నిజామాబాద్ కల్చరల్, డిసెంబర్ 31 : ప్రపంచంలో వెలకట్టలేనిదంటూ ఏదైనా ఉందంటే అది ఒక్క సమయం మాత్రమే. కండ్లు తెరిచి మూసేలోగా రోజులు గడిచిపోతున్నాయి. ఆ కాలచక్రంలో 2023వ సంవత్సరం చేరిపోయింది. ఎన్నో తీపి, చేదు గుర్తులను మనకు వదిలి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం నుంచే ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల సందడి మొదలైంది. అర్ధరాత్రి దాటే వరకు హంగామా కొనసాగింది. మహిళలు, యువతులు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఇంటి ముంగిట ముగ్గులు వేయడంలో మునిగిపోయారు. బేకరీ నిర్వాహకులు నోరూరించే కేకులు తయారు చేసి, నగరంలోని కూడళ్లలో అమ్మకానికి పెట్టారు. బేకరీలు, రెస్టారెంట్లు, హోటళ్లు ప్రత్యేక ఆఫర్లతో బ్యానర్లను ఏర్పాటు చేశారు. బార్లు, వైన్షాపులు, మాంసాహార షాపుల వద్ద సందడి కనిపించింది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు నూతన సంవత్సరాన్ని ఆహ్వానించారు. అర్ధరాత్రి నుంచే ఆన్లైన్లో శుభాకాంక్షల సందడి మొదలైంది. లేత భానుడి కిరణంలా ఆనందోత్సవాలతో నూతనోత్తేజం నింపేందుకు 2024 సంవత్సరం మన ముంగిట నిలిచింది. పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు.
నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 31 : నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 31 డిసెంబర్ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. అదనపు డీసీపీ జయరాం పర్యవేక్షణలో అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలోని ప్రధాన జంక్షన్ల వద్ద ప్రత్యేక నిఘా పెట్టారు. స్పెషల్ పార్టీ సిబ్బంది, మొబైల్ పెట్రోలింగ్, పికెట్లను రంగంలోకి దింపారు. మద్యం సేవించి తిరిగే వారితో రోడ్డు ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉండడంతో తగిన చర్యలు చేపట్టారు. ర్యాష్ డ్రైవింగ్, అల్లర్లు చేయకుండా, ఆకతాయిలతో ఇతరులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు విధుల్లో నిమగ్నమయ్యారు. ట్రాఫిక్ ఏసీపీ నారాయణ పర్యవేక్షణలో సీఐచందర్ రాథోడ్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బంది అన్ని ప్రధాన ఏరియాలో వాహనాలను అదుపు చేసేందుకు బారికేడ్లను ఏర్పాటు చేశారు.