ఇందూరు: జిల్లా కేంద్రంలోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో సెప్టెంబర్ 3, 4, 5 తేదీల్లో సాయి సంతోషి నాట్యమండలి (సురభి) ఆధ్వర్యంలో నాటకోత్సవాలు నిర్వహించనున్నట్లు సంస్థ అధ్యక్షుడు శ్రీపాద కుమారశర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రంగసాయి నాటక సంఘం, మంజీరా హెల్పింగ్ హార్ట్ నవయువత, శ్రీ శ్రీపాద నాటక కళా పరిషత్ సహకారంతో నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
సెప్టెంబర్ 3న శ్రీ సమ్మక్క, సారలమ్మ, 4న శ్రీకృష్ణ లీలలు, 5న మాయాబజార్ నాటకాలు ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. మూడు రోజుల పాటు సాయంత్రం ఆరు గంటల నుంచి వేడుకలు జరుగుతాయన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఎలాంటి ప్రవేశ రుసుము లేదని, ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్కు ధరించి హాజరు కావలని సూచించారు. సమావేశంలో సాయి సంతోషి నాట్యమండలి కార్యదర్శి సింధూరి సంతోష్, మంజీరా హెల్పింగ్ హార్ట్ ఫౌండేషన్ అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, నవయువత అధ్యక్షుడు చింతల గంగదాస్, శ్రీపాద నాటక కళా పరిషత్ కోశాధికారి ఫణి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.