గాలివాన అన్నదాతలను ఆగం చేస్తున్నది. వారం రోజులుగా కురుస్తున్న వర్షం రైతాంగానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. పొలాల్లోనే రాలిపోతున్న వడ్లు.. ధాన్యం రాశుల నుంచి వస్తున్న మొలకలు.. సరిగ్గా పంటల కోతల సమయంలోనే చెడగొట్టు వానలు దాపురించడంతో రైతులు తల్లడిల్లి పోతున్నారు. కండ్ల ముందే పంట నష్టపోతుండడంతో కన్నీరు పెడుతున్నారు. పంటను రక్షించుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించడంతో అన్నదాతలు మరింద ఆందోళనకు గురవుతున్నారు.
-నమస్తే తెలంగాణ యంత్రాంగం
ఆశలతో సాగు చేసిన పంట చేతికందకుండా పోయింది. యాసంగి వరి కోతలు పూర్తయి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరుతున్న తరుణంలో వర్షాలు కురువడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునే క్రమంలో రైతన్నను వరుణుడు వెంటాడుతున్నాడు. వరుసగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. కోతకు వచ్చిన వరిపైరు నేలవాలగా, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వర్షపు నీటిలో తడిసిముద్దవుతున్నది. పలుచోట్ల తడిసిన ధాన్యం కాస్తా మొలకలు వచ్చాయి. వర్షాలతో దెబ్బతిన్న పంటలను అధికారులు, ప్రజాప్రతినిధులు సోమవారం పరిశీలించారు. నష్టం నివేదికను ప్రభుత్వానికి పంపుతామని, సర్కారు సాయం చేస్తుందని అన్నదాతకు భరోసానిస్తున్నారు.
కూలిన ఇండ్లు..
లింగంపేట, మే 1: మండలంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి 26 నివాస గృహాలు పాక్షికంగా కూలినట్లు తహసీల్దార్ చంద్ర రాజేశ్ తెలిపారు. గంటకుపైగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసిందన్నారు. కూలిన ఇండ్లను పరిశీలించామని, నివేదికను కలెక్టర్కు సమర్పిస్తామని చెప్పారు.
పంటలను పరిశీలించిన కలెక్టర్
భిక్కనూరు, మే 1: మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఈదురుగాలులు, వర్షాలకు దెబ్బతిన్న వరి పంటలను కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సోమవారం పరిశీలించారు. రైతులు ఆందోళన చెందవద్దని, పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించనున్నట్లు ప్రకటించిందని తెలిపారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హన్మంత్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ రాజాగౌడ్, ఎంపీటీసీ సాయాగౌడ్, నాయకులు రాజలింగం, తహసీల్దార్ ప్రేమ్కుమార్ తదితరులు ఉన్నారు.
నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం
జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే
పిట్లం/ బిచ్కుంద, మే 1: అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. పిట్లం, బిచ్కుంద మండలాల్లో సోమవారం ఆయన పర్యటించి వర్షాల ధాటికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులెవరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పిచారు. పంట నష్టం వివరాలను సేకరించాలని రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. పిట్లం మండలంలోని అన్నారం, నాగన్పల్లి, కారేగాం, గోద్మేగాం, కంభాపూర్లో పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. బిచ్కుంద మండలం వాజిద్నగర్, పుల్కల్ గ్రామాల్లో పంట పొలాలతోపాటు ధాన్యం కుప్పలను పరిశీలించారు. ధాన్యం రాశుల్లో వర్షపు నీరు చేరి వడ్లు మొలకెత్తడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట పిట్లం జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు దేవేందర్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ సాయి రెడ్డి, తహసీల్దార్ రామ్మోహన్రావు, ఏవో కిషన్, బిచ్కుందలో ఎంపీపీ అశోక్పటేల్, పుల్కల్ సొసైటీ చైర్మన్ రాంరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రావు, సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు.