వినాయక నగర్, జనవరి 30: నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి పాస్పోర్టులు ఇప్పించిన కేసులో సీఐడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కుంభకోణంలో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన దర్యాప్తు సంస్థ.. ఇందులో స్పెషల్బ్రాంచ్ (ఎస్బీ) విభాగం పాత్ర కూడా ఉన్నదని తేల్చింది. ఈ క్రమంలోనే నిజామాబాద్ ఎస్బీ ఏఎస్సై లక్ష్మణ్ను తాజాగా అదుపులోకి తీసుకున్నది. మంగళవారం తెల్లవారుజామున గంగాస్థాన్ ఫేజ్-2లోని నివాసంపై దాడి చేసి, ఆయనను నగరంలోని సీఐడీ కార్యాలయానికి తరలించారు. మధ్యాహ్నం అక్కడ విచారించిన అనంతరం హైదరాబాద్కు తీసుకెళ్లారు. తాజా ఘటనతో స్పెషల్బ్రాంచ్ విభాగం పనితీరు మరోమారు చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ అనేక ఉదంతాల్లో ఎస్బీ వ్యవహార శైలిపై లెక్కకు మించి ఆరోపణలు ఉన్నాయి. మూడేండ్ల క్రితం బోధన్లో వెలుగుచూసిన పాస్పోర్టు కేసుల ఉదంతంలోనూ స్పెషల్బ్రాంచ్పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ కేసులోనూ ఓ ఏఎస్సై పాత్ర ఉన్నట్లు తేలడంతో సస్పెండ్ చేయడం అప్పట్లో కలకలం రేపింది. తాజాగా మరో ఏఎస్సై కూడా ఉచ్చులో చిక్కుకోవడం చర్చనీయాంశమైంది.
ఏజెంట్ సుభాష్ ఇచ్చిన సమాచారంతో సీఐడీ ప్రత్యేక బృందం మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలోనే రంగంలోకి దిగింది. నగరంలోని గంగాస్థాన్ ఫేస్-2 లో నివాసముండే ఎస్బీ ఏఎస్సై లక్ష్మణ్ ఇంటి పై దాడి చేసింది. అంతకు ముందే ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు, ఎస్బీ ఇన్స్పెక్టర్కు సమాచారమిచ్చారు. లక్ష్మణ్ను నగరంలోని సీఐడీ కార్యాలయానికి తరలించి, మధ్యాహ్నం వరకు విచారించారు. ఆ తర్వాత హైదరాబాద్కు తీసుకెళ్లారు. గతంలో ధర్పల్లి, సిరికొండలో ఎస్బీ హెడ్కానిస్టేబుల్గా పనిచేసిన లక్ష్మణ్.. ప్రస్తుతం ఏఎస్సైగా మాక్లూర్, నవీపేట్ స్టేషన్ల పరిధిలో ఎస్బీ బాధ్యతలు చూస్తున్నాడు. అయితే, ఏజెంట్ సుభాష్తో లక్ష్మణ్కు ఎలా పరిచయం ఏర్పడింది. ఫేక్ సర్టిఫికెట్ల రూపకల్పనలో ఎవరు సహకరించారనే కోణంలో అధికారులు విచారిస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే దానిపైనా ఆరా తీస్తున్నట్లు సమాచారం.
పోలీసు శాఖలో స్పెషల్బ్రాంచ్ది అత్యంత ప్రాధాన్యత కలిగిన విభాగం. పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్న వారి గురించి ఆరా తీయడం, వారిపై ఏవైనా కేసులు ఉన్నాయా.. నేరపూరిత చరిత్ర ఉందా.. అప్లికేషన్తో పాటు సమర్పించిన డాక్యుమెంట్లు ఒరిజినల్స్ క్షుణ్ణంగా పరిశీలించడం ఎస్బీ బాధ్యత. స్పెషల్బ్రాంచ్ క్లియరెన్స్ ఇస్తేనే పాస్పోర్టు మంజూరవుతుంది. అంతటి కీలక బాధ్యతలో ఉన్న స్పెషల్బ్రాంచ్ సిబ్బంది కొందరు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. డాక్యుమెంట్లు పరిశీలించకుండా, ఎలాంటి విచారణ లేకుండానే దరఖాస్తుదారుల నుంచి డబ్బులు తీసుకుని క్లీయరెన్స్ ఇచ్చేస్తుండడం గమనార్హం. అందువల్లే బోధన్ వంటి ఉదంతాలు, తాజా ఫేక్ పాస్పోర్టు వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి పాస్పోర్టులు ఇప్పిస్తున్న విషయం బయటకు రావడంతో సీఐడీ సీరియస్గా రంగంలోకి దిగింది. నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో కొంత మంది ఏజెంట్లను అరెస్టు చేసి విచారణ చేపట్టింది. సీఐడీ ఏడీజీ శిఖాగోయెల్ పర్యవేక్షణలో అధికారులు పక్కాగా సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ ఫేక్ స్కాంలో ఎంత మంది ఉన్నారు.. వారికి ఎవరెవరు సహకరించారు.. ప్రభుత్వ విభాగాల నుంచి సహకరించింది ఎవరనే దానిపై కూపీ లాగుతున్నారు. ఈ నెల 19న భీమ్గల్లో అరెస్టు చేసిన ఏజెంట్ సుభాష్ను విచారించి కీలక సమాచారం సేకరించినట్లు తెలిసింది. దీనికితోడు వివిధ జిల్లాల్లో అరెస్టు చేసిన నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫేక్ స్కాంలో స్పెషల్బ్రాంచ్ సిబ్బందికి పాత్ర ఉన్నట్లు వెల్లడైంది.