నిజామాబాద్, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం సంక్షిప్తంగా టీఎన్జీవో. తెలంగాణలో పరిచయం అక్కర్లేని ఉద్యోగ సంఘం ఇది. స్వరాష్ట్ర సాధనలో టీఎన్జీవోలు పోషించిన పాత్ర అమోఘం. ఉద్యోగుల సమస్యలు, ఇక్కట్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు అధికారిక సంఘంగా టీఎన్జీవోకు స్థానం ఉన్నది. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఉద్యోగులకు మాత్రమే ఇందులో సభ్యత్వం ఉంటుంది. కేఆర్ ఆమోస్ సారథ్యంలో ఏర్పాటైన ఈ సంఘానికి చారిత్రక నేపథ్యంతోపాటు కఠినమైన నియమ, నిబంధనలను పాతతరం ఉద్యోగ సంఘం నాయకులు తీర్చిదిద్దారు. నిబంధనల ప్రకారమే విధి విధానాలు, కార్యకలాపాలు జరగాలని మార్గనిర్దేశనం చేశారు. కానీ ప్రస్తుతం టీఎన్జీవోలో రాజకీయ నేతలను తలదన్నే రీతిలో ఉద్యోగ సంఘం లీడర్లు మారిపోయారు. ఒకానొక దశలో పొలిటికల్ లీడర్ల కన్నా మిన్న అన్నట్లుగా చెలరేగిపోతూ ఉద్యోగుల సంక్షేమాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఇలా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ టీఎన్జీవోకే మాయని మచ్చగా మారిన నేతలపై టీఎన్జీవోలో ఆగ్రహావేశాలు పెరుగుతున్నాయి. నియంతృత్వ ధోరణిని కొనసాగిస్తూ… ఏకపక్ష ఎన్నికలతో పదవులను జల్సా చేస్తున్న వారిపై సభ్యులంతా మండిపడుతున్నారు. ప్రభుత్వాలను తప్పుదారి పట్టిస్తూ సొంత ప్రయోజనాల కోసం పాకులాడుతూ ఉద్యోగుల సంక్షేమాన్ని పక్కదారి పట్టిస్తుండడంపై చర్చ జరుగుతున్నది.
నిజామాబాద్ టీఎన్జీవోలో బై లాను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి టీఎన్జీవో సంఘం పేరులోనే నాన్ గెజిటెడ్ అనే పదం ఉన్నప్పటికీ గెజిటెడ్ అధికారులే రాజ్యమేలుతున్నారు. పచ్చ ఇంకు పెన్ను పట్టుకునే వారెవ్వరికీ ఈ సంఘంలో చోటు లేదు. ప్రమోషన్ల పేరిట ఉన్నత ఉద్యోగాలకు వెళ్లిన వారు ఆటోమెటిక్గా టీఎన్జీవోలో చోటును కోల్పోతారు. కానీ అలాంటిదేమీ లేకుండానే ప్రస్తుతం కొంతమంది కీలకమైన పదవుల్లోనే కొనసాగుతూ కింది స్థాయిలోని లీడర్లను ఎదగనివ్వకుండా అడ్డు తగులుతున్నారు. గెజిటెడ్ హోదాలో అధికార దర్పాన్ని, టీఎన్జీవో సంఘంలో పదవులను అనుభవిస్తూ ద్వంద్వ నీతిని పాటిస్తుండడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఇదేంటని అడిగితే రాజకీయ నేతల పేరు చెప్పి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. నోరెత్తిన వారిపై సదరు శాఖ ఉన్నతాధికారులతో మెమోలు ఇప్పించడం, శాఖాపరమైన ఇక్కట్లను సృష్టిస్తున్న ఘటనలు సైతం ఉన్నాయి. ఉన్నతాధికారులకు లేనిపోనివి నూరి పోసి చివాట్లు పడేలా చేయడం వంటివి ఇక్కడ జరుగుతున్నట్లుగా తెలుస్తున్నది. బడా రాజకీయ నేతలతో కలిసి మెలిసి తిరుగుతూ ఉద్యోగుల ప్రయోజనాలను పక్కదారి పట్టిస్తున్న వారి నుంచి టీఎన్జీవోను రక్షించాలనే దృఢ సంకల్పంతో ఇప్పుడు చాలా మంది కదం తొక్కుతున్నారు. ప్రస్తుతం కీలకమైన పదవుల్లో ఉన్న వారికి టీఎన్జీవోను నడిపే అధికారమే లేదని బాహటంగానే చెప్పుకొస్తున్నారు. కేంద్ర నాయకత్వానికి సైతం ఇదేం పద్ధతంటూ ఫిర్యాదులు చేస్తున్నారు.
నిజామాబాద్కు చెందిన కొంతమంది సీనియర్ సిటిజన్లు సాధారణ పరిపాలన శాఖకు ఈ వ్యవహారాలపై ఫిర్యాదు చేశారు. టీఎన్జీవో బైలాను ఉల్లంఘించిన వారిపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. అయితే ప్రభుత్వం మారిందో లేదో టీఎన్జీవోలో అర్హత లేకున్నప్పటికీ పదవులు అనుభవిస్తున్న వ్యక్తులు ఇప్పటికే పైరవీలు మొదలు పెట్టారు. తమ సీటుకు ఎసరు రాకుండా చూసుకునేందుకు ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పెద్ద లీడర్లను కలుస్తున్నారు. వారిని ప్రసన్నం చేసుకుంటూ టీఎన్జీవో కేంద్ర నాయకత్వంపై ఒత్తిడి తెచ్చి జిల్లా స్థాయిలో తమ పదవులకు ఢోకా రాకుండా చూసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ మధ్యనే ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన షబ్బీర్ అలీని, ఎమ్మెల్సీగా ఎన్నికైన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ను బుట్టలో వేసుకునే పనిలో పడ్డారు. అకస్మాత్తుగా ఉద్యోగ సంఘం నేతల హడావుడిని చూసిన వారంతా వీళ్లు మామూలోళ్లు కాదంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. టీఎన్జీవోలో సంఘం సభ్యుల నుంచి వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు వారందరినీ ప్రసన్నం చేసుకునే పనిలో పడడంపై అందరూ మండిపడుతున్నారు. యూనిఫార్మ్ సర్వీసులకు టీఎన్జీవోలో చోటు లేదు. బై లా ఇదే చెబుతున్నప్పటికీ నిజామాబాద్లో ఏకంగా జిల్లా స్థాయి పోస్టును ఎక్సైజ్ శాఖకు చెందిన వారికి అప్పగించారు. డివిజన్ స్థాయిలోనూ గెజిటెడ్ హోదా ఉన్న వారికి టీఎన్జీవోలో పదవులివ్వడం కొసమెరుపు.
టీఎన్జీవో సంఘానికి గెజిటెడ్ ఉద్యోగులు బాధ్యత వహించడంపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్ను “నమస్తే తెలంగాణ” వివరణ కోరింది. ఈ అంశం తమ పరిశీలనలో ఉన్నదని, ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక సమర్పించినట్లుగా చెప్పారు. ప్రభుత్వం నుంచి వచ్చే స్పందన ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.