నిజాంసాగర్, అక్టోబర్ 13: అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం ఇతరత్ర తరలించే వారిపై నిఘా పెంచారు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల వద్ద కోడ్ ఉల్లంఘన జరగకుండా చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కోడ్ ఉల్లంఘిస్తున్న వారిపై ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం సీ-విజిల్ యాప్, 1950 టోల్ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతేకాకుండా జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మండల కేంద్రాలు, సరిహద్దులు, జాతీయ రహదారులపై విస్తృతంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో అక్రమంగా మద్యం, బెల్టుదుకాణాలు నిర్వహించకుండా ఆబ్కారీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల కోడ్ ఈ నెల 9వ తేదీ నుంచి అమల్లోకి రాగా రూ.50వేలకు మించి నగదు తరలిస్తే సరైన ఆధారాలు, ధ్రువీకరణ పత్రాలు చూపాలని ఈసీ పేర్కొన్నది.
సరిహద్దులో కట్టుదిట్టం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో భాగంగా అక్రమాల కట్టడికి సరిహద్దులో చెక్పోస్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. జుక్కల్ నియోజకవర్గంలోని సోపూర్-కర్ణాటక, సలాబత్పూర్-మహారాష్ట్ర వద్ద అంతర్రాష్ట్ర చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. జుక్కల్ పరిధిలో రెండు, బాన్సువాడ పరిధిలో ఒకటి మొత్తం మూడు అంతర్రాష్ట్ర చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. వీటితో పాటు అంతర్జిల్లా చెక్పోస్టులు ఎస్ఎస్నగర్-నిజామాబాద్, మాచారెడ్డి-రాజన్న సిరిసిల్ల, భిక్కనూర్-నాగిరేడ్డిపేట-మెదక్, నిజాంసాగర్-సంగారెడ్డి, నస్రుల్లాబాద్-నిజామాబాద్ వద్ద అంతర్జిల్లా చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఫ్లయింగ్ స్కాడ్లు, స్టాటిస్టికల్ సర్వేలైన్స్, వీడియో సర్వేలైన్స్, వీడియో ఫ్యూయింగ్, ఎంసీసీ, అకౌంటింగ్ బృందాలను సైతం ఏర్పాటు చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో మొత్తం 18 బృందాలు, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 16 బృందాలు, బాన్సువాడ నియోజకవర్గంలో 16 బృందాలు, జుక్కల్ నియోజకవర్గంలో 17 బృందాలను ఏర్పాటు చేశారు. చెక్పోస్టులతో పాటు ఏర్పాటైన సమీకృత తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలీసులతో పాటు రవాణా, ఆబ్కారీ, అటవీ, వాణిజ్య పన్నుల శాఖల ఉద్యోగులు ఇక్కడ ఉంటారు. ఉమ్మడిగా తనిఖీలు చేపడుతూ 24 గంటల పాటు మూడు షిప్టుల్లో విధులు నిర్వహిస్తారు. నవంబర్ 30న పోలింగ్ ముగిశాక వీటిని తొలగించనున్నారు. పోరుగు రాష్ర్టాలు, జిల్లాల అధికారులతో గతంలోనే సమావేశాలు ఏర్పాటు చేసుకొని సమన్వయంతో ముందుకెళ్లాలని ఎన్నికల సంఘం ఆయా రాష్ర్టాల అధికారులను సైతం ఆదేశించింది. రెండు రోజుల క్రితం మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ చెక్పోస్టు వద్ద రూ.2.40 లక్షలను పోలీసులు పట్టుకున్నారు.
ఎన్నికల నిబంధనలు పాటించాలి
మండలకేంద్రంలోని జాతీయ రహదారిపై శుక్రవారం ఎన్నికల ఫ్లయింగ్స్కాడ్ అధికారి బ్రహ్మం ఆధ్వర్యంలో శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఎన్నికల బృందానికి తనిఖీ సమయంలో సహకరించాలని సూచించారు. తనిఖీల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
పెద్దకొడప్గల్లో..
మండల కేంద్రంలోని జాతీయ రహదారి పై ఎస్సై కోనారెడ్డి ఆధ్వర్యంలో శుక్ర వారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ..ఎన్నికల కోడ్ దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నామని తెలిపారు. వాహనాల్లో అక్రమంగా మద్యం,నగదు,బంగారం తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్లరాదన్నారు.