మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టం ప్రవేశపెట్టింది. నిర్భయ అంటే నేటి సమాజంలో ప్రతి ఒక్కరి మదిలో మెదులుతూ మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తున్న చట్టం. గతంలో ఎన్నడూ లేనంతగా మహిళలకు భద్రత కల్పిస్తున్న ఏకైక చట్టం. మహిళలను వేధించే వారి గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్న నిర్భయ చట్టంపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.నిర్భయ చట్టం అంటే ఏమిటీ? ఆ చట్టం ఎప్పుడు వచ్చింది? ఎందుకు తేవాల్సి వచ్చింది? ఆ చట్టం పరిధిలో ఉన్న అంశాలేంటివి? ఎటువంటి సమయాల్లో నిర్భయ చట్టం కేసు నమోదవుతుంది. ఈ చట్టం మహిళలకు ఎలాంటి భద్రత కల్పిస్తుందనే విషయాలపై వివరిస్తున్నారు.
Nirbhaya Act | సదాశివనగర్, డిసెంబర్ 10: 2013లో దేశ రాజధానిలో ఓ యువతిపై సామూహిక లైంగిక దాడి జరిగింది. ఆ యువతి చికిత్స పొందుతూ దవాఖానలో మృతిచెందింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మహిళలను గౌరవిస్తున్న దేశాల్లో ప్రధానమైనది మన భారతదేశం. అలాంటి భారతదేశంలో ఓ యువతిపై సభ్య సమాజం సిగ్గుపడేలా లైంగికదాడి జరపడం.. ఆ యువతి మృతి చెందడంపై దేశవ్యాప్తంగా మహిళల భద్రతపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందే ఈ నిర్భయచట్టం-2013. 2013 మార్చి 19న లోక్సభలో, మార్చి 21న రాజ్యసభలో ఈ చట్టం ఆమోదం పొందింది. అప్పటి నుంచి మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించినా, అవమానించినా, వారి మనోభావం దెబ్బతినేలా ప్రవర్తించినా నిర్భయ-2013 చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలనేదే ప్రధాన ఉద్దేశం.
మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా, వారిని వేధించినా చట్ట ప్రకారం నేరం. అలాంటి వారిపై చర్యలు తప్పవు. మహిళలపై బాధ్యతగా వ్యవహరించి వారిని గౌరవించాల్సిన సంస్కృతిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి. పోక్సో చట్టం (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్స్వల్ అఫెన్సెస్) ఏకైక చట్టం ఉన్నది. 18ఏండ్లు నిండని ఆడ, మగవారు ఫిర్యాదు చేయవచ్చు. అమ్మాయికి ఇష్టం ఉన్నా.. మైనర్ కావడంతో చట్టంలో చెల్లదు. ఈ నేరాల్లో చుట్టాలే నేరస్తులుగా ఉండే అవకాశం ఉంటుంది. 18ఏండ్ల పిల్లలపై జరిగే నేరాలకు 20ఏండ్ల శిక్షణ ఉంటుంది. కేసు నమోదైన 24గంటల లోపల న్యాయమూర్తి వద్ద ప్రవేశపెట్టి, 164 స్టేట్మెంట్ రికార్డు చేస్తాం. కోర్టు కేసులు నడిచే సమయంలో రికార్డు అయిన తర్వాత తప్పకుండా శిక్ష పడుతుంది. 60రోజుల్లోనే చార్జీషీట్ ఫైల్ చేసి కోర్టుకు అందిస్తాం. దీంతో నిందితులకు శిక్షపడే అవకాశం ఉంటుంది.
దేశంలో మహిళలు, పిల్లలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. చిన్న పిల్లలపై లైంగిక దాడికి పాల్పడితే కఠిన శిక్ష ఉంటుంది. పోక్సో చట్టం వచ్చిన తర్వాత 18ఏండ్లు నిండని పిల్లలపై నేరాలు తగ్గాయి. సోషల్ మీడియా విషయంలో ఆడపిల్లలు, గృహిణులు అప్రమత్తంగా ఉండాలి. పరిచయం లేని వారితో సంభాషణలు చేయొద్దు. చిన్నపిల్లల పట్ల ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలి.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, మహిళా సంఘాలు, అంగన్వాడీ, ఆశ వర్కర్లతోపాటు గ్రామాల్లో చట్టాలపై అవగాహన కల్పిస్తు న్నాం. గ్రామాల్లో పిల్లలు చెడు వ్యసనాలకు బానిసకాకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉన్నది. జిల్లాలో 500వరకు అవగాహన సమావేశాలు ఏర్పాటు చేశాం. ఇంటి పక్కవారు, బంధువుల వరుస అయిన వారు ప్రేమగా నటిస్తూ పిల్లలను దగ్గరికి తీసుకొని ఫొటోలు, వీడియోలు తీస్తూ వారి తల్లిదండ్రులకు తెలియకుండా బ్లాక్ మెయిల్ చేస్తూ చిత్రహింసలు పెట్టడం వంటివి చేస్తారు. ఎవరికైనా సరే పిల్లలను నమ్మవద్దు.
పిల్లలకు తెలిసీతెలియని వయస్సులో పెండ్లి చేసి తల్లిదండ్రులు చేతులు దులుపుకొంటున్నారు. బాల్య వివాహాల నిరోధక చట్టం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ పిల్లల వయస్సు వచ్చిన తర్వాతే పెండ్లి చేస్తున్నారు. బాల్య వివాహం చేస్తే కఠినంగా శిక్షించేలా చట్టం ఉన్నది. బాల్య వివాహాలు చేసినట్లు తెలిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలి. బాల్య వివాహం చేసిన వారిపై పోలీసులు, ఐసీడీఎస్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి తల్లిదండ్రులు, బంధువులపై కేసు నమోదు చేస్తారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా బాల్య వివాహాలను అడ్డుకోవాలి.
మహిళల రహస్య, వ్యక్తిగత చర్యలను చూడడం, అలాంటి వాటిని ఫొటోలు తీయడం కూడా నిర్భయ/2013 చట్టం కింద నేరమే.
బహిర్భూమికి వెళ్లిన వారిని చూడడంతోపాటు మహిళలతో కలిసి దిగిన ఫొటోలు ఇతరులకు చూపి ఫొటోల్లో ఉన్న మహిళలను కించపరిచేలా ఇబ్బంది పెట్టడం కూడా నిర్భయచట్టం ప్రకారం నేరమే.
మహిళలను లైంగికంగా వేధించడంతోపాటు భౌతికంగా వేధిస్తూ శరీరానికి తాకడం.
పురుషులు మహిళలను లైంగికంగా వేధిస్తూ తన కోరికలు తీర్చాలని వెంటపడడం.
మహిళల ఇష్టానికి వ్యతిరేకంగా నీలిచిత్రాలు చూపించడం, ఇబ్బందికరంగా ఉన్న నీలిచిత్రాలకు సంబంధించిన ఫొటోలు చూపించి ఇబ్బంది పెట్టడం.
మహిళలనుద్దేశించి లైంగిక పరమైన వ్యాఖ్యలు చేసి ఇబ్బందిపెట్టడం కూడా నిర్భయ చట్టం కిందకే వర్తిస్తాయి.
ఒంటిపై బట్టలులాగి వేధించడం, బలప్రయోగంగా వివస్త్రను చేసి అవమానించడం.
మహిళలను వేధించడంతోపాటు వారిని వెంబడించడం, వారితో చనువుగా ఉండేందుకు ప్రయత్నించినా నేరమే.
సోషల్మీడియా, సెల్ ఫోన్లతో ఇబ్బందిపెడుతూ అసభ్యకరమైన మెసేజ్లు పెట్టి లోబర్చుకునేందుకు ప్రయత్నించినా నిర్భయచట్టం ప్రకారం నేరస్తులే.
ఈ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు కావడంతోపాటు కోర్టుల్లో నేరాలు రుజువైతే మొదటిసారి నిందితులకు మూడేండ్లు శిక్షపడే అవకాశం ఉంటుంది. అదే వ్యక్తి రెండోసారి ఇదే సెక్షన్ల కింద నిందితుడిగా ఉండి కోర్టులో రుజువైతే ఐదేండ్లు జైలు శిక్ష పడుతుంది. మూడోసారి ఇదే కేసులో నిందితుడుగా రుజువైతే మళ్లీ మరో ఐదేండ్లు జైలు శిక్ష పడుతుంది.