బాన్సువాడ టౌన్, జనవరి 5: తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాతి అని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఆయన బాన్సువాడ మండలం తాడ్కోల్, కొత్తాబాది గ్రామాల్లో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రెండు గ్రామాల్లో డబుల్బెడ్ రూం ఇండ్లను ప్రారంభించడంతోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏండ్లు గడుస్తున్నా రైతు కన్నీరు తుడిచే సంక్షేమ పథకాలను ఏ ఒక్క ప్రభుత్వం అమలుచేయలేదన్నారు. రైతు పక్షపాతిగా నిలబడిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ సర్కార్ అని పేర్కొన్నారు. అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తూ రైతన్నకు అండగా నిలిచిన ఏకైక సీఎం కేసీఆర్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్నారు.
ఒకప్పుడు రైతు పంటను వేయడానికి పెట్టుబడి కోసం అప్పు తెచ్చేవాడని, పంట వచ్చాక డబ్బులన్నీ వడ్డీలకు కూడా సరిపోయేవి కావన్నారు. వ్యవసాయం చేయడం మానేసి పని కోసం పట్టణాలకు తరలివెళ్లే పరిస్థితులు ఏర్పడ్డాయని గుర్తుచేశారు. కానీ తెలంగాణ సిద్ధించాక రైతు పక్షపాతి అయిన సీఎం కేసీఆర్ రైతుల మేలుకోరి ప్రత్యేకంగా రైతుబంధు తీసుకొచ్చారన్నారు. దీంతో పంట పెట్టుబడికి, ఎరువులు తీసుకురావడానికి ఇబ్బం ది లేకుండా ఉందని అన్నారు. వ్యవసాయం చేయడానికి రైతులు గర్వంగా ముందుకు వస్తున్నారని తెలిపారు.
సంపూర్ణ ఆరోగ్యం కోసమే న్యూట్రిషన్ కిట్
ఏ వ్యక్తి అయినా సరైన ఆరోగ్యం లేనప్పుడు లక్షల రూపాయలు సంపాదించినా వ్యర్థమన్నారు. అందుకే తల్లి గర్భంలోనే బిడ్డల ఆరోగ్యానికి తొలిమెట్టు వేయాలన్న సంకల్పంతో కేసీఆర్ గర్భిణుల కోసం న్యూట్రిషిన్ కిట్లను అందుబాటులోకి తెచ్చారని వివరించారు. బాన్సువాడ నియోజకవర్గంలో తన గెలుపుపై, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ విజయంపై ఎలాంటి అనుమానం లేదని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మిషన్ భగీరథ నీటిని మాత్రమే ప్రజలు తాగాలని సూచించారు.
విద్యార్థుల కోసం వెంటనే ప్రత్యేక బస్సులు నడపాలి
ఆర్టీసీ డిపో మేనేజర్కు సభాపతి ఆదేశం
కొయ్యగుట్ట సమీపంలో అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సును సభాపతి పోచారం ఆపి తనిఖీ చేశారు. బస్సులో కిక్కిరిసి ఉన్న విద్యార్థులను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకోకుండా పట్టు తప్పితే ప్రమాదాన్ని ఊ హించలేమని అసహనం వ్యక్తంచేశారు. వెంటనే బాన్సువాడ డిపో మేనేజర్తో ఫోన్లో మాట్లాడారు. ఇక మీదట పాఠశాల సమయానుకూలంగా విద్యార్థులకు సౌకర్యంగా ఉండేలా ప్రత్యేక బస్సులను నడుపాలను ఆదేశించారు. ఈ సందర్భంగా సభాపతికి విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.