ఇందూరు, ఆగస్టు 3 : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్, అల్ట్రాసోనిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు ఒకటి నుంచి నిజామాబాద్లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు బుధవారం ముగిసింది. అల్ట్రాసోనిక్స్ అండ్ మెటీరియల్ సైన్స్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ (ICUMSAT-2022) అనే అంశంపై కొనసాగిన సదస్సులో చివరిరోజు.. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నూతన ఆవిష్కరణలు చేసిన శాస్త్రవేత్తల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. నానో పార్టికల్స్, మెటీరియల్స్ ప్రాధాన్యంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ద్వారా ప్రదర్శనలు ఇచ్చారు. టీయూ వీసీ, కాన్ఫరెన్స్ చీఫ్ ప్యాట్రన్ రవీందర్, కన్వీనర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వాసం చంద్రశేఖర్ వక్తలందరిని సన్మానించారు.
అమెరికా రోవన్ యూనివర్సిటీ కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ ప్రొఫెసర్ డాక్టర్ కందాళం రామానుజాచారి మాట్లాడుతూ.. కాటలికల్ మెటీరియల్స్ ద్వారా తక్కువ ధరతో ఎక్కువ కాలం మన్నికగా ఉండే ఉత్పత్తులు, క్యాటలైజ్ తయారీలో నానో పార్టికల్స్ వినియోగాన్ని వివరించారు. రోషన్ యూనివర్సిటీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ డాక్టర్ నీల్ మూచా మాట్లాడుతూ.. కొవిడ్పై చేస్తున్న యుద్ధంలో కెమిస్ట్రీ పాత్ర, నేటితరం విద్యార్థులకు బాధ్యతను గుర్తు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ ప్రొఫెసర్ శ్రీనాథ్ మాట్లాడుతూ.. కోబాల్డ్ అయస్కాంత మిశ్రమ పదార్థాల సమ్మేళనాలపై వివరించారు. వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కెమిస్ట్రీ విభాగాధిపతి విష్ణు శంకర్ మాట్లాడుతూ.. హైడ్రోజన్ గ్యాస్ క్యాటలైజ్ సామర్థ్యాన్ని పెంచే విధానాన్ని తెలిపారు. కాన్ఫరెన్స్ చివరగా ఉత్తమ పరిశోధనలను సమర్పించిన వక్తలకు సర్టిఫికెట్లు అందించారు. ఇందులో న్యూఢిల్లీకి చెందిన కిషన్కుమార్ మొదటిస్థానం దక్కించుకున్నారు. టీయూ బయోటెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ జువేరియా ఉజ్మా, పరిశోధక విద్యార్థి ప్రసన్న, విద్యార్థి కుమారి గ్లోరీ వారి వారి పత్ర సమర్పణలపై మౌఖిక ప్రదర్శనలు ఇచ్చారు. ఇదే విభాగానికి చెందిన కుమారి, మౌనిక, శ్రీకర్, రాజ్యలక్ష్మి, గ్లోరీ ఔషధ గుణాలు కలిగిన మొక్కలను ఉపయోగించి సిల్వర్ నానో పార్టికల్స్ను తయారుచేసే విధానాన్ని ప్రదర్శనల ద్వారా వివరించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ జి.సునీత, నర్సయ్య, చిత్ర ప్రయోగ ప్రదర్శనలు చేశారు.
ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం అభినందనీయం : రాష్ట్ర ఎలక్షన్ చీఫ్ కమిషనర్
సైన్స్ కాన్ఫరెన్స్ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పార్థసారథి హాజరై మాట్లాడారు. గ్రామీణ నేపథ్యం ఉన్న నిజామాబాద్లో అన్ని రంగాల్లో ప్రాధాన్యం గల నానోటెక్నాలజీ మీద తెలంగాణ విశ్వవిద్యాలయం ఇంత పెద్ద కాన్ఫరెన్స్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. దేశ విదేశాల నుంచి శాస్త్ర విజ్ఞాన రంగాలకు చెందిన ప్రతినిధులు హాజరై విజ్ఞానరంగంలో జరుగుతున్న పరిశోధనలను వివరించడం ద్వారా విద్యార్థులు, స్కాలర్స్కు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. కాన్ఫరెన్స్లో దాదాపు 200 మంది ఓరల్ అండ్ పోస్టల్ ప్రదర్శనలు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్, టీయూ రిజిస్ట్రార్ శివశంకర్, ప్రిన్సిపాల్ ఆరతి, అల్ట్రాసోనిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా కార్యదర్శి డాక్టర్ యుధిష్టర్ కుమార్ యాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు.