బాన్సువాడ రూరల్, డిసెంబర్ 19: బాన్సువాడ మండలంలోని కొత్తాబాది ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విషాదం చోటు చేసుకున్నది. ఒకటో తరగతి చదువుతున్న ఎండీ.ఫర్హాన్(6) ప్రమాదవశాత్తు పాఠశాల వెనుక ఉన్న నిజాంసాగర్ ఉపకాలువలో పడి మృతి చెందాడు. కాలువలో పడిన కొద్దిసేపటికే తోటి విద్యార్థులు గమనించి ఉపాధ్యాయులకు సమాచారం అందించగా, అప్పటికే విద్యార్థి మృతి చెందాడు. ఆసిఫా, ఉస్మాన్ దంపతులకు ఒక్కగానొక్క సంతానం ఫర్హాన్. మధ్యాహ్నమే వచ్చి కొడుక్కి భోజనం తినిపించి వెళ్లానని, కొద్దిసేపటికే కాలువలో పడి మరణించాడని తల్లి రోదనలు మిన్నంటాయి.
విషయం తెలుసుకున్న గ్రామస్తులు, కుటుంబీకులు పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ ధర్నాకు దిగారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా దవాఖానకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా పాఠశాల హెచ్ఎం ఉదయం వచ్చి రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లిపోయినట్లు గ్రామస్తులు గుర్తించారు. ఈ విషయమై ఎంఈవో నాగేశ్వర్రావును వివరణ కోరగా ఎలాంటి సమాచారం లేకుండా హెచ్ఎం సంతకం పెట్టి వెళ్లాడని, అతనిపై శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలిపారు.