ఖలీల్వాడి డిసెంబర్ 19 : జిల్లాలో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో ఉదయం పూట పొగమంచు కమ్మేస్తున్నది. పొగ మంచుతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. తుపాన్ ప్రభావంతో చలి తీవ్రత పూర్తిగా తగ్గిపోగా.. క్రమంగా పెరుగుతూ వస్తున్నది. ఇప్పటి వరకు ఈ సీజన్లో అత్యల్పంగా 8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. జలుబు, తల నొప్పి, జ్వరం తదితర వ్యాధులు చలి గాలుల ద్వారా వ్యాప్తిచెందే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే అనారోగ్యం బారి నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు. సాయంత్రం 5 గంటలు దాటితే చలితీవ్రత ఎక్కువ అవుతున్నది. తొమ్మిది గంటల ప్రాంతంలోనే మంచు ఎక్కువగా కురవడంతో రోడ్ల పై ఎవరూ కనబడడం లేదు. రెండు రోజుల్లోనే చలి తీవ్రత ఎక్కువ కావడంతో చిన్న పిల్లలు, వృద్ధులు జ్వరం, జలుబుతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. చలి తీవ్రత పెరుగుతున్నందున చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యుడు జలగం తిరుపతి రావు సూచించారు. వీలైనంత వరకు ఆహారం వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలన్నారు.