నిజామాబాద్ లీగల్/ కామారెడ్డి, ఫిబ్రవరి 11: ఉమ్మడి జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 9,439 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో నిజామాబాద్ జిల్లాలో 6567, కామారెడ్డి జిల్లాలో 2,872 కేసులు పరిష్కారమయ్యాయి. నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవా సదన్లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల ప్రారంభించి మాట్లాడారు. ప్రతిరోజూ న్యాయపీఠాలు నిర్వహిస్తూ న్యాయార్థులతో మమేకం అవుతున్న న్యాయసేవా సంస్థకు మరింత ప్రోత్సాహం పౌర సమాజం అందించాలని కోరారు. సివిల్ వివాదాలను కక్షిదారుల ఉమ్మడి అభిమతం మేరకు అవార్డు జారీ చేసే దీర్ఘకాలిక పరిష్కారాన్ని సూచించగలిగామని వెల్లడించారు. నూతనంగా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ను ప్రారంభించుకుని నేరారోపణలను ఎదుర్కొంటున్న అర్హులైన ముద్దాయిలకు ఉచిత న్యాయసహాయం అందిస్తూ నూతన ఒరవడికి ఓనమాలు దిద్దుకున్న విషయాన్ని తెలియజేశారు. అదనపు జిల్లా జడ్జీలు శ్రీనివాస రావు, షౌకత్ జహాన్ సిద్దిఖీ మాట్లాడుతూ అందరికీ న్యాయసేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్, జూనియర్ సివిల్ జడ్జీలు భవ్య, సౌందర్య, గిరిజ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రం గణపతి, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజ్కుమార్ సుబేదార్, ఎస్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీదేవి, లీగల్ ఎయిడ్ డిప్యూటీ కౌన్సిల్ ఉదయ కృష్ణ, ప్యానల్ న్యాయవాదులు బట్టు మానిక్ రాజు, జగన్ మోహన్ రెడ్డి, మానస, ఝాన్సీ, ప్రవీణ, ఝాన్సీ నాయక్ పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా 6,567 కేసులను పరిష్కరించినట్లు జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి తెలిపారు. కామారెడ్డిలో 2,872 కేసులు కామారెడ్డి కోర్టు ఆవరణలో నిర్వహించిన లోక్అదాలత్లో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా జడ్జి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లోక్ అదాలత్లో 2,872 కేసులు పరిష్కారమైనట్లు తెలిపారు. ఇందులో క్రిమినల్ కేసులు 2,786, సివిల్ కేసులు 35, పీఎల్సీ కేసులు 51 ఉన్నట్లు పేర్కొన్నారు. ఈసారి ఎక్కువ మొత్తంలో కేసులు పరిష్కరించడానికి తగిన విధి విధానాలను జిల్లాలోని న్యాయాధికారులను ఆదేశించినట్లు తెలిపారు. చిన్న చిన్న తగాదాలు, కుటుంబ తగాదాలు, ఇన్సురెన్సు కేసులు, సివిల్ తగాదాలు, భూ సమస్యలు పరిష్కరించినట్లు వివరించారు. లోక్ అదాలత్లో భార్యాభర్తలిద్దరినీ కలిపి వారికి పూలను అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్పీ శ్రీనివాస్రెడ్డి, సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్, మొదటి అదనపు జిల్లా జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్, మొబైల్ మెజిస్ట్రేటివ్ వెంకటేశ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అమృత రావు, న్యాయవాదులు సిద్దిరాములు, లక్ష్మీ నర్సింహారెడ్డి, రమేశ్ చంద్, నరేశ్ చంద్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అశోక్, నంద రమేశ్, నిమ్మ దామోదర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, సీఐలు, ఎస్సైలు, తహసీల్దార్లు పాలొన్నారు.