నిజామాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / నిజాంసాగర్ : దళితులు సంపన్నులుగా ఎదగాలనే సంకల్పంతో అమలు చేస్తున్న దళితబంధు పథకం విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతున్నది. వంటింటికే పరిమితమైన అబలకు ఈ పథకం ద్వారా కొండంత అండ లభిస్తున్నది. తద్వారా సామాజిక మార్పులో మహిళల పాత్ర గణనీయంగా ఉండే విధంగా ఈ పథకం ఉపకరిస్తున్నది. సమైక్య పాలనలో తెలంగాణలో తరతరాల వివక్ష, అణచివేతలకు గురై విముక్తి కోసం నిత్యం పోరాటం చేస్తున్న దళిత జాతిని పైకి తీసుకురావాలన్న ఆకాంక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ బృహత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం ఇప్పుడిప్పుడే సత్ఫలితాలను తీసుకువస్తున్నది.
పేదింట ఆర్థిక ఫలాలను దరి చేర్చడం ద్వారా వారి కష్టాలు, కడగండ్లు మటుమాయం అవుతున్నాయి. దళితబంధు ద్వారా అందుతున్న ఆర్థిక మద్దతుతో మహిళా లోకం అభివృద్ధి చెందుతున్నది. వ్యవసాయ కూలీలుగా కొనసాగిన వారంతా వ్యాపారులుగా రూపాంతరం చెందుతున్నారు. మహిళా సాధికారతకు నిలువెత్తు రూపంగా దళితబంధులో మహిళా లబ్ధిదారులు ఉదాహరణగా నిలుస్తున్నారు. వీరి విజయగాథలు ఎంతో మందికి స్ఫూర్తివంతంగా మారుతున్నాయి. నేడు గణతంత్ర దినోత్సవం జరుపుకొంటున్న వేళ తెలంగాణలో దళిత సమాజానికి రాజ్యాంగ ఫలాలను దరి చేరుస్తున్న వైనంపై ప్రత్యేక కథనం.
స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్నా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇప్పటికీ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉండడానికి కారణం గత పాలకుల నిజాయితీ లేనితనమే. ఈ లోపాన్ని పూరించడానికి ఇన్నాళ్లకు తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తున్నది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి అండగా నిలుస్తూ సీఎం కేసీఆర్కు జై కొడుతున్నారు. సంక్షేమ పాలనను పటిష్టంగా, సుస్థిరంగా పది కాలాల పాటు కొనసాగేలా మద్దతు తెలుపుతున్నారు. సరిగ్గా 15 నెలల క్రితం ఏర్పాటైన దళితబంధు పథకం యూనిట్ల స్థాపనతో వ్యాపారాలు, వాణిజ్య కార్యకలాపాలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. సరికొత్త దారిలో నడుస్తూ ప్రగతి పథంలో దళితబంధు మహిళా లబ్ధిదారులు దూసుకుపోతున్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో దళిత సమాజాన్ని ముందుకు తీసు కెళ్లేందుకు చేపడుతున్న ఈ కార్యక్రమం యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. సామాజిక వివక్షకు వ్యతిరేకంగా నాడు అంబేద్కర్ నడిచిన దారిలో నేడు సీఎం కేసీఆర్ పయనిస్తున్నారు. ఏడున్నర దశాబ్దాల భారతావనిలో దళిత ప్రజల జీవితాల్లో కనిపించని మార్పును దళితబంధుతో చేసి చూపెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇందుకు వేదిక కావడంతో పాటుగా యావత్ దేశానికి ఇప్పుడు ఆదర్శంగా మారింది. నిజామాబాద్ జిల్లాలో 550 మంది లబ్ధిదారుల్లో 107 మంది మహిళలకు యూనిట్లు మంజూరు చేశారు. కామారెడ్డిలో 350 మందిలో దాదాపు 100 మందికి లబ్ధి జరిగింది. పైలెట్ మండలం నిజాంసాగర్లో 1298 యూనిట్లలో 300 మంది మహిళలకే వర్తింపజేశారు.
మిషన్ కాకతీయతో చెరువుల పూడిక తీయించా రు. పుష్కలంగా సాగునీటితో పాటు గణనీయంగా భూగర్భ జలాలు పెరిగాయి. వ్యవసాయానికి నిరంతర నాణ్యమైన కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణను రూపొందించారు. కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల పథకాలనూ రూపొందించారు. పోడు, బీడు భూములను సాగులోకి తెచ్చారు. రాష్ట్రంలో రైతులకు రైతుబంధును అందిస్తూ తద్వారా లక్షల ఎకరాలకు అదనంగా సాగు వసతిని కల్పించారు. పంజాబ్, హర్యానాలను మించి ధాన్యాన్ని అందించిన కేసీఆర్కు ఏకంగా నీతి ఆయోగ్ ప్రశంసలు సైతం దక్కాయి. భావితరాల గురించి ఆలోచన చేసి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని తప్పక తన ఎజెండాలో పెట్టుకొని భూభాగంలో 33.3శాతం అడవులుంటేనే ప్రకృతి సమతూకంతో ఉన్నట్లు అన్న సందేశానికి అనుగుణంగా హరితహారంతో గొప్ప కార్యక్రమాన్ని అమలు చేశారు. వ్యవసాయాభివృద్ధి ద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో పారిశ్రామిక వేత్తలు తెలంగాణవైపు దృష్టి సారించారు. ఏ పరిశ్రమకైనా సరే 15రోజుల్లో అనుమతి లభించేలా సరళీకృత పారదర్శక విధానం టీఎస్ ఐపాస్ విధానాన్ని తీసుకు వచ్చారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో పారిశ్రామిక అభివృద్ధి కొంత వరకే పరిమితం కాగా ఇప్పుడు సమూల ప్రక్షాళనతో అన్ని రంగాల్లో అన్ని ప్రాంతాల్లోనూ దూసుకుపోతున్నది.
నాకు దళితబంధు పథకం కింద నాలుగు చక్రాల ఆటో మంజూరైంది. నా కుమారుడు ఆటో నడిపిస్తున్నా డు. మా గ్రామం నుంచే కాకుండా పక్కన గల మరో రెండు గ్రామాల నుంచి నిజాంసాగర్లోని పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్తున్నాడు. దీంతో పాటు ప్రతిరోజూ పిట్లం, బాన్సువాడ, ఎల్లారెడ్డి గ్రామాలకు ప్యాసింజర్లను తీసుకెళ్తుండడంతో పాటు కిరాయిలకు వెళ్తున్నాడు. ఐదు నెలల నుంచి అన్ని ఖర్చులు పోను నెలకు రూ.25వేల వరకు మిగులుతున్నాయి. ఇదంతా కేసీఆర్ సార్ దయ వల్లే.
-మంగ శాంతవ్వ, గోర్గల్, నిజంసాగర్ మండలం
నాకు దళితబంధు పథకం కింద పది లక్షల రుపాయలు మంజూరయ్యాయి. వాటితో ఆరు గేదెలను కొనుగోలు చేయడంతో పాటు షెడ్డును వేసుకున్నా ను. ఆరు గేదెల్లో రెండు గేదెలు ఈనడంతో మొత్తం ఎనిమిది అయ్యాయి. ప్రస్తుతం రోజూ సాయంత్రం కలిపి 15 లీటర్ల వరకు పాలు ఇస్తున్నాయి. వాటిని విక్రయించవడం ద్వారా రోజుకు రూ.800 వరకు మిగులుతున్నాయి. మొన్నటి వరకు పూట గడవడం కష్టంగా మారిన మా ఇంట్లో నేడు ప్రతిరోజూ డబ్బులను చూస్తున్నాం. ఇదంతా ముఖ్యమంత్రి సారు దయ వల్లే, ఆయన సల్లగా ఉండాలి.
-మరియవ్వ, గోర్గల్, నిజాంసాగర్ మండలం