నిజామాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ సిగలో మరో కలికితురాయి చేరింది. చారిత్రక వైభవం, తెలంగాణ ప్రగతి చిహ్నంగా నూతన సచివాలయం మారనున్నది. రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం అధునాతన భవనం సిద్ధమైంది. శ్వేతసౌధాన్ని తలపించేలా ధగధగలాడుతున్న ఆత్మగౌరవ సౌధం.. చరిత్రలో అద్భుత కట్టడంగా నిలిచిపోనున్నది. సచివాలయంపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గోపురాలను ఇందూరు నీల కంఠేశ్వరాలయం నమూనా నుంచి తీసుకోవడం విశేషం. రాష్ట్ర వైభవానికి ప్రతీకగా నిలువనున్న ఈ భవనం.. సకల ఏర్పాట్లతో సమున్నత పాలన అందించేందుకు ఆధునిక హంగులతో సిద్ధమైంది. సచివాలయ భవన నిర్మాణంలో జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కీలకమైన బాధ్యతలు నిర్వర్తించడం గమనార్హం. ఓవైపు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, ఆ పక్కనే ఆయన పేరిట అత్యద్భుతమైన సచివాలయ సౌధం.. సీఎం కేసీఆర్ పరిపాలనా దక్షతకు దర్పణంగా మారాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుతో తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని నేడు ప్రారంభోత్సవం చేసుకుంటున్న వేళ.. ఉమ్మడి జిల్లా ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం అత్యాధునిక హంగులతో నిర్మించిన అధునాతన భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర వైభవానికి ప్రతీకగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నిలువబోతున్నది. ఓ వైపు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, ఆ పక్కనే ఆయన పేరిట అత్యద్భుతమైన సచివాలయ సౌధం ఆకర్షణీయంగా మారాయి. సమైక్య పాలనకు చిహ్నాలుగా నిలిచిన పాత భవనాల స్థానంలో పూర్తిగా తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టేలా రాష్ట్ర సచివాలయాన్ని అత్యాధునిక హంగులతో నిర్మించి, సీఎం కేసీఆర్ మరోమారు తనదైన రీతిలో సత్తా చాటారు. అచ్చంగా అమెరికా వైట్ హౌస్ను తలపించేలా పరిపాలనా సౌధం మెరుస్తున్నది. సీఎం కేసీఆర్ పరిపాలనా దక్షతకు దర్పణంగా సచివాలయం నూతన భవంతి నిలుస్తోంది. రాష్ట్ర పరిపాలనా కేంద్రంగా నిలిచే సచివాలయ ప్రారంభోత్సవం వేళ.. ప్రజల్లో ఆసక్తి పెరిగింది. దీంతోపాటు భారత రాజ్యాంగ నిర్మాత పేరుతో సచివాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకుంటున్న తరుణంలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. హుస్సేన్సాగర్ తీరంలో ఠీవీగా దర్శనమిస్తున్న బీఆర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవన నిర్మాణంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన మంత్రి వేముల కీలకమైన బాధ్యతలు నిర్వర్తించడం విశేషం.
సగర్వంగా గెలిచి నిలిచి..
తెలంగాణ ఆత్మగౌరవానికి స్థానం లేని ఉమ్మడి రాష్ట్ర సచివాలయం స్థానంలో తెలంగాణ అస్తిత్వానికి నిదర్శనంగా నూతన సచివాలయం పురుడు పోసుకున్నది. దశాబ్దాల క్రితం కొన్ని దోపిడీ వర్గాల కుట్రతో అధికారం, అస్తిత్వం కోల్పోయిన తెలంగాణ.. నేడు నూతన సచివాలయ భవనం ద్వారా సగర్వంగా నిలిచింది. ఒకప్పుడు సచివాలయం దోపిడీ వర్గాల చీకటి అడ్డా. తెలంగాణ ప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధులకు కూడా అంతుచిక్కని వ్యవహారాలకు మూల కేంద్రం. నేడు ఆ చీకటి చరిత్రను దూరం చేసే వెలుగులను విరజిమ్మే విధంగా మన సచివాలయం సాక్షాత్కరిస్తోంది. ఒక్క సచివాలయమే కాదు, రాష్ట్ర రాజధాని నుంచి మొదలుకొని జిల్లాల వరకు అనేక పరిపాలనా సౌధాలు కేసీఆర్ పాలనకు అద్దం పడుతున్నాయి. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లాల పునర్విభజన అనంతరం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లు వెలిశాయి. రాజసం ఉట్టిపడేలా కనిపించే ఈ పరిపాలనా భవంతులు జిల్లా సచివాలయాలుగా ప్రజలకు అత్యుత్తమ సేవలందిస్తున్నాయి. కామారెడ్డి పోలీస్ కార్యాలయమైతే మరింత వైభవంతో కనిపిస్తున్నది. హైదరాబాద్కే పరిమితమైన ఐటీ పరిశ్రమను ద్వితీయ శ్రేణి నగరాలకు తరలించే క్రమంలో ఇందూరులో నిర్మించిన ఐటీ హబ్ కలికితురాయిగా మారింది.
కేసీఆర్ ముందు చూపు
కొత్త సచివాలయ నిర్మాణానికి ముందు కేసీఆర్ చాలా కసరత్తు చేశారు. మన చరిత్రను గుర్తుకు తెచ్చేలా డెక్కన్, కాకతీయ నిర్మాణ శైలిలో సచివాలయం ఉండాలనుకున్నారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా వసతులు నెలకొల్పారు. మత సామరస్యానికి ప్రతీకగా సచివాలయ ప్రాంగణంలో దేవాలయాలు, మసీదు, చర్చి నిర్మించారు. ఇందూరులోని నీలకంఠుడు రాష్ట్ర నూతన సచివాలయానికి కంఠాభరణంగా మారాడు. సచివాలయంపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గోపురాలను నీల కంఠేశ్వరాలయం నమూనా నుంచి తీసుకున్నారు. నిర్మాణానికి సంబంధించి ప్రతి అంశంపై కేసీఆర్ చాలా శ్రద్ధ చూపించారు. మంత్రులు కేటీఆర్, వేముల స్వయంగా సచివాలయ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించి, నిర్మాణం పూర్తి చేయించారు.
నిర్మాణంలో మంత్రి వేముల పాత్ర కీలకం
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కొలువుదీరిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ పేదోడి కడుపు నింపుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక సదుపాయాలు కల్పించి దేశంలోనే నంబర్ వన్గా తెలంగాణను నిలిపింది. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు కళికితురాయిగా మిగిలిపోతున్నాయి. 2014, 2018లో కొలువుదీరిన కేసీఆర్ ప్రభుత్వంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాత్ర విడదీయరానిది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తొలి నాళ్లలో ఎమ్మెల్యేగా ఉంటూనే కేసీఆర్ ఆదేశాలతో ప్రతిష్టాత్మకమైన మిషన్ భగీరథ పథకానికి వైస్ చైర్మన్గా వ్యవహరించారు. ఇంటింటికీ నల్లాలు కల్పించే బాధ్యతల్లో మునిగి తేలి కేసీఆర్ ఆశయాన్ని నెరవేర్చారు. తదనంతరం రెండోసారి ఏర్పాటైన కేసీఆర్ ప్రభుత్వంలో ఏకంగా మంత్రి పదవిని దక్కించుకున్న వేములకు కీలకమైన రోడ్లు-భవనాల శాఖను ముఖ్యమంత్రి కేటాయించారు. ఈ శాఖ ద్వారా కేసీఆర్ ప్రాధాన్య అంశాలైన కీలకమైన కట్టడాల్లో వేముల పాత్రధారులై వాటిని విజయవంతంగా పూర్తి చేశారు. స్వయాన ఇంజినీరైన వేముల ప్రశాంత్ రెడ్డి అనుభవం, నిర్మాణ రంగంలోని పరిజ్ఞానమంతా ప్రభుత్వంలోని ఆర్ అండ్ బీ శాఖ మంత్రిగా ఎంతో ఉపకరిస్తోంది.