డిచ్పల్లి, ఫిబ్రవరి 23: ఖిల్లా డిచ్పల్లి సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి రథోత్సవం కనుల పండువగా సాగింది. ఆలయ ప్రధాన అర్చకుడు సుమిత్ శర్మ దేశ్పాండే నేతృత్వంలో ఉదయం హోమం, బలిహరణం, సాయంత్రం హోమం, బలిహరణం, రథప్రతిష్ఠ, రథహోమం, రథబలిహరణం కార్యక్రమాలు నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి హాజరై యజ్ఞంలో పాల్గొన్నారు. గ్రామపెద్దలు, భక్తులు, ఆలయకమిటీ సభ్యులు సీతారామచంద్రస్వామి గోవిందా, గోవిందా అంటూ నినాదాలు చేస్తూ రథాన్ని ముందుకు లాగారు.
మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి, కొబ్బరికాయలు కొట్టారు. అర్ధరాత్రి వరకు గ్రామంలోని ప్రధానవీధుల గుండా సీతారాముల రథయాత్ర కొనసాగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కార్యక్రమంలో ఖిల్లా రామాలయ చైర్మన్ జంగం శాంతయ్య, సభ్యులు గడ్డం నర్సారెడ్డి, సున్నం పోశెట్టి, సూరమాధురి, ఆసది జితేందర్, తాజా మాజీ సర్పంచ్ గడ్డం రాధాకృష్ణారెడ్డి, బూస సుదర్శన్, ఏజీ దాసు, విండో మాజీ చైర్మన్ గజవాడ జైపాల్ తదితరులు పాల్గొన్నారు.