బడుగు జీవితాలకు రాష్ట్రప్రభుత్వం భరోసానిస్తున్నది. సామాజిక పెన్షన్ల రూపంలో అభాగ్యులకు సర్కారు ‘ఆసరా’గా నిలుస్తున్నది. ప్రతినెలా ఠంచన్గా పింఛన్లు అందిస్తూ ఆత్మగౌరవంతో బతికేలా చేయూతనిస్తున్నది. పండుటాకులకు పెద్దకొడుకుగా మారిన సీఎం కేసీఆర్.. మలిసంధ్యలో హాయిగా జీవించేలా వృద్ధాప్య పెన్షన్లు అందిస్తున్నారు. జీవిత చరమాంకంలోనూ ఎవరి వద్ద చేయి చాచొద్దన్న భావనతో సీనియర్ సిటిజన్లకు పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. మానవతా దృక్పథంతో వృద్ధుల విషయంలో సామాజిక బాధ్యతగా సర్కారు వ్యవహరిస్తున్నది. ఇక ఏ పని చేసుకోలేని దివ్యాంగులకు సైతం చేదోడువాదోడుగా నిలుస్తున్నది. ప్రతినెలా దివ్యాంగులకు రూ.4016 చొప్పున , మిగతా వారికి రూ.2016 చొప్పున అందిస్తూ గౌరవంగా బతికేలా పింఛన్లు అందిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో అన్ని పెన్షన్లు కలిపి 4,05,789 మందికి నెలనెలా రూ.85.54 కోట్లు పంపిణీ చేస్తున్నది.
– ధర్పల్లి, అక్టోబర్ 14
ధర్పల్లి, అక్టోబర్ 14: ఏ పూటకు ఆ పూట కాయ కష్టం చేసుకుంటూ రెక్కాడితే గానీ డొక్కాడని జీవితాలు కొందరివైతే, కన్నవారు లేక, మలిసంధ్యలో ఆసరాగా నిలిచేవారు లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు మరికొందరివి. అన్నీ ఉన్నా ఆదరణ లేక దీనావస్థలో కాలం గడుపుతున్న పరిస్థితి మరికొందరిది. ఇలాంటి వారందరికీ నేనున్నానంటూ ఆసరా పింఛన్లతో ఆపన్నహస్తం అందిస్తూ ప్రతి ఇంటి పెద్దకొడుకులా అండగా నిలుస్తున్నాడు సీఎం కేసీఆర్.
సామాజిక బాధ్యతగా..
బడుగు జీవులను, బాధితులను ప్రభుత్వం సామాజిక బాధ్యతగా ఆదుకుంటున్నది. వృద్ధులు, వితంతులు, దివ్యాంగులతో పాటు బీడీ, గీత, చేనేత కార్మికులకు పింఛన్లు అందిస్తున్నది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మొదట్లో దివ్యాంగులకు రూ.1500 చొప్పు న, మిగతా వారికి వెయ్యిచొప్పున పింఛన్ను అందించింది. 2018లో ఆ పింఛన్ మొత్తాన్ని రెట్టింపు చేసింది. దివ్యాంగులకు రూ.3 వేలు, మిగతా వారికి రూ.2,016 చొప్పున పెంచింది. ఇక, దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్కు మరో వెయ్యి కలిపి నెలనెలా రూ.4,016 చొప్పున అందిస్తున్నది. ఇక, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ, గీత, చేనేత కార్మికులతో పాటు బోధకాలు, ఎయిడ్స్ బాధితులకు రూ.2,016 చొప్పున పింఛన్లు పంపిణీ చేస్తున్నది. గతంలో ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య పింఛన్ అర్హత వయస్సును కూడా కుదించింది. గతంలో 65ఏండ్లు ఉండగా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 57 ఏండ్లకు కుదించారు. తద్వారా అనేక మందికి సామాజిక పెన్షన్లు అందుతున్నాయి.
ప్రతి ఇంట్లో పింఛన్ లబ్ధిదారు..
సమైక్యాంధ్ర ప్రదేశ్లో వృద్ధాప్య పింఛన్లు దక్కాలంటే అదో ప్రహసనంగా ఉండేది. దరఖాస్తు చేసుకున్న లక్షలాది మందిలో కొద్దిమందికి మాత్రమే బొటాబొటిన ఇచ్చే రూ.200 పింఛన్ చేతికి చిక్కేది. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పింఛన్ల పంపిణీని మానవతా దృక్పథంతో చేపట్టారు. దళారులను నిలువరించడంతో పాటు పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపికను చేపట్టారు. ప్రతి నెలా వృద్ధులకు పింఛన్ పంపిణీతో పాటు భరోసా కోల్పోయిన ఆయా వర్గాలకు సైతం పెన్షన్ సౌకర్యం కల్పించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి కుటుంబంలోనూ ఏదో రకంగా పింఛన్ అందుతుండడం విశేషం. నిజామాబాద్ జిల్లాలో అన్ని రకాల పింఛన్లు కలిపి 2,51,910 మంది లబ్ధిదారులకు ప్రతి నెలా రూ.52.70 కోట్లు అందుతున్నాయి. ఇక, కామారెడ్డి జిల్లాలో మొత్తం 1,53,879 మంది లబ్ధిదారులు నెలనెలా రూ.32.84 కోట్లు అందుకుంటున్నారు.
పింఛన్.. మాకొక చిన్న జీతం లెక్క..
ముసలోళ్లకు పింఛన్ ఇంతగానం ఇయ్యంగ నేను ఎప్పుడూ చూడలేదు. గతంలో తీస్ రూపాయి(రూ.30), దోసవ్ రూపాయి (రూ.200)ఇచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు రూ.2,000లు ఇవ్వడంతో మాకు చాలా సంతోషంగా ఉంది. రూ.2వేలు మాకు ఒక చిన్నజీతం చేసినోళ్ల లెక్క నెలనెలా వస్తుండడంతో ఎలాంటి బాధ లేకుండా పోయింది. మా అవసరాల కోసం పిల్లల్ని డబ్బులు అడగాల్సిన బాధ లేకుండా సీఎం కేసీఆర్ సాబ్ ఆదుకుంటున్నడు. ఇస్ లియే హమ్లోగ్ సబ్జనో కేసీఆర్ సాబ్కో ఓట్ డాల్కే ఔర్ కే బార్ ఉన్కో సీఎం బనాతే. హమ్ లోగ్ కిత్నా సాల్ జీతేతో ఉత్నా సాల్ సీఎం కేసీఆర్ సార్కో ఓట్ డాలేతే.
– షేక్ జమాలుద్దీన్, వృద్ధుడు, ధర్పల్లి
పెద్దకొడుకులా ఆదుకుంటున్నాడు
సీఎం కేసీఆర్ ఒక పెద్దకొడుకులా ప్రతినెలా రూ.2016 అందిస్తూ మమ్ములను ఆదుకుంటున్నడు. ఈ పైసలు మాకు ఎంతగానో ఆసరాగా ఉంటున్నాయి. మా చిల్లర ఖర్చులకు ఇంట్లో కన్నబిడ్డలను పైసలు అడిగే బాధ తప్పింది. చాయినీళ్లకు, కల్లు ఖర్చులకు, ఏదైనా చిరుతిండి తినాలనిపించినా నోరు కట్టేసుకునేటోళ్లం. కానీ ఇప్పుడు ఆ బాధలేదు. ఆసరా పింఛన్ డబ్బులతో మా అవసరాలను తీర్చుకుంటున్నాం. ఇప్పుడు మాకు ఎలాంటి బాధలేకుండా పోయింది.
– గడ్డం చిన్నగంగారాం, మైలారం, ధర్పల్లి
మనుమళ్లకే రూపాయి ఇస్తున్నాం
ఇది వరకు మాకు రూపాయి అవసరమైతే పిల్లలను, మనుమల్ని అడిగేవాళ్లం. పాపం వాళ్ల దగ్గర ఉంటే రూపాయి ఇచ్చేవాళ్లు. పైసలులేని టైంల ఆ బాధలో కసురుకునే వాళ్లు. అలాంటి తొక్కులాటలో ఎంతో కాలం వెల్లదీశాం. కానీ దేవుడిలా సీఎం కేసీఆర్ సార్ వచ్చినంక ఆసరా పింఛన్ రూ.2016తో మా అవసరాలు తీర్చుకుంటున్నాం. మాకే రూపాయి మిగిలితే మనవళ్లు, మనుమరాళ్లకు ఖర్చుల కోసం ఇస్తున్నాం. దీంతో పిల్లలు ఖుషీగా మా దగ్గరికి వచ్చి రూపాయి అడుక్కొని పోతున్నారు. మేము పిల్లల్ని అడుక్కునే పరిస్థితి నుంచి రూపాయి వారికిచ్చేలా మా విలువను కాపాడిన సీఎం కేసీఆర్కు మా ముసులోళ్ల దీవెనలు
ఎప్పటికీ ఉంటాయి.
– అంకన్నగారి ఎర్రన్న, మైలారం, ధర్పల్లి
పింఛన్ పైసలతోనే కాలం వెల్లదీస్తున్నా
కేసీఆర్ ఇస్తున్న పింఛన్ పైసలు రూ.2016తో కాలం వెల్లదీస్తున్నా. ప్రతినెలా వచ్చే పింఛన్ డబ్బులతో ఎలాంటి బాధ లేకుండా పోయింది. నా కొడుకులలెక్క సీఎం కేసీఆర్. గతంలో రూ.200లే పింఛన్ అచ్చేది. అవి ఏమిటికీ సరిపోయేవి కావు. మూడొద్దులు కాంగానే మళ్ల ఇండ్ల కాడ, వాళ్లకాడ చేయి చాచాల్సి అచ్చేది. కానీ ఇప్పుడు ఈ పైసలే మస్తుగా సరిపోతున్నాయి. ఏదైనా జ్వరమచ్చినా, సూది ఇప్పించుకోవాలన్నా మాకు అచ్చిన ఆసరా పింఛన్ పైసలతోనే చూపెట్టుకుంటున్నాం. ఇప్పుడు మాకు ఏమైనా అయితదన్న భయం లేకుండా పోయింది. సీఎం కేసీఆర్ సార్ యాడున్నాడో గానీ సల్లంగా ఉండాలి.
– గజిగిరి రాజవ్వ, మైలారం, ధర్పల్లి
పెద్ద మనసుతో ఆదుకుంటున్నారు..
అరేక్ మైనే కేసీఆర్ సాబ్ దీయేసో పింఛన్ పైసేసే మై గుజర్ రహేహే. సీఎం సార్ మాయసొంటి గరీబోల్లను సల్లంగా చూడపట్టే మేము ఇంకా బతికి ఉన్నాం. మా పరిస్థితి అయితే గరీబు. గీసొంటి పరిస్థితుల్లో నాకు పొద్దు గడవడమే కష్టంగా ఉండే. కానీ సీఎం సార్ అందిస్తున్న పింఛన్ డబ్బులు ఎంతో ఆసరా అవుతున్నాయి. ఇంతమంచి కాలం నేను ఎన్నడూ జూడలే. గింతమంచిగా అందరినీ ఆదుకుంటున్న గవర్నమెంట్కు రుణపడి ఉంటాం.
– ఉమర్ఖాన్, వృద్ధ వికలాంగుడు, ధర్పల్లి