శాసనసభా సమరం ముగిసింది. ఇక స్థానిక సంస్థల పోరు తెరపైకి వచ్చింది. ప్రస్తుత సర్పంచుల పదవీకాలం త్వరలోనే ముగియనున్నది. అలాగే, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా కొద్దిరోజుల్లోనే పదవి నుంచి దిగిపోనున్నారు. ఈ నేపథ్యంలోనే పంచాయతీ, పరిషత్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) దృష్టి సారించింది. నెల, రెండు నెలల్లోనే స్థానిక సంస్థల పోరుకు తెర లేవనున్నది. అసెంబ్లీ ఎన్నికలతో మొన్నటిదాకా నెలకొన్న రాజకీయ వేడి ఇంకా చల్లారనే లేదు.. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ ఎలక్షన్ల రాకతో పల్లెల్లో రాజకీయ వాతావరణం మరింత వేడి పుట్టించనున్నది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయన్న వార్తలతో ఆశావాహుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. బరిలోకి దిగేందుకు ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్న వారు.. ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తన అనుచరులతో మంతనాలు కొనసాగిస్తూనే, ఆర్థిక వనరుల సేకరణపై దృష్టి సారిస్తున్నారు. క్రితం సారి జరిగిన ఎన్నికల్లో దాదాపు అన్ని స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్.. ఈసారి కూడా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నది.
నిజామాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్థానిక సంస్థల పోరుకు రంగం సిద్ధం అవుతున్నది. అసెంబ్లీ ఎన్నికల తంతు ముగియడంతో రాష్ట్రంలో లోకల్ బాడీలకు ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం సంసిద్ధం అయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల పదవీ కాలం ఐదారు నెలల్లోనే ముగుస్తుండడంతో ఈ ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి సారించింది. సాధారణ ఎన్నికల ముందు లేదంటే లోక్సభ ఎన్నికల తర్వాతే ఈ ప్రక్రియ జరుగుతుందని అంచనాలు వినిపిస్తున్నాయి. కాకపోతే ఇప్పటి నుంచే యంత్రాంగం ముందస్తుగా సిద్ధం అవుతుండడంతో అంతటా ఉత్సాహం కనిపిస్తున్నది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు లేఖలు రాయడంతో కదలిక మొదలైనట్లుగా తెలుస్తున్నది. పరిపాలన సంస్కరణలో భాగంగా జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలు పురుడు పోసుకోవడంతో కొత్తగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల పునర్విభజనను గత ప్రభుత్వం పారదర్శకంగా, కచ్చితత్వంతో చేపట్టింది. ఆ మేరకు తెలంగాణ రాష్ట్రంలో 2019లో తొలి స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించింది. ఇప్పుడు రెండో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం ఆసన్నమవుతుండడంతో క్షేత్ర స్థాయిలో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వంలో జోరు కనిపిస్తోంది. రాజకీయ పార్టీలను నమ్ముకుని పని చేస్తున్న కార్యకర్తలంతా తమ నేతలను ప్రసన్నం చేసుకోవడంతో పాటు ప్రజల మద్దతు కోసం ఇప్పటి నుంచే నాయకులు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు.
ప్రాదేశిక పోరు జోరందుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఆశావహులు టికెట్లు దక్కించుకుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. రసవత్తరంగా జరిగే ఈ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లుగా అభ్యర్థులు తలపడనున్నారు. భారత రాష్ట్ర సమితిలో చాలా మంది ప్రయత్నాలను ముమ్మరం చేసే అవకాశం ఉంది. ఇతర పార్టీల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న వారు ఉన్నప్పటికీ.. వారికి గెలుపు అవకాశాలు అంతగా కనిపించడం లేదు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ చేసిన చిన్నపాటి తప్పులతో నష్టం వాటిల్లింది. క్షేత్ర స్థాయిలో నేటికీ బీఆర్ఎస్ పార్టీకే బలం ఉన్నది. ఎక్కడికక్కడ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు వేల సంఖ్యలో ఉన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరుగుతాయి. దీంతో పార్టీలన్నీ స్థానిక పోరును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశాలు లేకపోలేదు. కేసీఆర్ మార్గదర్శకంలో అన్ని స్థానాల్లో సత్తా చాటే విధంగా గులాబీ పార్టీ వ్యూహాలు రచించబోతున్నది. గత ఎన్నికల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని జడ్పీ చైర్మన్ పీఠాలు, మండలాల్లో ఎంపీపీ పదవులన్నీ బీఆర్ఎస్ ఖాతాలోకే వచ్చాయి. అరకొర స్థానాలతోనే కాంగ్రెస్, బీజేపీ సరిపెట్టుకున్నది. బీఆర్ఎస్లోని ద్వితీయ శ్రేణి నాయకులకు స్థానిక సంస్థల ఎన్నికలు మంచి అవకాశంగా ఉపయోగపడనున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం 29 పాత మండలాల్లో (ప్రస్తుతం 33 మండలాలున్నాయి) 530 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో 27 మండలాల పరిధిలో 4932 మంది వార్డు సభ్యులున్నారు. అలాగే 299 మంది ఎంపీటీసీ స్థానాలు 27 మండలాలకు జడ్పీటీసీలున్నాయి. కామారెడ్డి జిల్లాలో 22 పాత మండలాల పరిధిలో(ప్రస్తుతం 25 మండలాలు) 4642 వార్డు మెంబర్లు, 236 ఎంపీటీసీలు, 22 మంది జడ్పీటీసీలున్నాయి.
2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్థానిక సంస్థల బలోపేతం అయ్యాయి. అధికార వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలు, మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటుతో పాటు కొత్త మండల పరిషత్లు ఆవిర్భవించాయి. గతంలో ఉన్న మండల పరిషత్ల రూపురేఖలు మారాయి. బాన్సువాడ, ఎల్లారెడ్డి, భీమ్గల్ మాదిరిగా కొన్ని మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలుగా మారడంతో వాటిని మండల పరిషత్ నుంచి తొలగించడం ద్వారా భౌగోళిక స్వరూపంలో మార్పులు చోటు చేసుకున్నాయి. కేసీఆర్ సంకల్పంతో గతంలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలతో కూడా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో మార్పులు, చేర్పులు జరగడం ద్వారా మెండుగా రాజకీయ అవకాశాలు సైతం కల్పించబడ్డాయి. ఉమ్మడి జిల్లా పరిషత్ పరిధిలో గతంలో 583 ఎంపీటీసీ స్థానాలుండగా కామారెడ్డి జిల్లాలో పాత ఎంపీటీసీ స్థానాలు 256, నిజామాబాద్ జిల్లాలో 327 ఎంపీటీసీ స్థానాలు కేటాయించారు. పునర్విభజనలో పలు విలీన గ్రామాలను తీసివేయడం ద్వారా అనేక చోట్ల ఎంపీటీసీ స్థానాలు కొన్ని రద్దు చేయబడ్డాయి. దీంతో ప్రస్తుతం కామారెడ్డిలో 236 ఎంపీటీసీ, నిజామాబాద్లో 299 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎంపీటీసీ స్థానాల పునర్విభజనను గత ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహించడం ద్వారా కొత్త ఎంపీటీసీ స్థానాలను, జడ్పీటీసీ స్థానాల పరిధితో స్థానిక సంస్థలు బలోపేతమయ్యాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముందస్తు ఏర్పాట్లలో భాగంగా కసరత్తు షురూ అయ్యింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల పునర్విభజన ప్రక్రియ చేపట్టడంతో పాటు ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించినట్లుగా తెలుస్తున్నది. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారులకు(కలెక్టర్లు) లేఖలు రాయడంతో అంతటా హుషారు కనిపిస్తున్నది. జిల్లా పరిషత్, మండల పరిషత్, జిల్లా ప్రాదేశిక నియోజకవర్గం(జడ్పీటీసీ), మండల ప్రాదేశిక నియోజకవర్గం(ఎంపీటీసీ)ల రిజర్వేషన్లను గత ప్రభుత్వమే పారదర్శకంగా నిర్ణయించింది. లాటరీ పద్ధతిలో వీటిని ఖరారు చేయ గా ఇప్పుడదే పద్ధతిని రాష్ట్ర ఎన్నికల సంఘం పాటించబోతున్నది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2019లోనే తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. దీంతో మొదటి సారి నిర్వహించిన ఎన్నికల్లో లోటుపాట్లు లేకుండా కేసీఆర్ నేతృత్వంలోని గత ప్రభు త్వం ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేసింది. జిల్లా పరిషత్, మండల పరిషత్లకు రాష్ట్ర స్థాయిలోనే రిజర్వేషన్లను ఖరారు చేయగా, ఎంపీటీసీల రిజర్వేషన్లు మాత్రం ఆర్డీవోల సమక్షంలో నిర్ణయించారు. శాసనసభ, గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగా కాకుండా ప్రాదేశిక పోరులో 600 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసింది. అందుకు తగ్గట్లుగానే జిల్లాల వారీగా ఓటర్ల వివరాలు, ఆ మేరకు ఏర్పాటయ్యే పోలింగ్ కేంద్రాల సంఖ్యపై అంచనాకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్లుగా తెలిసింది. స్థానిక పోరుకు ముందే కొత్తగా అర్హత పొందిన యువతకు ఓటరు నమోదు కోసం మరోసారి అవకాశం దక్కబోతున్నది.
ముప్కాల్ డిసెంబర్ 11 : పంచాయతీల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సంసిద్ధతను వ్యక్తం చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపితే స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి ఒకటో తేదీతో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల పదవీ కాలం ముగియనున్నది పాలకవర్గాల పదవీ కాలం ముగియక ముందే ఎన్నికలు నిర్వహించాలని గతంలో హైకోర్డు ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో చేపట్టాలని ఎన్నికల సంఘనికి కోర్టు గతంలోనే ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకొని పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తును ప్రారంభించింది. ఓటర్ల సంఖ్య ఆధారంగా ప్రీసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందిని ఎంపిక చేసి వారి వివరాలను అందించాలని ఎన్నికల సంఘం పంచాయతీ అధికారులను ఆదేశించింది. ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలతో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయని గ్రామాల్లో విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. పోటీకి ఉత్సాహం చూపుతున్న నాయకులు ఎవరికి వారే తమ మద్దతుదారులతో సంప్రదింపులను మొదలు పెట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన సందర్భంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తి చూపుతారా లేదా అనేది వేచిచూడాలి.