నిజామాబాద్ సిటీ : దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహనీయుల కలలను నిజం చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శనివారం మహాత్మాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ,శాస్త్రిల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి జైలుకు వెళ్లి అహింస మార్గం ద్వారా భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చారని గుర్తుచేశారు. వారి స్ఫూర్తితో ముందుకుసాగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ మకరంద్ , అదనపు కలెక్టర్లు చిత్రమిశ్రా, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కమీషనరేట్ కార్యాలయంలో పోలీసు కమిషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు అరవింద్ బాబు మహాత్మాగాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. రెడ్ క్రాస్ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి బుస ఆంజనేయులు ఆధ్వర్యంలో జయంతిని నిర్వహించారు. మహాత్మాగాంధీ అహింస మార్గ ఆధునిక సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మాదస్తు రాజారెడ్డి అన్నారు. బార్ సమావేశ హాల్లో గాంధీజీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు.