వినాయక్నగర్, ఫిబ్రవరి 3 : నగరంలోని మాలపల్లికి చెందిన ఏడేండ్ల బాలుడు మహ్మద్ మిహాజ్ కిడ్నాప్ కేసు సుఖాంతమయ్యింది. జనవరి 30న బాలుడు కిడ్నాప్నకు గురికాగా.. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా.. స్థానికంగా ఉండే సోహైల్ అనే కారుడ్రైవర్ తన బైక్పై తీసుకెళ్లినట్లు గుర్తించారు. సోహైల్ను హైదరాబాద్లో అదుపులోకి తీసుకొని, విచారించగా.. నేరాన్ని అంగీకరించాడు. బాలుడిని పోలీసులు శనివారం తల్లిదండ్రులకు అప్పగించారు.
మాలపల్లికి చెందిన ఓ మహిళ బాలుడి కిడ్నాప్లో ప్రధాన పాత్ర పోషించింది. ఆమె గతంలోనూ ఓ బాలుడిని విక్రయించిన కేసులో నేరస్తురాలు. మళ్లీ అలాంటి చర్యలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. హైదరాబాద్కు చెందిన వారికి ఓ బాలుడి అవసరం ఉందనే విషయాన్ని తెలుసుకున్న ఆమె.. వారితో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. బాలుడిని కిడ్నాప్ చేసి తనకు ఇస్తే పెద్దమొత్తంలో డబ్బు ఇస్తానంటూ సోహైల్కు ఆశ చూపగా.. బాలుడిని కిడ్నాప్ చేసి, షేక్ ఆబేద్, షబానా బేగానికి అప్పగించాడు. వారు హైదరాబాద్లోని ముఠాకు రూ. 3 లక్షలకు విక్రయించినట్లు అదనపు డీసీపీ జయరాం వెల్లడించారు. కిడ్నాపర్ సోహైల్కు రూ.70 వేలు చెల్లించినట్లు తెలిపారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా.. మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిసింది.