గాంధారి,డిసెంబర్ 10 : కంది(తొగరి)పంటను సాగుచేసిన రైతుల పంట పండనున్నది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది కామారెడ్డి జిల్లా లో కందిసాగు విస్తీర్ణం పెరిగింది. అనుకున్న విధం గా వర్షాలు కురియడంతో కంది పంట ఏపుగా పెరిగింది. సోయా, మక్కజొన్న, మినుము, పెసర తదితర పంటల్లో అంతర్ పంటగా సాగుచేసే కందిపంటను, ఈ సంవత్సరం జిల్లాల్లో అధికంగా 17వేల ఎకరాల్లో సాగుచేశారు. రైతులు సాగు చేసిన కందిపంటకు కాలం కలిసి రావడంతో మంచి దిగుబడులు వస్తాయని రైతులు ఆశిస్తున్నారు. కంది పంటను కొనుగోలు చేసేందుకు గతంలో మాదిరిగానే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో నల్లరేగడి భూములు అధికంగా ఉన్నాయి. వానకాలంలో రైతులు ప్రధానంగా సోయా, మక్కజొన్న, పత్తి తదితర పంటలను ప్రధానంగా సాగు చేయడంతోపాటు అంతరపంటగా కందిని సాగుచేస్తారు. సోయా, మక్కజొన్న పంటలు మూడు నెలల్లోనే కోతకు రావడంతో, కందిపంటను చీడపీడలు ఆశించకుండా సంరక్షిస్తున్నారు. జూన్, జూలై నెలల్లో విత్తుకున్న కంది 160 నుంచి 180 రోజుల్లో కోతకు వస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు కంది పంట ఏపుగా పెరిగి ప్రస్తుతం పూత, కాత దశలో ఉన్నది. గత సంవత్సరం కన్నా ఈ ఏడాది కాలం అనుకూలించడంతో అధిక దిగుబడి వస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఒకే రకమైన పంటను సాగు చేస్తే వాతావరణం అనుకూలించని సందర్భాల్లో రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి నష్టాలను పూడ్చుకోవడానికి చాలా మంది రైతులు ఏకకాలంలో రెండు లేదా మూడు పంటలను సాగుచేస్తున్నారు. ప్రధాన పంటలతో ఆశించినస్థాయిలో దిగుబడి రాకపోయినప్పటికీ అంతర్ పంటలతో ఆ నష్టాన్ని పూడ్చుకొని గట్టెక్కుతున్నారు. ఇందులో భాగంగా సోయా, మక్కజొన్న, మినుము, పెసర పంటల్లో అంతర్ పంటగా కందిని సాగు చేస్తున్నారు. ఈ ఏడాది అంతర పంటగా కందిని సాగుచేసిన రైతులకు కాసులు కురిసే అవకాశం ఉన్నది.
గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో కం ది సాగు విస్తీర్ణం పెరిగింది. నల్లరేగడి భూముల్లో ప్రధాన పంటలతోపాటు అంతర్ పంటగా కందిని సాగు చేస్తారు. గతేడాది జిల్లా వ్యాప్తంగా 15,283 ఎకరాల్లో కంది పంటను సాగు చేయగా, ఈ సంవత్సరం 17వేల ఎకరాల్లో సాగు చేశారు. జిల్లాలో నల్లరేగడి భూములు అధికంగా ఉన్న గాంధారి, సదాశివనగర్, తాడ్వాయి, లింగంపేట్, బిచ్కుం ద, జుక్కల్, మద్నూర్, పిట్లం, బాన్సువాడ, పెద్దకొడప్గల్, రామారెడ్డి తదితర మండలాల్లో సోయా, మక్కజొన్న, మినుము, పెసర తదితర పంటల్లో అంతర పంటగా కందిని సాగు చేస్తారు. రైతులు సాగుచేసిన కందిపంటకు చీడపీడల బెడదను అధిగమిస్తే అధిక దిగుబడులు వస్తాయని అధికారులు చెబుతున్నారు.
ప్రతిరోజూ కంది పైరును పరిశీలించడంతోపాటు చీడపీడలు ఆశించకుండా సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. దీంతో అధిక దిగుబడులు సాధించవచ్చు. పూత, కాత దశలో ఉన్నప్పడు పచ్చపురుగు, లద్దెపురుగు, పేనుబంక వంటి తెగుళ్లు ఆశించే అవకాశాలు ఎక్కువ. వాటి నివారణకు ప్లూబెండాఅమైడ్ అనే రసాయనాన్ని ఎకరానికి 100 ఎంఎల్, లేదా ఇమామెస్టిన్ బెంజోఎట్ అనే మందును 100 ఎంఎల్ పిచికారీ చేసుకోవాలి. పేనుబంక నివారణకు ఇమ్డాక్లోపెడ్ను పిచికారీ చేయాలి. ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు, సలహా ప్రకారం పురుగు మందులను పిచికారీ చేయడంతో చీడపీడల నుంచి రక్షించుకోవడంతోపాటు అధిక దిగుబడులు సాధించవచ్చు.