తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరిగిన అవినీతి, అక్రమాలను నిగ్గు తేల్చేందుకు పాలక మండలి (ఈసీ) ఏర్పాటు చేసిన విచారణ కమిటీ రంగంలోకి దిగింది. వీసీ రవీందర్ గుప్తా హయాంలో జరిగిన అక్రమాలపై శుక్రవారం విచారణ ప్రారంభించింది. అయితే, ఈ నెల 19న ఈసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ వీసీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ రోజు పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను నిలుపుదల చేస్తూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, ఉన్నతవిద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, పాలకమండలి సభ్యులు, రిజిస్ట్రార్ యాదగిరికి నోటీసులు జారీ చేసింది. ఒకే రోజు కీలక పరిణామాలు చోటు చేసుకోవడం వర్సిటీలో తీవ్ర చర్చనీయాంశమైంది.
డిచ్పల్లి, ఏప్రిల్ 28: టీయూలో కొన్ని నెలలుగా జరిగిన అవినీతి, అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన కమిటీ శుక్రవారం విచారణ ప్రారంభించింది. వర్సిటీలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై పాలకమండలి ఐదుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని నియమించింది. ఇందులో ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రెటరీ చంద్రకళ, సభ్యులు వసుంధరాదేవి, గంగాధర్గౌడ్, ప్రవీణ్, మారయ్యగౌడ్ ఉన్నారు. అయితే విచారణ కోసం వసుంధరా దేవి, గంగాధర్గౌడ్, ప్రవీణ్ శుక్రవారం వర్సిటీకి రాగా.. ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రెటరీ చంద్రకళ హైదరాబాద్లో నూతన సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో అక్కడి పనుల్లో బిజీగా ఉండడంతో విచారణకు రానట్టు తెలిసింది. మారయ్యగౌడ్ కూడా వ్యక్తిగత పనులతో రానట్టు సమాచారం. ఈ క్రమంలో ముగ్గురు సభ్యులు పరిపాలనా భవనంలో విచారణ ప్రారంభించారు. ఈనెల 19వ తేదీన హైదరాబాద్లోని రూసా భవనంలో జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ ఐదుగురు సభ్యులను విచారణకు నియమించి, వీసీ ఆచార్య రవీందర్పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి యూనివర్సిటీలో కొంత కాలంగా జరిగిన ఆర్థిక చెల్లింపులు, అడ్వాన్సులు, ఇతర వ్యవహారాలకు సంబంధించిన ఫైళ్లను సిద్ధం చేసి ఉంచడంతో విచారణ కమిటీ క్షుణంగా పరిశీలించినట్లు తెలిసింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 5గంటల వరకు సుదీర్ఘంగా ఫైళ్ల పరిశీలన కొనసాగినట్లు సమాచారం. అయితే యూనివర్సిటీలో కొంత కాలంగా అడ్డగోలుగా టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు అడ్వాన్సులు ఇచ్చినప్పటికీ ఇంకా సెటిల్మెంట్ చేయని నగదు సుమారు కోటి రూపాయల వరకు ఉన్నట్లు కమిటీ సభ్యులు గుర్తించినట్లు తెలిసింది.
వర్సిటీకి విచారణ కమిటీ వచ్చినట్లు తెలియడంతో ఇటీవల నోటీసులు అందుకున్న సిబ్బంది కమిటీ సభ్యులను కలిసి తమ గోడును వినిపించినట్లు సమాచారం. అడ్వాన్సులు తమ పేరుతో ఉన్నప్పటికీ ఆ డబ్బులను తాము ఓ అధికారికి ఇచ్చినట్లు పేరుతో సహా ప్రస్తావించినట్లు తెలిసింది. కమిటీ సభ్యులు విచారణ ప్రారంభించినట్లు తెలియడంతో యూనివర్సిటీలో అవినీతి అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులు, సిబ్బందిలో గుబులు మొదలైంది. కమిటీ సభ్యులు కొన్నిరోజులపాటు విచారణ చేయనున్నట్లు సమాచారం.
తెలంగాణ యూనివర్సిటీలో వీసీ రవీందర్గుప్తా ఆగడాలకు కళ్లెం వేస్తూ పాలకవర్గం తీసుకున్న నిర్ణయాలను నిలుపుదల చేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర తీర్పు వెల్లడించింది. హైదరాబాద్లోని మాసబ్ ట్యాంకు రూసా బిల్డింగ్లో ఏప్రిల్ 19న నిర్వహించిన 55వ పాలకవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును నిలిపివేసినట్లుగా హైకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, విద్యాశాఖ కార్యదర్శితోపాటు పాలకవర్గసభ్యులు, తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్లకు నోటీసులు జారీ చేసింది. హైకోరు మధ్యంతర తీర్పు నేపథ్యంలో తెలంగాణ యూనివర్సిటీలో ఇక మీదట ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఓవైపు పాలకవర్గం, మరోవైపు వీసీ మధ్య జరుగుతున్న పరిస్థితులు ఎటువైపు దారి తీస్తాయో వేచి చూడాల్సి ఉంది. 19న హైదరాబాద్ రూసా భవన్లో పాలకమండలి సమావేశానికి హాజరైన వీసీ కొద్ది నిమిషాలకే సమావేశం నుంచి వెళ్లిపోయారు. అనంతరం పాలకమండలి సభ్యులు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. యూనివర్సిటీలో అక్రమంగా 147 దినసరి వేతన సిబ్బంది నియామకాల రద్దు, అవుట్సోర్సింగ్ సిబ్బంది ప్రమోషన్లను నిలిపివేయడంతో పాటు అక్రమంగా ఖర్చు చేసిన నిధులను రికవరీ చేయాలని యూనివర్సిటీ పాలకవర్గం తీర్మానించింది.