మెండోరా, జూలై 22: ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఎస్సారెస్పీ జలకళను సంతరించుకుంటున్నది. ప్రతి గంటకూ 0.20 అడుగుల నీటి నిల్వ పెరుగుతున్నది. 24 గంటల వ్యవధిలో 10 టీఎంసీల నీటిమట్టం పెరిగింది. జూలై 1 తేదీ నుంచి శనివారం వరకు 35 టీఎంసీల వరద వచ్చి చేరింది. భారీగా వరద వస్తుండడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశం ఉన్నదని రైతులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. దీంతో వానకాలం, యాసంగి పంటల సాగుకు ఢోకా లేదన్న భరోసా నెలకొన్నది.
పర్యవేక్షిస్తున్న అధికారులు..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఇన్ఫ్లో పెరుగుతుండడంతో సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీనివాస్, ఈఈ చక్రపాణి ప్రాజెక్ట్ నీటిమట్టాన్ని పర్యవేక్షిస్తున్నారు. స్థానిక ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించి, ఇన్ఫ్లో వివరాలు తెలుసుకున్నారు. ఎగువ, దిగువ గోదావరి తీర ప్రాంతాల్లో నీటి ప్రవాహం దగ్గరికి వెళ్లకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.
1,04,997 క్యూసెక్కుల ఇన్ఫ్లో..
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరదతో ప్రాజెక్ట్ నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. రిజర్వాయర్లోకి 1,04,997 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నదని ఏఈఈ నయనారెడ్డి తెలిపారు. అలీసాగర్ ఎత్తిపోతలకు 180, మిషన్ భగీరథ తాగునీటి కోసం 152 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారని తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా శనివారం సాయంత్రానికి ప్రాజెక్ట్ నీటిమట్టం 1082.10 అడుగుల (58.36 టీఎంసీలు) నీటి నిల్వ ఉన్నదన్నారు. గతేడాది ఇదే రోజున ప్రాజెక్ట్ నీటిమట్టం 1088.30 అడుగులు (77.383 టీఎంసీల) నీటి నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సీజన్లో ఎగువ ప్రాంతాల నుంచి రిజర్వాయర్లోకి 38 టీఎంసీల వరద వచ్చి చేరిందని ఏఈఈ వివరించారు.
ఎగువ ప్రాంతాల్లో నిండిన చెరువులు..
మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురవడంతో అక్కడి ప్రాజెక్టులు, వాగులు, చెరువులు నిండుకుండలా మారాయి. దీంతో అక్కడి నుంచి విడుదలవుతున్న మిగులు జలాలు శ్రీరాంసాగర్ను చేరుకుంటుండడంతో వరద ప్రవాహం పెరుగుతున్నది. విష్ణుపురి ప్రాజెక్ట్ నుంచి విడుదల చేసిన మిగులు జలాలు బాలేగావ్ ప్రాజెక్ట్లోకి చేరి, అక్కడి నుంచి మొత్తంగా 70 వేల క్యూసెక్కులు ఎస్సారెస్పీ రిజర్వాయర్లోకి వచ్చి చేరనున్నాయి. నిర్మల్ జిల్లా పరిధిలో కురిసిన వర్షాలతో 20 వేల క్యూసెక్కులు , గడ్డెన్న వాగు నుంచి 5 వేల క్యూసెక్కులు, మంజీర, నిజాంసాగర్ ప్రాజెక్ట్ల నుంచి 50వేల క్యూసెక్కులు, గోదావరి తీర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో 29,995 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. దీంతో ఎస్సారెస్పీ నీటిమట్టం గంటగంటకూ పెరుగుతున్నది.
నిజామాబాద్లో 30.7మి.మీల వర్షం..
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శనివారం 37.0 మి.మీ వర్షం కురిసింది. అత్యధికంగా కోటగిరి మండలంలో 81.4మి.మీ, ఏర్గట్ల 71.0 మి.మీ నమోదైంది. అత్యల్పంగా బోధన్ మండలంలో 11.7, మోస్రాలో 16.2 మి.మీ వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 10015.9 మి.మీల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు.