బాన్సువాడ టౌన్/రుద్రూర్, సెప్టెంబర్ 7: మారుమూల ప్రాంతంలో ఉన్న తమ గ్రామంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలను సమకూర్చిన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి వెంటే ఉంటామని రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామస్తులు స్పష్టం చేశారు. ఈ మేరకు గ్రామంలోని పలు కుల సంఘాల పెద్దలు, గ్రామస్తులు పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. బాన్సువాడలోని స్పీకర్ నివాసానికి గురువారం గ్రామానికి చెందిన అంబేద్కర్ సంఘంతోపాటు దండోరా, మరాఠా, గంగపుత్ర, కాపు, ముదిరాజ్, కురుమ, మైనార్టీ సంఘాల కుల పెద్దలు తరలివచ్చి తీర్మానం కాపీని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాయకూర్ గ్రామ అభివృద్ధి కోసం రూ. కోట్ల నిధులను మంజూరు చేసి పనులు చేపట్టారని, ఆయన రుణం తీర్చుకోలేనిదని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి సంపూర్ణ మెజార్టీని అందించి కృతజతలు తెలుపుకుంటామన్నారు.
గ్రామంలోని అన్ని కులాలకు సంఘ భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించారని, కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకం చేరని గడప లేదన్నారు. బీఆర్ఎస్, పోచారం వెంటే తమ గ్రామం ఉంటుందని స్పష్టం చేశారు. బాన్సువాడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోచారం శ్రీనివాసరెడ్డికి మరోసారి అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. తమ గ్రామంలో బీఆర్ఎస్ జెండా తప్ప ఇతర పార్టీల జెండాను ఎగరనివ్వబోమని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ తప్ప ఇతర పార్టీలు గ్రామంలోకి రావద్దన్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి.. భవిష్యత్తులో మరే ఇతర నాయకులు వచ్చినా పదిశాతం కూడా చేయలేరని అన్నారు. అనంతరం అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో స్పీకర్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ బ్యాగరి గంగారాం, ఉప సర్పంచ్ పందిరోళ్ల గంగారాం, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు లక్ష్మయ్య, ఏఎంసీ డైరెక్టర్ గోవింద్రావ్ పటేల్, కుల సంఘాల అధ్యక్షులు సంతోష్, ఎర్రోళ్ల పోశెట్టి, బాబూరావు, కురుమ గంగారాం, సాయిలు, గంగా రాం, షేక్ గౌస్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.