నిజామాబాద్ క్రైం, ఏప్రిల్ 30: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కానిస్టేబుల్ ఫైనల్ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించారు. మొత్తం 12 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఇన్చార్జి సీపీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ పలు సెంటర్లను తనిఖీ చేశారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేశారు. ఫైనల్ పరీక్షకు 5,285 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా.. 5,237 మంది హాజరయ్యారు.
వివిధ ప్రాంతాల నుంచి పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థులు వారికి కేటాయించిన ఎగ్జామ్ సెంటర్కు సులువుగా చేరుకునేందుకు నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులు దారి తెలియజేస్తూ రూపొందించిన ఫ్లెక్సీలను ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాలను రీజినల్ కో-ఆర్డినేటర్ పి.రామ్మోహన్రెడ్డి, నిజామాబాద్ నోడల్ ఆఫీసర్, అదనపు పోలీస్ కమిషనర్ జి.మధుసూదన్ రావు తనిఖీ చేశారు. అదనపు డీసీపీ గిరిరాజ్, నిజామాబాద్ ట్రాఫిక్ ఏఆర్సీటీసీ, ఏసీపీలు కిరణ్ కుమార్,నారాయణ, సంతోష్, శ్రావణ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, అదనపు రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ కుమార స్వామి, ఐటీ ఎస్ సిబ్బంది పాల్గొన్నారు.