ఉమ్మడి జిల్లాలో తొలి రోజు ప్రశాంతం
34,556 మంది విద్యార్థుల హాజరు
373 మంది గైర్హాజరు
పరీక్షా కేంద్రాల్లో కలెక్టర్ల తనిఖీలు
కేంద్రాలకు గంట ముందే చేరుకున్న విద్యార్థులు
పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. గంట ముందు నుంచే విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్ద బారులు తీరారు. తొలి రోజు, తొలి ఎగ్జామ్ కావడంతో వారిలో కాస్త కంగారు కనిపించింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 34,929 మంది విద్యార్థులకు గాను 34,556 మంది తెలుగు పరీక్ష రాశారు. 373 మంది గైర్హాజరయ్యారు. కలెక్టర్ నారాయణరెడ్డి నగరంలోని పరీక్షా కేంద్రాలను పరిశీలించి, పలు సూచనలు చేశారు.
నిజామాబాద్, మే 23 : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు కొనసాగాయి. ఉమ్మడి జిల్లాలో 34,929 మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా, 34,556 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థుల హాజరుశాతం కామారెడ్డి జిల్లాలో 99.20, నిజామాబాద్ జిల్లాలో 98.78 నమోదైంది.
పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు శానిటైజర్తోపాటు మాస్కులను అందుబాటులో ఉంచారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఐదు నిమిషాలు ఆలస్యమైనా పరీక్షకు అనుమతించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు పరీక్షా కేంద్రాలను నారాయణరెడ్డి తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.