నిజామాబాద్, ఫిబ్రవరి 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :చారిత్రక నిజాంసాగర్ ప్రాజెక్టు దిగువన రెండున్నర లక్షల ఆయకట్టు దశాబ్దాల క్రితం నుంచి స్థిరీకరించబడింది. కాలక్రమేణా ఇది కాస్త 1.80 లక్షల ఎకరాలకే పరిమితమైంది. మిగిలిన భూములకు వివిధ ఎత్తిపోతల పథకాలతో సాగు నీటి సౌకర్యం కల్పిస్తున్నారు. అయితే… నిజాంసాగర్ దిగువన ఉన్న బాన్సువాడ నియోజకవర్గంలో అనేక ప్రాంతాలు కాలువల కింద సాగుకు నోచుకుంటున్నాయి. కొద్ది భాగం సాగు నీటి సౌకర్యం లేక ఏటా బీడు భూములుగానే పడి ఉంటున్నాయి. నాన్ కమాండ్ ఏరియాగా మారిన ఈ భూములకు సాగు నీటి సౌకర్యం కల్పించాలనే యోచనతో శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. 2018లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక అడుగు ముందుకు వేయగా ప్రభుత్వం వివిధ సర్వేలు నిర్వహించింది. తాజాగా పరిపాలన అనుమతులతో పాటు రూ.119 కోట్లు విడుదల చేయడంతో నిజామాబాద్ జిల్లాలోని వర్ని మం డలం సిద్ధాపూర్ గ్రామం వద్ద ఓ రిజర్వాయర్ రూపుదిద్దుకోబోతున్నది. ఈ నెల 15న రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సిద్ధాపూర్ రిజర్వాయర్కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కింద 10 వేల ఎకరాల ఆయకట్టుకు ఊపిరి పోయనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం లో చిన్నపాటి కుంటల ద్వారా కేవలం 615 ఎకరాలకే సాగు నీరు అందుతున్నది.
నిజాంసాగర్ ప్రాజెక్టు దిగువన.. బాన్సువాడ నియోజకవర్గంలోని నాన్ కమాండింగ్ ఏరియా ప్రాంతాన్ని సైతం సస్యశ్యామలం చేసే దిశగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కృషిచేస్తున్నారు. వర్ని మండలం సిద్ధాపూర్ వద్ద నిర్మించనున్న రిజర్వాయర్ ద్వారా 10వేల ఎకరాల ఆయకట్టుకు ఊపిరి అందివ్వనున్నారు. 2018లో వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ రిజర్వాయర్ నిర్మాణానికి పోచారం కార్యాచరణ రూపొందించారు. తాజాగా పరిపాలన అనుమతులతోపాటు రూ.119కోట్ల నిధులు విడుదలయ్యాయి. వర్షాధారంగా వచ్చే నీటిని నిల్వ చేయడంతోపాటు వర్షాభావ పరిస్థితులు తలెత్తిన సమయంలో ప్యాకేజీ-22 ద్వారా సిద్ధాపూర్ రిజర్వాయర్ను లింకు చేయనున్నారు. బాన్సువాడ నియోజకవర్గం భౌగోళికంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉండగా.. సిద్ధాపూర్ రిజర్వాయర్తో ఉభయ జిల్లాల్లోని గిరిజన తండాలకు సాగునీరు సమకూరనున్నది.
బాన్సువాడ నియోజకవర్గం భౌగోళికంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉంది. సిద్ధాపూర్లో నిర్మించనున్న రిజర్వాయర్తో ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లోని రైతులకు ముఖ్యంగా గిరిజన తండాల్లోని సాగు భూములకు మేలు చేకూరనున్నది. అటవీ ప్రాంతంలో కేవలం 614 ఎకరాల ఆయకట్టు కలిగిన చద్మల్, పైడిమల్, నామ్కల్ చెరువులను ఒకే చోట కలిపి రిజర్వాయర్గా మార్చబోతున్నారు. దీని ఆనకట్ట దాదాపు 3.6 కిలో మీటర్ల మేర నిర్మించబోతున్నారు. ఈ మూడు చెరువుల ఉన్నతీకరణతో పాటు కెనాల్స్ ద్వారా సాగు నీటి సరఫరా ఏర్పాటుకు మొత్తం రూ.119 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఫలితంగా 10వేల ఎకరాలకు సాగు నీటిని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో రిజర్వాయర్ పనుల కోసం రూ.72.52 కోట్లు వెచ్చించబోతున్నారు. మరో రూ.46.89 కోట్లను గ్రావిటీ ద్వారా కెనాల్స్ నిర్మాణం చేపట్టేందుకు మంజూరు చేశారు. రిజర్వాయర్ నుంచి సాగు నీటిని పొలాలకు చేర్చేందుకు ఏక కాలంగా పనులు చేపట్టబోతున్నారు.
సిద్ధాపూర్ రిజర్వాయర్ కెపాసిటీని 409.56 ఎంసీఎఫ్టీ సామర్థ్యంతో నిర్మించనున్నారు. వర్ని మండలంలోని శ్యామ్రావు తండా, కోకల్దాస్ తండాలో 303 ఎకరాలు, చెల్క తండా, చింతల్పేట తండా, గుంటూర్ క్యాంప్, పైడిమల్ తండా పరిధిలో 1597 ఎకరాలకు సాగు నీరు అందనున్నది. బాన్సువాడ మండలంలో సంగ్రామ్నాయక్ తండా, అవాజ్పల్లి, కిమ్యానాయక్ తండా, పులిగుండు తండా, సోమాలినాయక్ తండా, గోపాల్ తండాలు కలిపి 4,400 ఎకరాలకు సిద్ధాపూర్ రిజర్వాయర్ ఊపిరి పోయనున్నది. నస్రుల్లాబాద్ మండలంలో హాజీపూర్, సంగం గ్రామాల్లో వేయి ఎకరాలకు నీరు అందునున్నది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండలంలో గౌరారం, సక్రామ్ తండా, సర్వాపూర్, అలుగు తండా, కంచరాయ్ తండా, హేమ్లా నాయక్ తండా, మొండిసడక్ తండా, గండివేట్ తండాలకు కలిపి 2,700 ఎకరాలకు రెండు పంటలు సమృద్ధిగా పండేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. రిజర్వాయర్కు, ఆయా గ్రామాలకు కనెక్టివిటీ పెంచేందుకు మూడు అప్రోచ్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. 3 తూములు బిగించబోతున్నారు. 4,170 క్యూసెక్కుల సామర్థ్యంతో వరదను బయటికి పంపేందుకు వీలుగా మత్తడి నిర్మాణం చేపట్టేలా డిజైన్ను ఆమోదించారు.
కామారెడ్డి, మెదక్ జిల్లాలోని లక్షా 56వేల ఎకరాల ఆయకట్టుకు నీరందరించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ -22 ద్వారా 11.50 టీఎంసీల నీటిని కొండెం చెరువు ముందు భాగం నుంచి ఎత్తి పోసేందుకు ప్రతిపాదించారు. రీ ఇంజినీరింగ్ కింద ప్రభుత్వం 44వేల ఎకరాల అదనపు ఆయకట్టును అందించడానికి కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-22 సవరించిన పనికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కామారెడ్డి జిల్లాలో 5 టీ ఎంసీలు నిల్వ సామర్థ్యం గల 5 కొత్త రిజర్వాయర్ల ఏర్పాటుకు ఆమోదం జరిగింది. కాటేవాడి – 0.50 టీఎంసీలు, మోతె – 2టీఎంసీలు, ధర్మరావుపేట- 0.50 టీఎంసీలు, ముద్దోజివాడి – 0.50 టీఎంసీలు, తిమ్మక్కపల్లి- 1.50 టీఎంసీల ద్వారా 44 వేల అదనపు ఆయకట్టును స్థిరీకరించబోతున్నారు. ఇందులో బా న్సువాడ నియోజకవర్గంలో నస్రుల్లాబాద్కు 1700 ఎకరాలు, బాన్సువాడకు 4700 ఎకరా లు, వర్ని మండలానికి 3300 ఎకరాలు గ్రావిటీ కెనాల్స్తో 9,700 ఎకరాలు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనల ప్రకారం భవిష్యత్తులో కాటేవాడి నుంచి అర టీఎంసీ నీటిని సిద్ధాపూర్ రిజర్వాయర్కు లింకు కలుపనున్నారు. వర్షాధారంగా వచ్చే నీటిని నిల్వ చేయడంతో పాటు వర్షాభావ పరిస్థితులు తలెత్తిన సమయంలో ప్యాకేజీ-22 ద్వారా సిద్ధాపూర్ రిజర్వాయర్కు కొండంత భరోసా కలుగనున్నది.
రాష్ట్రంలో ప్రతి పేదోడి కళ్లలో ఆనం దం చూడాలనే ధ్యేయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన అందిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికీ మేలు చేకూరుస్తున్నా రు. నేను ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్రాంతాల్లో నిజాంసాగర్ నాన్ కమాండ్ ఏరియా కొద్దిగా ఉంది. ఈ ప్రాంతంలో సాగు నీటి గోసను తీర్చేందుకు పూనుకున్నాం. ఇందులో భాగంగా సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని తలపెట్టాం. 10 వేల ఎకరాలకు సాగు నీటి సౌకర్యం కల్పించడం ద్వారా ముఖ్యంగా ఈ ప్రాంతంలో గిరిజన రైతులకు మేలు చేయబోతున్నాం. అతి త్వరలోనే మిగిలిన నాన్ కమాండ్ ఏరియాలోనూ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
– పోచారం శ్రీనివాస రెడ్డి, శాసన సభాపతి
మా చుట్టు పక్కల ప్రాంతాల్లో తండాలే ఎక్కువ ఉంటాయి. మాకు భూములున్నప్పటికీ నీటి సౌకర్యం లేక యాసంగికి ఇబ్బందులవుతున్నాయి. రిజర్వాయర్ కడితే రెండు సీజన్లలో పంటలు పండించొచ్చు. ఇప్పుడు సాగు చేయలేక పొలాలు ఖాళీగా వదిలేస్తున్నాం. మా ఏరియాలో ఇంత పెద్ద పని చేస్తుండడం మంచిగనిపిస్తున్నది.
– జీత్మాల్, సిద్ధాపూర్ సమీప తండాకు చెందిన రైతు
మా ఏరియాలో కొద్ది భాగానికి కాలువల ద్వారా పొలాలకు నీళ్లు రావు. ఎన్నో ఏండ్ల సంది చూస్తున్నాం. ఇన్నాళ్లకు మా కల నెరవేరబోతున్నది. పోచారం శ్రీనివాస్ రెడ్డి , సీఎం కేసీఆర్ సార్లకు ధన్యవాదాలు. మా భూములకు నీళ్ల సౌకర్యం పెరిగితే మాకు మంచి రోజులు వచ్చినట్లే.
– గాజీరాం, శ్యామ్రావు తండా రైతు