నిజామాబాద్, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ యూనివర్సిటీలో రెగ్యులర్ వైస్ చాన్స్లర్గా ఉన్న రవీందర్ గుప్తా జైలుకు వెళ్లగా అప్పట్లో చోటుచేసుకున్న గందరగోళానికి కాసింత ఫుల్స్టాప్ పడినట్లయ్యింది. తీవ్ర అవినీతి, అక్రమాలకు కేరాఫ్గా నడిచిన విశ్వవిద్యాలయంలో లంచాలు బహిరంగంగానే కొనసాగగా డబ్బులు పుచ్చుకుంటూ వీసీ అడ్డంగా ఏసీబీకి చిక్కి పదవీచ్యుతుడు అయ్యా డు. తదనంతరం ఇన్చార్జి వీసీగా సీనియర్ ఐఏఎస్లు కొనసాగుతున్నప్పటికీ టీయూలో మార్పు అన్నది మచ్చుకూ కనిపించడం లేదు. ఇన్చార్జి వీసీగా కొన్నాళ్లపాటు వాకాటి కరుణ కొనసాగారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుతం బుర్రా వెంకటేశం ఈ బాధ్యతలను చేపట్టారు. సీనియర్ ఐఏఎస్ సారథ్యంలోనే టీయూ పరిపాలన పేరుకే నడుస్తున్నది. అంతా రిజిస్ట్రార్ కనుసన్నల్లోనే , ఆయన చెప్పిందే వేదం అన్న చందంగా మారింది. అన్నీ తెలిసి ప్రస్తుత రిజిస్ట్రార్ కూడా తప్పులు చేయడం, గత పాలకవర్గం చేసిన తీర్మానాలను అమలు చేయకపోవడం, పరిపాలనను గాడిలో పెట్టాల్సింది పోయి అస్తవ్యస్థంగా మార్చడం వంటి వ్యవహారాలతో మరోసారి తెలంగాణ విశ్వవిద్యాలయం వివాదాస్పదమవుతున్నది. ముఖ్యంగా పీజీ, యూజీ కోర్సుల్లో విద్యనభ్యసించే వేలాది మంది విద్యార్థులకు కీలకమైన జవాబుపత్రాల వ్యవహారంలో చోటు చేసుకుంటున్న నిర్లక్ష్యంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నది.
పాత వీసీ హయాంలో టీయూ పరీక్షల విభాగం భ్రష్టు పట్టింది. పైసలిచ్చినోళ్లకు ఏ పనంటే అది చేసి పెట్టడం ఇక్కడ రివాజుగా మారినట్లు ఆరోపణలున్నాయి. యూనివర్సిటీ అందించే వివిధ కోర్సుల జవాబు పత్రాల మూల్యాంకనం గతంలో ఆఫ్లైన్లో జరిగేది. వివాదాస్పద వీసీగా ముద్రపడిన రవీందర్ గుప్తా ఏకంగా ఆన్లైన్ పేరిట ఓ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా మూల్యాంకనాన్ని అప్పగించారు. ఊరూ పేరూ లేని సంస్థకు కీలకమైన పనులను కట్టబెట్టడంతో ఇప్పుడు జవాబు పత్రాల విశ్లేషణ, మార్కుల సంగ్రహణ అన్నది అస్తవ్యస్తంగా మారింది. జవాబుపత్రాలను స్కాన్ చేసి ఆన్లైన్ ద్వారా మూల్యాంకనం చేస్తే వేగంగా, తక్కువ కాలంలోనే ఫలితాలు వెల్లడి కావాలి. ఇదే ఉద్దేశంతో ఆన్లైన్ పేరిట ఒక సంస్థకు టీయూ నుంచి రూ.50లక్షలకు పైగా నిధుల కేటాయింపులు జరుగుతున్నది. ఇక బ్యాక్లాగ్ అభ్యర్థులు పెరిగితే చెల్లింపులు మరింత పెరిగేలా కాంట్రాక్ట్ జరిగింది. కానీ మూడేండ్లలో సరైన సమయానికి ఫలితాలు వెల్లడి కాలేదు. 45రోజుల్లో రావాల్సిన ఫలితాలు ఏకంగా మూడు నెలలకు వెల్లడించిన దాఖలాలున్నాయి. దీంతో ప్రస్తుతం ఒక ఏడాది గ్యాప్ ఏర్పడినట్లుగా విద్యార్థులు, యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. గజిబిజి గందరగోళాన్ని సరిదిద్దేందుకు రిజిస్ట్రార్గా యాదరిగికి బాధ్యతలిస్తే ఆయన కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పాత వ్యవస్థను మార్చకపోవడంపై అనేక మందిలోనూ అసంతృప్తి వ్యక్తమవుతున్నది. టీయూను కాపాడతారని విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు, స్వచ్ఛంద సంస్థలు, పాలకవర్గం ఎంతగానో ఆశపడగా అదంతా అడియాశగానే మిగిలినట్లయ్యింది.
జవాబు పత్రాల మూల్యాంకన బాధ్యతలను ఇతర సంస్థలకు అప్పగించాలని గతంలో నిర్ణయం జరిగింది వాస్తవమే. త్వరలోనే కొత్త సంస్థకు బాధ్యతలు అప్పగిస్తాం. ఇందుకోసం నోట్ ఫైల్ రెడీ చేశాం. టెండర్లు పిలిచి అర్హత కలిగిన సంస్థకు ఈ బాధ్యతలను కట్టబెట్టడం జరుగుతుంది.
మూల్యాంకనం పూర్తయ్యే వరకు, ఆ తర్వాత మూడేండ్ల వరకు విద్యార్థులకు సంబంధించిన జవాబు పత్రాలు అత్యంత భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ యూనివర్సిటిదే. పరీక్షల గది నుంచి నేరుగా పరీక్షల విభాగానికి తెప్పించి భద్రపరిచిన తర్వాత అక్కడే మూల్యాంకనాన్ని చేయించాలి. ఆ జవాబు పత్రాలను స్టోర్లో పెట్టి రక్షించాలి. కానిక్కడ అందుకు విరుద్ధంగా వ్యవహారం నడుస్తుందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ప్రైవేటు వాహనాల్లో, ఎలాంటి భద్రత లేకుండా జవాబు పత్రాలను హైదరాబాద్కు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. మార్గమధ్యంలో జవాబుపత్రాలకు రక్షణ కరువవ్వగా ఏమైనా జరిగితే బాధ్యత వహించేదెవ్వరు? అన్నది దేవుడికే వదిలేశారు. ఈ లోపాలను దృష్టిలో పెట్టుకొని గతేడాది ఏప్రిల్లో జరిగిన పాలకమండలి సైతం సీరియస్గా విచారణ జరిపి చర్యలకు నిర్ణయం తీసుకున్నది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా ఈ వ్యవహారంపై దర్యాప్తు చేశారు. వివాదాస్పద నిర్ణయాన్ని రద్దు చేసి విద్యార్థులకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకోవాలని సూచనలు చేసింది. కానీ పాత వీసీ రవీందర్ గుప్తా హయాంలో దుమారం రేపిన ఆన్లైన్ సంస్థకే మూల్యాంకనాన్ని కొనసాగిస్తుండడం ముక్కున వేలేసుకునేలా చేస్తున్నది. పైగా జవాబు పత్రానికి రూపాయి చొప్పున తగ్గించి ఏడాది కాలానికి సేవలు పొడిగించడం విడ్డూరమని, దీని వెనుక దాగి ఉన్న రహస్యాలపై విచారణ చేసి బయట పెట్టాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
వీసీ రవీందర్ గుప్తా కొనుగోళ్లలో గోల్మాల్ చేశారు. నిధులు దుర్వినియోగం చేసి యూనివర్సిటీ పరువును బజారున పెట్టారు. రిజిస్ట్రార్లను ఇష్టారాజ్యంగా మార్చి తనకు నచ్చినట్లుగా వ్యవహరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతోపాటు పాలకమండలి దిశానిర్దేశనంలో రిజిస్ట్రార్ ద్వారా పరిపాలనను నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం సీనియర్ ఐఏఎస్ను ఇన్చార్జి వీసీగా నియమించారు. కానిప్పుడు పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లు అన్న చందంగా మారిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. నాటి వీసీ రవీందర్ గుప్తా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు చెల్లవని 2023, ఏప్రిల్లో జరిగిన పాలక మండలి సమావేశం స్పష్టంగా నిర్ణయం తీసుకున్నది. అప్పటికే కుదుర్చుకున్న నిర్ణయాలను రద్దుచేసి అవసరాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించింది. అయితే శాశ్వత వీసీ లేకపోవడంతోపాటు ఇన్చార్జి వీసీ మారడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. కొత్త ప్రభుత్వ కార్యకలాపాల్లో బుర్రా వెంకటేశం బిజీగా ఉండడంతో యూనివర్సిటీని రిజిస్ట్రార్కే అప్పగించారు. చుట్టపు చూపునకు మాత్రమే ఇటువైపు వచ్చినప్పటికీ లోతైన సమీక్ష చేయకపోవడంతో ఇన్చార్జి వీసీకి పూర్తిస్థాయిలో టీయూపై అవగాహన లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతం కీలక పదవుల్లో కొనసాగుతున్న వారికి ఇష్టారాజ్యంగా పనిచేసేందుకు రాచబాట ఏర్పడినట్లు అయ్యింది. విద్యార్థుల భవిష్యత్తు, యూనివర్సిటీ పేరును నిలపాల్సిన వ్యక్తులు స్వార్థాన్ని వదిలి పనిచేయాల్సి ఉండగా కొద్ది రోజులకే తీరు మార్చుకుని యథాలాపంగా వక్రమార్గాన్ని అవలంబించడం ద్వారా పరిస్థితిలో ఎంతకూ మార్పు రావడం లేదు.