జగదాననంద కారకుడు.. శ్రీ రాముడి జన్మస్థలంలో అయోధ్య భవ్య మందిర కల నెరవేరిన మధుర క్షణాలు రానేవచ్చాయి. ఎన్నో వివాదాలను అధిగమించి మరెన్నో న్యాయ పోరాటాల అనంతరం రూపుదిద్దుకున్న రాములోరి ఆలయ ప్రారంభోత్సవ వేడుకలను నేడు (సోమవారం) దేశ వ్యాప్తంగా జరుపుకొనేందుకు ప్రతి రామ భక్తుడూ ఎదురు చూస్తున్నాడు. అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠాపనోత్సవాలను ఉమ్మడి జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు ఊరూరా సంబురాలు నిర్వహించేందుకు హనుమాన్, రామాలయాలను ముస్తాబు చేశారు.
లోకాభిరాముడి ఆలయ ప్రారంభోత్సవాన్ని ఊరూరా పండుగ వాతావరణలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. హనుమాన్, రామాలయాల పరిసరాలను శుభ్రం చేశారు. కాషాయ జెండాలు, విద్యుద్దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. ఇంటింటా దీపాలు వెలిగించి రాములోరికి స్వాగతం పలికేందుకు భక్తులు సిద్ధమయ్యారు
ఉమ్మడి జిల్లాలో అయోధ్య పండుగ సందడి నెలకొన్నది. ఇప్పటికే రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో రాముడి పూజిత అక్షింతలతో ఊరూరా శోభాయాత్రలు నిర్వహించి గడపగడపకూ పంపిణీ చేశారు. భవ్య రామమందిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని రెండు రోజులుగా భక్తులు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. దీక్షలు చేపట్టి మద్యం, మాంసాలను దూరం పెట్టారు. చాలా గ్రామా ల్లో ఈ మేరకు తీర్మానాలు కూడా చేశా రు. ఆలయాల్లో దీపారాధనలు, భజనలు, కీర్తనలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున అన్నదానాల నిర్వహణ కు ఏర్పాట్లు చేశారు.
వినాయక్నగర్, జనవరి 21: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిర్దేశిత ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ కల్మేశ్వర్ సింగెనవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో 22వ తేదీ ఉదయం 6 నుంచి 23వ తేదీ ఉదయం 6 గంటలకు వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయ న్నారు. నిజామాబాద్ డివిజన్లోని శంభుని గుడి, గోల్హన్మాన్, ఖిల్లా రఘునాథ ఆలయం, ఆర్మూర్ డివిజన్లోని కన్యకా పరమేశ్వరీ ఆలయం, రాంనగర్ రామాలయం, బోధన్ డివిజన్లోని బోధన్ రామాలయం, మారుతీమందిరం, రాకాసీపేట్ హనుమాన్ దేవాలయం, ఏకచక్రేశ్వర స్వామి దేవాలయ ప్రాంతాల్లో కిలోమీటర్ మేర ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు.