాధాన్యం దక్కలేదు. కనీసం రెండు మంత్రిపదవులు వరిస్తాయని భావించినా తొలివిడుతలో ఏ ఒక్కరికీ అవకాశం రాలేదు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్, నిజామాబాద్ రూరల్, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో కనీసం ఇద్దరికి అమాత్యయోగం వరిస్తుందని అనుకున్నారు. బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్రెడ్డికి తొలి విడుతలోనే బెర్త్ ఖాయమని ప్రచారం జరిగింది. అలాగే, మరో సీనియర్ నేత, రేవంత్రెడ్డి కోసం కామారెడ్డి సీటు త్యాగం చేసిన షబ్బీర్అలీకి సైతం చాన్స్ లభించినట్లేనని అంతా భావించారు. కానీ, తొలివిడుతలో ఈ ఇద్దరికీ అవకాశం రాలేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు అసలు కేబినెట్లోనే చోటు లభించలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తమకు పదవులు వస్తాయని భావించిన వారికి నిరాశే మిగిలింది. రెండో విడుతలో చేపట్టే మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి జిల్లా నుంచి ఒకరు లేదా ఇద్దరికి చాన్స్ లభించే అవకాశముందని భావిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురువారం కొలువైంది. ముఖ్యమంత్రిగా కొడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంతో పాటు మొత్తం 12మంది ప్రమాణ స్వీకారం చేయగా ఇందులో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ప్రాధాన్యత దక్కలేదు. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీ వస్తే తమకు మంత్రి పదవులు వస్తాయనుకున్న నేతలకు అసలు గుర్తింపే లేకపోవడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో నాలుగు చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. బోధన్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ నుంచి డాక్టర్ భూపతి రెడ్డి, ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్ రావు, జుక్కల్ నుంచి లక్ష్మీకాంతరావు విజయం సాధించారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావుకు మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని ఆశించారు. నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ సైతం మైనార్టీ కోటాలో తనకు తప్పకుండా మంత్రి మండలిలో స్థానం దక్కుతుందని భావించారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారితో పాటు ఏఐసీసీలో పేరొందిన నేతలకు సైతం రేవంత్ రెడ్డి తొలి విడుత మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం ఏమిటని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు.
రెండో విడుతలో…?
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో మంత్రివర్గ కూర్పు తప్పనిసరిగా భౌగోళిక ప్రాంతాలను అనుసరించి ఉంటుంది. అందులో ఉమ్మడి జిల్లా ప్రాధాన్యతగా ఎవరికో ఒకరికి తప్పకుండా మంత్రివర్గంలో చోటు దక్కడం ఖాయమే. కాంగ్రెస్కు నాలుగు సీట్లను అందించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను మొదటి విడుత మంత్రివర్గ కూర్పులో స్థానం కల్పించకపోవడమే అందరిలోనూ అనుమానాలకు తావిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏకంగా ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రి వర్గంలో చోటు కల్పించారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లోనూ రెండేసి చొప్పున మంత్రి పదవులను ఏఐసీసీ కట్టబెట్టింది. ఉమ్మడి జిల్లాలో సీనియర్ లీడర్లు ఉన్నప్పటికీ చోటు కల్పించకపోవడం ఏమిటంటూ హస్తం పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. రెండో విడుత మంత్రి వర్గ విస్తరణ ఎప్పటికి జరుగునో అనుకుంటూ నిట్టూరుస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల ఊహాగానాల ప్రకారం ఉమ్మడి జిల్లా నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుతో పాటు షబ్బీర్ అలీ సైతం పోటాపోటీగా మంత్రి పదవి కోసం పైరవీలు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వీరిలో ఎవరికి మంత్రి యోగం వరిస్తుందో వేచి చూడాల్సి ఉంది. బుధవారం ఢిల్లీలో రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ పెద్దలతో ఉమ్మడి జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ వరుస భేటీలు నిర్వహించారు. తదనంతరం వీరిలో ఎవరో ఒకరికి పదవి తథ్యమని అంతా ఊహించుకున్నారు. అంతలోనే ఎవరికీ స్థానం కల్పించకపోవడం విశేషం.