మెండోరా : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో కొనసాగుతుండటంతో దిగువ గోదావరిలోకి మిగులు జలాలను విడుదల చేస్తున్నామని ఈఈ చక్రపాణి తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 27,890 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో 6 వరద గేట్లు ఎత్తి దిగువకు మిగులు జలాలలను గోదావరిలోకి నీటి విడుదల కొనసాగు తుందన్నారు. అదేవిధంగా ఎస్కేప్ గేట్లనుంచి గోదావరిలోకి 5500 క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగుతుందన్నారు. కాకతీయ కాలువకు 2 వేలు, సరస్వతీ కాలువకు 800 , లక్ష్మి కాలువకు 80 క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగు తుందని వెల్లడించారు.
ప్రస్తుత సంవత్సరం ఎగువ నుంచి ఎస్సారెస్పీలోకి 298.405 టీఎంసీల వరద నీరు వచ్చిం దన్నారు. అయితే కాలువలకు , గోదావరిలోకి ఈ సీజనులో మిగులు జలాలను 227.079 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశామన్నారు. పూర్తిస్థాయి ప్రాజెక్ట్ నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా బుధవారం సాయంత్రానికి ప్రాజెక్ట్ నీటిమట్టం 1090.90 అడుగులు( 89.763 టీఎంసీల) నీటి నిల్వ ఉందని ఈఈ తెలిపారు.