కమ్మర్పల్లి, డిసెంబర్ 1 : నిజామాబాద్ జిల్లా ఎస్సారెస్పీ వద్ద ఉన్న ప్రభుత్వ పోచంపాడ్ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం నీలి విప్లవానికి బాసటగా నిలుస్తున్నది. పరాయి పాలనలో నిధులు లేక అరకొర ఉత్పత్తి సామర్థ్యంతో మాత్రమే కొనసాగిందీ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం. స్వరాష్ట్రం వచ్చాక తగు నిధులు సమకూరడంతో ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగింది. ఫలితంగా జిల్లాలో వందలాది చెరువులకు పోచంపాడ్ చేప పిల్లలు పోటెత్తుతున్నాయి. తద్వారా మత్య్సకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వానికి వ్యయ భారాన్ని తగ్గిస్తూ ప్రభుత్వ లక్ష్యానికి దోహదపడుతున్నది. దీని అభివృద్ధికి సరైన నిధులు లేక నీరస పడ్డ పోచంపాడ్ చేప పిల్లల అభివృద్ధి కేంద్రాన్ని నీలి వ్లివానికి దోహదపడేలా తీర్చి దిద్దడానికి, ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేసి నిధులు మంజూరు చేయించారు. మంత్రి కృషి ఫలితాలను ఈ కేంద్రం అందిస్తున్నది.
పోచంపాడ్ చేప పిల్లల అభివృద్ధి కేంద్రం సామర్ధ్యాన్ని పెంచితే ఉత్పత్తి పెరిగి మేలు జరుగుతుందని మత్స్యకారులు, మత్స్య శాఖ అధికారులు గత పాలకుల హయాంలో ఎంత అడిగినా దీని అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి చూపలేదు. దీంతో దశాబ్దాల తరబడి అరకొర ఉత్పత్తి, సౌకర్యాల లేమితో ముక్కుతూ మూల్గుతూ కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం నీలి విప్లవ లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నది. ఇందులో భాగంగా మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను అందించే కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పోచంపాడ్లోని ప్రభుత్వ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంపై దృష్టి సారించారు. ఉత్పత్తి కేంద్రాన్ని తరచూ సందర్శిస్తూ ఉత్పత్తి వీలైనంతగా పెంచే ఏర్పాట్లు చేయించారు.అప్పటికి కేవలం 110 నర్సరీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నీటి సౌకర్యానికి ఇబ్బందులు తలెత్తుతుండేవి. దీంతో ఈ కేంద్రం అభివృద్ధికి రూ.7 కోట్ల నిధులు మంజూరు చేయించారు మంత్రి వేముల.
రూ.7 కోట్ల నిధుల మంజూరుతో పోచంపాడ్ చేప పిల్ల ఉత్పత్తి కేంద్రంలో అవసరమైన సౌకర్యాలు సమకూరాయి. నర్సరీల సంఖ్య పెరిగింది. కొత్తగా 140 నర్సరీల నిర్మాణం చేపట్టారు. దీంతో నర్సరీల సంఖ్య 250కి చేరింది. వీటితో పాటు హేచరీల అభివృద్ధి జరిగింది. చైనీస్, ఇకో హేచరీలు, ల్యాబ్తో మేలు రకమైన చేప పిల్లలను అభివృద్ధి చేసే సౌకర్యం కలిగింది. నర్సరీల సంఖ్య పెరగడంతో ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. కొత్తగా ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించడంతో నీటి ఇబ్బందులు తొలగి పోయాయి. ఇలా ప్రభుత్వ ప్రోత్సాహంతో పోచంపాడ్ చేప పిల్ల ఉత్పత్తి కేంద్రం ఉత్పత్తి సామర్థ్యం బాగా పెరగడంతో పాటు ఉత్పత్తిలో వేగం సైతం పెరిగింది. 35-45 ఎం.ఎం. సైజు చేప పిల్లల ఉత్పత్తి నిరాటంకంగా జరుగుతున్నది. ఫలితంగా మత్స్యకారులకు ప్రతి సంవత్సరం ఉచితంగా చేప పిల్లలు అందిస్తుండడంతో ప్రభుత్వానికి అయ్యే వ్యయంలో చేదోడుగా నిలుస్తున్నది. ఈ కేంద్రంలో గత ఏడాది 92.66 లక్షల చేప పిల్లలను ఉత్పత్తి చేసి జిల్లాలోని 323 సీజనల్ చెరువుల్లో వదిలారు. తద్వారా ప్రభుత్వానికి గత సీజన్లో రూ.56 లక్షల వ్యయాన్ని తగ్గించింది. 92.66 లక్షల ఉత్పత్తి సాధిచడం ద్వారా పోచంపాడ్ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం గతేడాది రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. నిజామాబాద్ జిల్లాలో వంద చెరువులకు చేప పిల్లలను అందించేలా నీలి విప్లవానికి బాసటగా ఎదిగింది. బొచ్చ, రోహు, బంగారు తీగ రకాల చేప పిల్లలను అందిస్తున్నది.
2022-23 సీజన్లో భారీగా ఉత్పత్తి సాధించిన పోచంపాడ్ ప్రభుత్వ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం 2023-24 సీజన్లోనూ అదే రీతిలో పని చేసింది. 2023-24 సీజన్లో రూ.4.50 కోట్లతో నిజామాబాద్ జిల్లాలోని 998 చెరువుల్లో 4.57 కోట్ల చేప పిల్లలను విడుదల చేశారు. 2023-24 సీజన్లోనూ పోచంపాడ్ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ద్వారా ప్రభుత్వానికి రూ.28 లక్షల ఆదా అయ్యింది.
పోచంపాడ్ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో చేప పిల్లల ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. దీంతో నీలి విప్లవ లక్ష్యానికి దోహదం జరుగుతున్నది. నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం ద్వారా ఈ కేంద్రంలో ఉత్పత్తి గణనీయంగా పెరిగి చెరువుల్లో పోచంపాడ్ చేప పిల్ల పెరుగుతున్నది. తద్వారా ప్రభుత్వానికి వ్యయం తగ్గిపోతున్నది.