ఖలీల్వాడి మార్చి 12: ఈ నెల 14 నుంచి పదో పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం కొన్ని నెలలుగా విద్యార్థులు కష్టపడుతున్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు రాత్రింబవళ్లు చదువుతున్నారు. పదో తరగతి పరీక్షలంటే తల్లిదండ్రుల్లోనే కాసింత ఆందోళన నెలకొన్నది. తమ పిల్లలు మంచి మార్కులు సాధించాలని తాపత్రయపడుతున్నారు. పదో తరగతి పరీక్షలు రాసేందుకు విద్యార్థులు సిద్ధమయ్యారు.
తల్లిదండ్రులు ర్యాంకులు, పర్సంటేజీల గురించి పదే పదే గుర్తు చేయవద్దు, ధైర్యంగా ప్రోత్సహించాలి కానీ పరుగులు పెట్టించవద్దు. చదువు అనేది శిక్షలా భావించకుండా కేరీర్కు తొలిమెట్టుగా పిల్లలు గ్రహించేలా ప్రవర్తించాలి. పిల్లలను గదిలోనికి నెట్టివేసి, డోర్లు మూసి బయటికి రాకుండా చదువుకోవాలని కట్టడి చేయవద్దు. మధ్య మధ్యలో తగిన విశ్రాంతిని కల్పింంచాలి. అంతేగాక సరదగా గడపడం ద్వారా చదువు పై ఆసక్తి పొందే అవకాశాలు ఎక్కువ. అనవసరంగా ఇతరులతో పోల్చి ఇబ్బంది పెట్టరాదు. హాయిగా నిద్ర పోనివ్వాలి. నిద్రలేమి రాత్రులు గడుపకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. వారి ప్రవర్తన వారికి వరంగా ఉండాలని కానీ శాపంగా ఉండకూడదు. ఆహార విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త కొత్త వంటకాల అలవాట్ల జోలికి వెళ్లకూడదు. పరీక్షల ఫలితాలు, పరీక్షల పేపర్లపై చర్చించవద్దు. తల్లిదండ్రులు తమ ఆశయాలను పదే పదే గుర్తు చేస్తూ వాళ్ల లేత మనస్సును గాయపరచవద్దు. విందులు, వినోదాలు లాంటి వాతావరణాన్ని అనవసరంగా కల్పించవద్దు.
మీ తల్లిదండ్రులు పడుతున్న తాపత్రయాన్ని టెన్షన్, మీరు ఒత్తిడిగా భావించకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఉత్సహంతో చదివాలే కానీ భయపడి వెనుదిరగవద్దు. ప్రశాంతతను మనసులోకి ఆహ్వానించాలి. మళ్లీ దాన్ని బయటికి నెట్టి వేయకండి. పరీక్షలు విద్యార్థి దశలో భాగమే కానీ దండనగా భావించి ఆందోళనకు గురై బాధపడొద్దు. పరీక్షలను సవాలుగా స్వీకరించి విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్లాలి.
విద్యార్థులు చదువుకునేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్ర శాంత వాతావరణాన్ని కల్పించాలి. విద్యార్థులకు అర్థంకాని సబ్జెక్టులను సంబంధిత ఉపాధ్యాయులతో నివృత్తి కోసం సహకరించాలి. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా తరగతులు నిర్వహించాలి. ఉన్న సమయంలో అన్ని సబ్జెక్టులు ఎలా చదవాలో ప్రణాళిక రూపొందించుకునేలా సరైన ప్రణాళికతో చదివేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి.
-అశోక్, జిల్లా విద్యాశాఖాధికారి, నిజామాబాద్
పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావద్దు. ర్యాంకులు, జీపీఏ అంటూ వి ద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తే ఆందోళనకు గురై చదివిన పాఠాలను మరిచిపోయే ఆస్కా రం ఉన్నది. వారిపై ఒత్తిడి పెంచకుండా, పట్టు సాధించని సబ్జెక్టులపై నిపుణులైన ఉపాధ్యాయులతో తరగతులు లేదా సందేహాల నివృత్తి చేయించాలి. భయం వీడి పరీక్షలు రాస్తే తప్పక విజయం సాధిస్తారు.
-డాక్టర్ ఆకుల విశాల్, ప్రముఖ మానసిక వైద్యనిపుణుడు